Search This Blog

Monday, December 31, 2007

krantikumaar

ఆ సుడిగాలి వెంకే కర్రపుల్లలూ ఆకులూ కొట్టుకొచ్చినట్టు కొంతమంది యువకులు కూడా పరిగెత్తుకొచ్చారు . మా అబ్బాయి ఎన్ టీ ఆర్ , కృష్ణ సినిమాలు వంటపట్టించుకుని ఇప్పుడు ఫైటింగవుతుందా అని అడిగేడు.క్రాంతి నా వెనకాలకి వెళ్ళి నిలబడ్డాడు.యెవరు మీరు అని అడిగేడు పెద్ద కర్రపుల్ల. చెప్పాను. యూనివర్సిటీ ఉపాధ్యాయుడిననీ కొంతకాలం ముందు క్రాంతి మిత్రుణ్ణనీ.విజయనగరం కాలేజిలో కలిసి చదివామనీ చెప్పాను. మీరు క్రాంతిని కలిసి యెన్నాళ్ళయింది అని అడిగేడు. అప్పటికి పదిపన్నెండేళ్ళయింది. ఆ మాటే చెప్పాను. మధ్యలో కలవనేలేదా అని సందేహంగానే అడిగేడు. లేదన్నాను. అప్పటికి కొంచెం సమాధానపడ్డాడు.నేనెక్కడుండేదీ చెప్పి క్రాంతిని మర్నాడు మా యింటికి పంపించమన్నాను. నేను యెవరినో తెలిసేక కొంచెంలొంగి వచ్చారు. సరే నన్నారు. క్రాంతికి ఏమీ భయం లేదనీ మర్నాదు నా దగ్గరకి రమ్మనీ చెప్పి ఇంటికి వెళ్ళ మన్నాను. కొంచెం బిక్కుబిక్కుగా చూసేడు. ఉండేదెక్కడని కర్రపుల్లలని అడిగేను . యెదురుగా వున్న ప్రెస్సే ఇల్లన్నారు. నేను కూడా లోపలకి వెళ్ళి క్రాంతిని గదిలోకి వెళ్ళమని వాడు వెళ్ళాక కర్రపుల్లలని అడిగేను. అసలీ డ్రామా అంతా యేమిటని.సార్ మీతో చెప్పడానికేమిటి. క్రాంతిబాబు మా వూళ్ళో ఒక అమ్మాయిని ప్రేమించానంటున్నాడు.ఆ అమ్మాయి కనపడకపోతే చచ్చిపోతానని గోల మొదలు పెట్టి పిచ్చి చేష్టలు చెయ్యడం కూడా మొదలు పెట్టాడు. అందుకని వాళ్ళ బాబాయి గారు ఇక్కడైతే జాగర్తగా వుంటాడని మమ్మల్ని కాపలా పెట్టారు. యీ ప్రెస్సు వాళ్ళదే అని చెప్పారు.గాలితీసిన బుడగలాగా అయ్యేను. నేనేదో డ్రమాటిక్ గా నక్సలిజమూ అండర్ గ్రౌండూ అన్నీ వూహించుకుంటే ఇలా చింతకాయపచ్చడి బయటకొచ్చింది. సరే రేపు నా దగ్గరకి పంపండి నేను చెప్పి బాగుచేస్తాను అని తిరుగు ముఖం పట్టేను. ఇంటికి వెళ్ళాక మా రెండో వాడు మంచి సీనులో తను లేకపోయినందుకు చాలా చింతించేడు.

Thursday, December 20, 2007

krantikumaar

నేను గుర్తుంచుకునే వారిలో ఒక ప్రతేక వ్యక్తి క్రాంతికుమార్. క్రాంతి అని పిల్చే వాళ్ళం. నేను బీ ఎస్ సీ చదువుతున్నప్పుడు బీ ఏ పాలిటిక్సో ఎకనామిక్సో చదివే వాడు. నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించడంలో నిష్ణాతుడు[!]. ఈ కాలం వాళ్ళకి వాల్వు రేడియో చూపిస్తే యెంత వింతగా వుంటుందో మగవాళ్ళు స్త్రీ పాత్రలు వెయ్యడం కూడా అంత వింత గానే వుంటుంది.మరి 1960 -63 రోజుల్లో అంతే. ఈ కష్టాలు లేకుండా స్త్రీపాత్రలు లేని నాటకాలు కూడా రాసే వాళ్ళు రచయితలు. విముక్తుడు, విలువలు, ఆడది లాంటి అనేక పేరుగన్న నాటికలుండేవి.క్రాంతి మాటకొస్తే అతను ఆడవేషం కడితే నిజంగా అమ్మాయి లానే వుండే వాడు.ఒక రకంగా నాకు మొదటి ప్రియురాలు అతనే.అతను సర్దార్ గౌతు లచ్చన్న గారికి సోదరుని కొడుకు.ఆయనకే పెంపుడు కొడుకు లాటివాడు.అ కాలంలో అందరు యువకుల్లాగే అతనూ విప్లవ భావాలు మెండుగా వున్నవాడు. మా అందరితోనూ కలిసి విప్లవ సంభాషణలు కబుర్లు బాగానే చెప్పేవాడు.ఆ రోజుల్లో శ్రికాకుళం జిల్లా నించి చాలామంది విజయనగరం మహారాజా కాలేజ్ లో చదవడానికి వచ్చే వాళ్ళు. క్రాంతి తో పాటు బి యే చదివినవారిలో చౌదరి తేజేశ్వరరావు ఒకడు. కొంత కాలం ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్ ఎఫ్ ఐ కి నేను అద్యక్షుణిగానూ తేజెశ్వరరావు కార్యదర్సి గానూ వుండేవాళ్ళం అప్పటికింకా కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలలేదు[ ఇప్పుడు అసంఖ్యాకంగా చీలిందనుకోండి. అది అప్రస్తుతం] చీలిన తరువాత నేను నెమ్మదిగా ఆ కార్యకలాపాలకి దూరం కావడం తేజేశ్వరరావు మరో రకంగా ప్రఖ్యాతుడవడం జరిగింది.క్రాంతి గురించి చెప్పుకుంటున్నాంకదా! అతని మాట అచ్చు అమ్మాయి మాట లాగే వుండేది. ఈ బ్లాగులో చెప్పడం యెందుకంటే క్రాంతి బియే పాసవలేదు. నేను విశాఖ వచ్చాను. తరవాత చాలా జీవితం గడిచాక నా పెళ్ళి అయి పిల్లలు పుట్టి యూనివర్సిటీలో మంచిగానూ చెడుగానూ పీరుపొందాకా 1975లో అను కుంటాను విశాఖలో మెయిన్ రోడ్డుమీంచి లక్ష్మీ టాకీసు బస్ స్టాపుకి మా పెద్ద వాణ్ణి[అయిదేళ్ళు వాడికి] తీసుకుని కబుర్లు చెప్పుకుంటూ నడిచి వస్తుంటే ఒక ఇంటిలోంచి [గోదావరి టింబర్ డిపో కి ముందు ఇల్లు] సుడిగాలిలా పరిగెట్టుకుని వచ్చి అచ్చం కాళరాత్రి నాటకంలో దెయ్యాన్ని చూసి పరిగెత్తుకుని వచ్చి నన్నెలా అల్లుకుపోయాడో అలాగే వచ్చి వాటేసుకున్నాడు. యేమయింది ? బ్లాగులోనైనా కొంచెం ఉద్విగత వుండాలికదా. రేపు చెప్తాను.

Saturday, November 24, 2007

still on dipavali

సిసింద్రీ అంటే తారాజువ్వకి చిన్నతమ్ముడు.అన్నిటి కన్న చిన్నది. మతాబాల్లాగే గట్టి కాగితం తో చేసిన గొట్టాల్లో మందు కూరి చెయ్యాలి. గొట్టాలు కిళ్ళీ ఆకారంలో వుండాలి.తారాజువ్వ ఫామిలీలో చాలామంది వుంటారు. సిసింద్రి యెక్కువగా చిన్న పిల్లలాడేది. కొండొకచో కాలేజ్ విద్యార్ధులు అమ్మాయిలని అల్లరి చెయ్యడానికి వాడడం కూడా మామూలే. దీని కన్నా పెద్దది పావు గొట్టం. వుండడానికి సిసింద్రి సైజులోనే వుంటుంది గాని సిలిండ్రికల్ గొట్టం లో వుండి ఒక చీపురుపుల్లకి కట్టి వుంటుంది. ఆ పుల్ల ధర్మమా అని ఇది కొంత దూరం గాల్లోకి వెళ్ళగలదు. దీనికన్నా పెద్దది అరగొట్టం.అన్నిటికన్నా పెద్దది మరి తారాజువ్వ. అది వెలిగించి గాలిలోకి వదలడమే పెద్ద ఆర్టు.అది వేగం అందుకున్న దాకా పట్టుకునే వుండి అందుకోగానే వదలాలి. లేకపోతే నేల మీదే తిరిగి యెవరికో ఒకరికి ఒళ్ళు కాలుస్తుంది.యెక్కువసేపు పట్టుకుంతే మరి చేతిలోనే చీదేస్తుంది.చేతికిచేటు. ఇప్పుడు వచ్చే రాకెట్లలో ఇంత విద్య యెక్కడ. ఇంత వయ్యారం యెక్కడ. సీసాలో పడేసి వెలిగించడమే.తారాజువ్వకి వేలు విడిచిన బాబాయి వెలంకాయ. పచ్చి వెలగ కాయలో గుజ్జంతా తీసేసి అందులో తారాజువ్వ మందు కూరతారు. అత్యంత నిష్ణాతులకు గానీ పట్టుబడనిది ఇది వెలిగించే కళ.అదివెలిగించి గాల్లోకి వదిలితే స్పైరల్ లాగ తిరుగుతూ ఆకాశం లో కను విందు చేస్తుంది. విచారమంతా ఈ రోజుల్లో ప్రతీదీ డబ్బు పారేస్తే వస్తుందనే భావన. అనుభూతి రాదనే అవగాహన లేకపోవడం. దీనికి తోడు అడుగడుగునా మేమున్నామనే కిల్ జాయ్ లు. ఒక యిద్దరు ప్రత్యేకవ్యక్తులగురించి ముచ్చటించినా జ్ఞాపకాల్లో తరువాతి ముఖ్య ఘట్టానికి వస్తాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం నా జీవితం.

Thursday, November 15, 2007

deepaavali2

అవును రేపే అన్నాను కానీ యేదో పని పడింది. సురేకారం ఇత్యాదులన్నీ యెండబెట్టాక వాటిని సరైన పాళ్ళలో కలపాలి. మతాబాలు లేదా వెన్నముద్దలకీ చిచ్చుబుడ్లకీ దాదాపు ఒకే పాళ్ళు. చిచ్చుబుడ్లు మందారకుంపీలు కావాలంటే ఇనుప రజను వేస్తాం.మతాబులైతే తయారు చేసి వుంచిన కాగితం గొట్టాలలో మందు కూరాలి.దానికి ముందు గొట్టం అడుగున ముగ్గు కొంచెం వేయాలి.చెయ్యి కాలకుండా అన్నమాట.ఆముదం తక్కువైతే నిలిచికాలదు.యెక్కువైతే పొగకమ్మేస్తుంది.అదే చేతి చలవ. చిచ్చుబుడ్డి అయితే కుమ్మరి దగ్గర కొనుక్కొచ్చిన ఖాళీ కుంపీలలో కూరాలి.దీనికి మాత్రం ముందు కొంచెం సిసింద్రీ మందు వెయ్యలి. లేకపోతే అందుకోదు.అంతా అయ్యాక కింద కొంచెం బంకమన్ను వేసి సీల్ చెయ్యాలి.చిచ్చుబుడ్డీకూరదం లూజయితే పూలు పైకి రావు. టైటయితే పేలుతాయి. ఇదీ చేతి చలవే.ఇవన్నీ వొకెత్తూ సిసింద్రీలు వాటి ఆటలూ వొకెత్తూ.అది మరోసారి.

Tuesday, November 13, 2007

deepavali

దీపావళి వచ్చింది , నాగులచవితికూడా వెళ్ళిపోయింది.జ్ఞాపకాలుమాత్రం కళ్ళముందే తిరుగుతున్నాయి. మా చిన్నతనంలో దీపావళి అంటే నెలరోజుల ముందు నించే సందడి మొదలు. సాధారణంగా మందంగా వుండే కాగితాలకోసం వేట. పోస్టాఫీసు దగ్గర మొదలయ్యేది. మనియార్డరు ఫారాలు వూరికే ఇచ్చేవాళ్ళు. మా అమ్మగారు డాక్టరు కాబట్టి మందుల కంపెనీ కాగితాలు కొల్లలు. మాది కమూనిస్టు కుటుంబం కనుక సొవియట్ భూమి ఇతర కాగితాలూ కూడా సమృధ్ధి గా వుండేవి. మా మిత్రులందరిలోనూ అత్యంత అదృష్టవంతుడిగా వాళ్ళకి కూడా సప్లై చేసేవాడిని. తరవాత మైదా తెచ్చి కుంపటి మీద వుడకపెట్టి పేస్టు తయారు చెయ్యడం.మేం తెచ్చిన కాగితాలని మతాబుల కోసం గొట్టాలు గానూ సిసింద్రీల కోసం శంఖం ఆకారం లోనూ తయారు చెయ్యడం యెండబెట్టడం. అప్పుడు కన్యకా పరమేస్వరి ఆలయం దగ్గర వుండే మందు సామానుల కొట్లకి వెళ్ళడం.సురేకారం, గంధకం,బీడూ బొగ్గు పొడి, ఆముదం లాంటి సామానులు కొని తేవడం. తెల్లని పూలు రావాలంటే అల్యుమినం బీడు యెర్రని పూల కోఅసం ఇనుము బీడు. దేనికి యెంతెంత పాళ్ళు కలపాలో షాపు లోనే గోడ మీద రాసి వుండేది . యింటికి వచ్చాక వీటిని యెండబెట్టడం. తరవాతేం చేస్తామో రేపు, అవును నిజంగా రేపే రాస్తాను.

Sunday, October 28, 2007

paiditalli

టెలివిజన్లో వార్తావాహికలు తామరతంపరగా పెరిగిపోవడంతో చూపించడానికి వస్తువులు వెతుక్కుంటున్నారు. యేతావాతా విజయనగరం పైడితల్లమ్మ జాతరని చూడడం జరిగింది. నేను చెపుతూ వచ్చిన మా ఇల్లూ ఆ పక్కన ద్వారం వారుండిన ఇల్లూ అవీ అలానే వున్నట్టు అనిపించింది. కాస్మెటిక్ మార్పులూ కొంచెం కమ్మర్షియల్ మెరుగులూ తప్పితే వూరు పెద్దగా మారినట్టనిపించలేదు--తెలుగు సినిమాలా-- మా ఇంటి యెదురుగా కో ఆపరేటివ్ బాంకు ఉందని చెప్పాను కదా ఆ భవనంలో ఒక పక్క మేడమీద గెస్టు రూములు ఉండేవి. అందులో ఒక దానిలో ఒక ఆఫీసర్ చాలాకాలం ఉండేవారు. చాలా యెర్రగా సన్నగా కొంచెం పొడుగ్గా ఉండేవారు. ఆయన్ని బల్లి గాడని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం. మాకెవరికీ పెద్ద పరిచయం లేకపోయినా.ఒకసారి యెందుకో ఆయన రూముకి వెళ్ళడం తటస్థించింది. ఆయన టేబుల్ పైనా అలమారలోనూ ఉన్న పుస్తకాలూ చూసి ముగ్ధుణ్ణయాను. ఆంధ్ర సాహిత్యంలో చెప్పుకోదగ్గ పుస్తకాలన్నీ ఆయన వద్ద వున్నాయి.ఆయన మీద గౌరవం పెరిగింది. బల్లిగాడని పిలవడం మానేశాం. చదువుకున్న బల్లి అనడం మొదలుపెట్టాం.

Friday, October 19, 2007

happy dasara

మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. విజయనగరంలో మేమొకప్పుడుండిన ఇంటి సంగతి చెప్పుకుంటున్నాం కదా. మొదట్లో ఆ ఇంటిలో మేడపైనే వుండేవాళ్ళం. నాకు బహుశా అయిదేళ్ళుంటాయేమో. ఆ మేడమెట్లపైనించి మొగ్గలేసుకుంటూ కింద పడ్డాను.తలమీద కూడా లాండయ్యాను. అందుకే కొంచెం వెర్రి యెక్కువేమోననిపిస్తుంది అప్పుడప్పుదు. నిజానికి అప్పటికి నేను చూసిన కొన్ని సినిమాల బట్టి చచ్చిపోవడమో పిచ్చెక్కడమో లేక అన్నీ మరిచిపోవడమో అవాలి. యేదీ కాకపోవడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాలని నమ్మడం అప్పట్నించే మానేశాననుకుంటాను. ఆ రోడ్డు మీద మా ఇంటి తరవాత రాజు కిరాణా కొట్టుండేది.దానికెదురుగా లాయరు మొసలికంటి రామారావు గారి యిల్లు ,దాని పక్కన ఒక మిఠాయి షాపు. రాజు కొట్టు తరవాతే చిదంబరం కొట్టు.చిదంబరం కొట్టు తరవాత ఒక ఫాన్సీ షాపు ఉండేది. ఆ షాపు మాత్రం చాలారోజులుంది. మా పిల్లలకి కూడా అవీ ఇవీ కొనిపెట్టే వాళ్ళం. మరి ఇప్పుడుందోలేదో తెలియదు. అదే ఆ రోడ్డు కార్నర్.రోడ్డెదురుగా కోఆపరేటివ్ సెంట్రల్ బాంక్ ఉంటుంది. ఆ జంక్షన్లో ఒకసారి లారీ కింద పడబోతుంటే ఒక రిక్షా వాడు తృటిలో వెనక్కి లాగేడు.ఆ జంక్షన్లో యెడమ వైపు తిరిగితే కోట ముఖద్వారానికి వెళతాం. కుడిసైడు కార్నర్లో ఒక కర్రల అడితీ ఒక కిళ్ళీ కొట్టూ ఉండేవి.వెనక కందకం, కోటగోడా. ఇప్పుడా కందకం అంతా కప్పేసి షాపింగ్ కాంప్లెక్సులు కట్టేరని నాగరాజుగారు మైల్లో చెప్పారు.యెడమపక్క తిరిగితేఫాన్సీ షాపు పక్కన ఒక సైకిల్ షాపు తరవాత నేను కాలేజ్ కి వచ్చాక మేం ఉన్న ఇల్లు దాని పక్కన మా చిన్న తనంలో ద్వారంవెంకతస్వామినాయుడు గారుండిన ఇల్లు వస్తాయి.ఆ జ్ఞాపకాలు మరోసారి

Tuesday, October 16, 2007

saahityam

నిన్న యేదో సందర్భంలో ఉండమ్మాబొట్టుపెడతా లోని యెందుకీసందెగాలి అన్న పాట వినడం తటస్థించింది. ఆ తరవాతే సన్నగవీచే చల్ల గాలికి అన్న పాట--అప్పుడనిపించింది. ఈనాటి సినిమాల్లో కూడా ఇలాంటి సంగీతమూ కవిత్వమూ ఉంటే మనుషుల్లో ఈ నాడున్న కంగారూ అభద్రతా ఉండవేమోనని.నిజంగా ఆ రోజుల్లో డిగ్రీ క్లాసులో ఇంగ్లీషు తెలుగు సాహిత్యం విభిన్న పాత్రల స్వభావాలూ చిత్రీకరణా అన్నీ చెప్పడం జరిగేది. నిజంగా వాటిని జీవితంలో అనుసరించకపోయినా ఇది మంచిది వీడు మంచివాదు లేకపోతే ఇలా ప్రవర్తిస్తే మంచివాడంటారు అనే విచక్షణ కొంచెమైనా మనసులో నాటుకునేది. చెడ్డపని చేసినప్పుడు అంతరాంతరాలలోనైన కొంత జంకుగా వుండడం అలాంటివి చాటుగా చెయ్యడం ఉండేవి.సాహిత్యం మన జీవితంలో పోషించే పాత్ర అంచనాలకి అందనిది.మరీ భాషాజ్ఞానం అదీ మాట్లాడడానికి సరిపోయేంత అని నిర్దేశించి ఒక తరం ప్రవర్తనా సరళిని ప్రభావితం చేశారనిపిస్తొంది.

Saturday, October 13, 2007

vijayanagaram

నిన్నటి పోస్టు మిత్రుల్లో కూడా జ్ఞాపకాలని కదిపింది. టాన్ తీటా అన్న పేరు ఇంకా సన్నని సన్నజాజులకి వాడుతూనే వున్నామని ఒక మిత్రులన్నారు. అలాగే ఇంకో అమ్మాయి ఉండేది. కొంచెం మిరపకాయ తత్వం ఉండేది. వాళ్ళ నాన్న గారు అగ్గిపెట్టెల కంపెనీ డీలరు. ఆ పిల్లకి అగ్గిపెట్టె అని పేరుండేది. ఈ పేరు ఇప్పుడుండే అవకాశం లేదు.. ఉదయగిరివారింటిదగ్గిర ఆగాం కదా. కొంచెం ముందుకి వెళితే లలితావిలాస్ స్కూలు వస్తుంది. రోడ్దు మీంచి కొంచెం లోపలికి వెళ్ళాలి లెండి. ఆలోపలికి వెళ్ళేటప్పుడు జీవీరమణమూర్తీ వాళ్ళ ఇల్లు వస్తుంది. వాణ్ణి మరణమూర్తి అంటే గింజుకునేవాడు. ఇది దాటి రోడ్డు మీద ఇంకా ముందుకి వెళితే గురజాడ అప్పారావు గారి ఇల్లు వస్తుంది. మా చిన్నప్పుడు ఆ యింట్లో అప్పారావు గారి పుత్రులు రామదాసు గారూ కుటుంబమూ వుండేవారు.ఒక భాగం స్థానిక గ్రంధాలయానికి అద్దెకి ఇచ్చారు.ఆ యింటి యెదురుగా ఒక సందు వుంది. ఆ సందులో లోపలకి వెళితే నా చిన్న తనం చాలా భాగం గడిచిన ఇల్లు వస్తుంది. ఆ ఇంటి పక్కింట్లోనే ద్వివేదుల నరసింగరావు గారూ, తరువాత కొత్తపల్లి వీరభద్రరావు గారూ వుండే వారు.రోజూ స్కూలుకి అప్పారావు గారి ఇల్లు చూసుకుంటూనే వెళ్ళే వాళ్ళం. అందుకేనేమో సాహిత్యాభిరుచి ఇంతో కొంతో జీర్ణమయింది.సందులోకి వెళ్ళకుండా ముందుకి వెళితే యెడమవైపు నేను మరీ చిన్నవాడిగా ఉన్నప్పుడు వున్న ఇల్లు వస్తుంది. మేము ఆ ఇంటిలో ఉన్నప్పుడు అరుణా అసఫ్ అలీ, సొహన్ సింఘ్ భాక్నా ,భూపెష్ గుప్తా , జ్యొతీ బసూ మొదలయిన అనేకులు మా యింటిలోనే ఆతిధ్యం పొందారు. ఆ ఇంటి లో ఒక రెందు వందల మంది దాకా కూర్చొ గలిగే ఆరుబయలు వసారా వుండేది. ఆ వసారాలో కూర్చుని మా నాన్నా, అమ్మా , బావామరుదులైన తరిమెలనాగిరెడ్డి గారూ నీలం సంజీవరెడ్డి గారూ ఇల్యా యెహ్రెంబెర్గ్ 'థా' నవల గురించి చర్చించుకోడం లీలగా గుర్తుంది.నాగిరెడ్డిగారి ని చూసి అంత గొప్ప వ్యక్తి చార్మినార్ సిగరెట్లు కాల్చడం నాకు వింతగా అనిపించేది. ఇంకా స్మృతులు రేపు .

Thursday, October 11, 2007

hello friends

చాలా కాలమైంది మిత్రులందరినీ పలకరించి.నేను హస్పిటల్ నించి వచ్చిన తరువాత ఒక నెల రోజులు నన్ను చిన్నపాపలా చూసుకున్న నా భార్య కొంత అస్వస్థురాలవడంతో సమయం చిక్కలేదు. మధ్యలో కుంభవృష్టి- యెప్పుడూలేనంతగా మా యింటిలోకి కూడా నీళ్ళు రావడం గందరగొళం అంతా సందడిగా గడిచిపోయింది. యిప్పుదు అంతా కుదుటబడింది. విజయనగరం జ్ఞాపకాలలో కాలేజ్ వర్ణణ తో మళ్ళీ అక్కడ తిరుగుతున్న అనుభూతి కలిగింది. కాలేజ్ ఊరిమధ్యలోనే వుంది.--ఆ రోజుల్లో. యిప్పుడు మరి వూరెంత పెరిగిందో ఒకసారి వెళ్ళి చూడాలి. నలభై మైళ్ళ దూరంలోనే వున్నా యింతకు ముందే చెప్పినట్టు మనో చిత్రాలేవి చెరిగిపోవలసి వస్తుందో అనే భయం వెళ్ళనీకుండాచేస్తోంది. కాలేజ్ మైన్ గేట్ నించి యెడమవైపు ఒక పెద్ద రోడ్డు వెళుతుంది. మా యింటికి వెళ్ళే దారి అదే.కాలేజ్ యెదురుగానే ఒక చిన్న రామాలయం ఉంది. ఆ రోడ్డు మీద కొంచెం ముందుకి వెళితే ఒక రెండంతస్థుల యిల్లు వస్తుంది. ఆ యింటిలో అప్పుడు ఒక తమిళ కుటుంబం వుండేది. వారమ్మాయి , జయలక్ష్మి అని గుర్తు, మాకు మూడు నాలుగేళ్ళ సీనియర్. అందంగానే వుండేది. చాలా సన్నగా పొడుగ్గా ఉండేది. విద్యార్ధులందరూ ఆప్యాయతతో ఆమెని టాన్ తీటా అని పిలుచుకునే వారు. ఆ యింటి తరవాత రోడ్డు యెడమ పక్కకి తిరుగుతుంది. ఆ రోడ్డు ని ఆను కుని రాజా వారి కోట గోడా దాని చుట్టూ కందకం.అక్కడ కుడిపక్కకి ఒక మట్టి రోద్దు వుండేది. దాని సంగతి తరవాత. మన మైన్ రోడ్డు మీద ముందుకి వెళితేఉదయగిరిసీతారామస్వామి గారి యిల్లు వస్తుంది.ఆయన పెద్ద లాయరు, నేను చిన్నప్పుడు చదివిన లలితా విలాస్ స్కూలు మేనేజరు. వారమ్మాయి వుమన్స్ కాలేజ్ లో లెక్చరర్ గా చేసింది. మేం చదివే రోజుల్లో వుమన్స్ కాలేజ్ లేదు. వారబ్బాయి మాధవరావు మాకు కొంచెం సీనియరే అయినా మిత్రుడు చిన్నప్పుడు అందరం ఆడుకునే వాళ్ళం. ఈ మధ్యనే బాచ్ మేట్స్ సైటులో కలిసి పలకరించాడు. జ్ఞాపకాలు ముంచెత్తుకొస్తున్నాయి. కొంచెం వడబోసి మళ్ళీ రాస్తాను.

Sunday, September 23, 2007

varsham

వర్షం వచ్చి వెలిసింది. ఒక వారం రోజులుగా రోజూ వర్షమే. కుండపోత కాకపోయినా జల్లుజల్లుగా.కడుపునిండినవాడికి మనసు చల్లగా. మా వూళ్ళో బీచ్ రోడ్డులో వర్షం పడుతుంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం యెంత బాగుంటుందో. సముద్రం మనతో యేదో చెప్పాలని కుతూహలపడుతున్నట్టు యెగిరెగిరిపడుతూ ఉంటుంది.లాలపాడిపడుకోబెట్టిన పిల్లలా ఇసుకంతా తడిసి యెగరకుండా కదలకుండా వుంటుంది. బీచ్ రోడ్డులో ఒక ఓపెన్ ఎయిర్ రెస్టరెంట్ ఉంది. యెండ తగలకుండా వేసిన గొడుగుల కింద కూర్చుని వాన చూస్తూ బజ్జీలు తింటుంటే హాయిగా వుంటుంది.జంక్ ఫుడ్ తిన కూడడని విజ్ఞులు చెప్పినా ఇలాటి ఆనందాలు లేని జీవితాలు కలకాలం యెందుకనిపించదా. కారు ఇప్పుడొచ్చింది కాని కాళ్ళు పుట్టినప్పట్నించీ వున్నాయికదా. చదువుకునేటప్పుడూ పెళ్ళయిన కొత్తలోనూ మా పిల్లలకి ముఫ్ఫయ్యేళ్ళు వొచ్చిందాకా బీచ్ లో ఆనందించిన క్షణాలు యెన్నో యెన్నెన్నో. ఆర్ కే బీచ్ అంటేనే విశాఖపట్నం అప్పుడూ యిప్పుడూ కూడా. ఆకారం పూర్తిగామారిపోయినా కూడా. యిప్పుడు కమ్మర్షియల్ అని నేననను. యే రోజుల అవసరాలు అప్పటివి. మేం చదువుకునే రోజుల్లో ఆ బీచ్ లో క్వాలిటీ రెస్టరెంట్ వుండేది. అక్కడో లావుపాటి ముసలాయన [మాకలా అనిపించేది. కాని యేభయ్ యేళ్ళుండేవేమో] వుండేవాడు. మేమెప్పుడయినా వెళితే చాలా అనుమానంగా చూసేవాడు. వీళ్ళసలు డబ్బులిచ్చే రకాలేనా అల్లరి చేసి పోతారా అనుకునే వాడేమో. అతని తప్పు లేదు. అయిస్ క్రీములూ ఫింగర్ చిప్సూ నాన్ లూ ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళ సరదాలే. మామూలు వాళ్ళంతా వేరుశనక్కాయలూ, ముంతకిందపప్పూ తినే వాళ్ళు. పిచ్చి ముండాకొడుకు తనిచ్చే ఫింగర్ చిప్సు ముంతకిందపప్పు కాలి గోటిక్కూడా సరిపోదని వాడికి తెలీదు-- అని అనుకునే వాళ్ళం. కాని ఇంత వయసు అనుభవం ఒచ్చాక ఒక అనుమానం ఒస్తోంది. తన రూములో కూర్చుని ముంతకింద పప్పు తింటూ మమ్మల్ని చూసి వెర్రివెధవల్లారా అని నవ్వుకునే వాడేమో.

Monday, September 17, 2007

early worm

నాకు చాలా కాలంగా ఒక సందేహం మనసులో అలా వుండిపోయింది.early bird catches the worm అనే నానుడి విని పొద్దున్నే లేచిన worm గురించి యెవరూ మాట్లాడరేమా అని. మరి ఆ worm పక్షికి దొరికి ప్రాణం సమర్పించుకుందికదా. ఆ రకంగా పొద్దున్నే లేవడం ప్రాణాంతకమని చెప్పుకోకూడదా? సరిగ్గా ఇదే ప్రశ్న నేను ఈ మధ్యనే విపులలో చదివిన ఒక కధలో కూడా వచ్చింది. జవాబు కూడా కొడవటిగంటి కుటుంబరావు గారి లెవెల్లో రాశాడు రచయిత.నాజ్ఞాపకాల గురించి ఒక సారి మరిచిపోయి ఆ కధని యధాతధంగా అందిస్తున్నా చూడండి. నమ్మి చెడ్డ కుందేలు. యే పనీ చెయ్యకుండా పొద్దుట్నించీ చెట్టు చిటారు కొమ్మనే కూర్చున్న ఆకతాయి కాకిని చూసి ఆశ్చర్యపడింది ఓ కుందేలు పిల్ల. తనేమో క్షణం తీరిక లేకుండా ఆహారం వెదుక్కుంటూనే ఎప్పుడు ఏం ముంచుకొస్తుందోననిభయపడుతోంది. మరి ఇది ఇంత తీరికగా యే పనీ లేకుండాఎలా కూర్చుంది అనుకుంది.అందుకే 'మిత్రమా చాలా సేపటినించి అక్కడే అలాగే కూర్చున్నావ్. ఏం చేస్తున్నావ్?' అని అడిగింది కుందేలుపిల్ల. ' అడవి అందాలని చూస్తున్నానూ అంది గర్వంగా ఆకతాయి కాకి. ' సరే , నేనూ నీలాగే చూడచ్చా ?' కుందేలుపిల్ల అమాయకంగా ప్రశ్నించింది. 'చూడు. ఎవరొద్దన్నారు?' తిరస్కారంగా అంది కాకి. సరేనని ఆచెట్టు కిందే ఓ బండరాయిని ఆనుకుని అడవి అందాలను ఆస్వాదించడం మొదలెట్టింది కుందేలుపిల్ల. చివరకు అటు ఎవరొస్తున్నారో గమనించనంతగా ప్రకృతి ఆరాధనలో పడిపోయిందది. అంతలోనే అటుగా వచ్చిన ఓ తోడేలు కలల్లో తేలియాడుతున్న కుందేలుపిల్లను గుటుక్కున మింగేసింది. నీతి: ఎత్తున వున్న వారికి మాత్రమే ఊరికే కూర్చున్నా చెల్లుబాటు అవుతుంది. ఈ కధని సీ వీ అనే వారు రశారు. సెప్టెంబరు విపులలో ప్రచురితమైంది.

Monday, September 10, 2007

pakir doki

నేను మరిచిపోలేని ఇంకో వ్యక్తి పకీర్ డోకి. అతను ప్రియూనివర్సిటీలో నా క్లాస్ మేటు. శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లె నించి వచ్చి చేరాడు. అప్పట్లో శ్రీకాకుళం నించి చాలామంది మా వూరే వొచ్చి చదువుకునేవారు . శ్రికాకుళంలో గవర్న్మెంటు కాలేజి ఉన్నా కూడా దానికంత సీనుండేది కాదు. ఇప్పట్లా యెక్కడపడితే అక్కడ చదువు కొనడానికి దొరికేదికాదు.వైశ్యుల కుటుంబం నించి వచ్చాడు. కాలేజి హాస్టల్లో వుండేవాడు.ఇంతకు ముందోసారి మా ప్రిన్సిపాలు వసంతరావు వెంకటరావు గారు మాకు తెలుగుపాఠం చెప్పడం గురించి ప్రస్తావించాను.ఆయన పకీర్ డోకీ అని అటెండెన్సు రిజిస్టరులో చూసి ఇతను ముస్లిం అని భ్రమ పడ్డారు. పేరు పిలిచినప్పుడు డోకీ అని స్టైల్ గా పిలిచే వారు. వీడేమో లోపల్లొపలే కుళ్ళిపోయే వాడు. ఆయనతో వున్న మాట చెప్పడానికి ధైర్యం చాలేది కాదు.ఒకసారి నేనే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఆయన తప్పుని చెప్పకుండా వీడు కోమటి అని ఆయనకి హింట్ ఇచ్చాను.మరయితే ఆ వెధవ పోజెందుకూ సుభ్భరంగా డోకి పకీరని రాసుకోకా అని నిరసన తెలిపి ఆ మర్నాటినించి డోకి పకీరూ అని మిగిలిన పేర్లకంటే గట్టిగా నొక్కి పిలవడం మొదలు పెట్టారు. వాడికి నా మీద చాలాకాలం గుర్రుగా వుండేది. రోజూ సాయంత్రం అయోధ్యా మైదానానికి [ మా కాలేజి ప్లే గ్రౌండు, గతంలో ఒకసారి ప్రస్తావించినట్టే గుర్తు] వెళ్ళి కాలక్షేపం చేసి తరవాత పక్కనే వున్న హాస్టల్లొ వాడి రూముకి వెళ్ళి మరో గంట గడపడం మామూలు. హాస్టల్లో యేవయినా పార్టీలూ అవీ అయినప్పుడు నన్ను తప్పకుండా పిలిచే వాడు. హాస్టల్లో నేలమీదే చాప వేసుకుని పడుకునే వాళ్ళు అందరూ అప్పట్లో. రిమోట్లూ అవీ లేని ఆ రోజుల్లొ నేలమీదనించి లేవకుండా లైటు ఆర్పడానికి వాడో పధ్ధతి కనిపెట్టాడు. స్విచ్ బోర్డు పైనో మేకు కొట్టి దానిపైనించి స్విచ్ ద్వారా ఒక దారం లూపులా కట్టాదు. కర్టెన్ కి కట్టినట్టన్నమాట. దానిని ఒకపక్క లాగితే లైటువెలిగేది.రెండోపక్క లాగితే ఆరేది. పీ యూ సీ తరవాత వాడు బీ కాం లో చేరాడు.నేను తెలుసు కదా. పరిచయం నెమ్మదిగా దూరం అయింది.మళ్ళీ 1998 2000 దగ్గిరలో విశాఖ స్టీలు ప్లాంటు జీ ఎం ఫైనాన్సు గా ఆ పేరు చూసి ఒహొ అనుకున్నాను. ఒకటి రెండు సార్లు పలకరించినా అంతటితోనే ఆగిపోయింది. మా పెద్దబ్బాయి యింటికి ఉక్కునగరం యెన్నిసార్లు వెళ్ళినా కలవడం కుదరలేదు. అతని పిల్లల పెళ్ళిళ్ళూ అవీ వివాదాస్పదం కావడం పత్రికాప్రకటనలూ అవీ చూడడం చివరకి యేవో ఆరోపణల్లో చిక్కుకుని రిటైర్మెంటుకి కొంచెం ముందుగా సస్పెండవడం అవీ విషాదాలు. యే పుట్టలో యేముందో మరి నాకు తెలీదు.

Wednesday, August 29, 2007

sistlaa ramakrishna

నిన్ననే డాక్టరు మళ్ళీ మామూలు జీవితానికి పొమ్మని సెలవిచ్చాడు. ఈ బ్లాగులో తొందరగా మళ్ళీరాయమనీ ఆదెశించాడు. కాలేజి స్థలపురాణం అయ్యాక ఇక జ్ఞాపకాలకి వద్దాం.వీటికి కాలానుసరణ యేమీ కనపడకపోతే పట్టించుకోకండి.ఆ క్షణానికి గుర్తొచ్చినట్టు రాస్తున్నాను. నిజం చెప్పాలంటే చదువులో ఒక్కొక్క దశా దాటుతుంటే మనం క్లాసురూములో నేర్చుకునేది తాగిపోతూ జీవితంగురించి నేర్చుకునేది పెరుగుతూ వస్తుంది. స్కూలు రోజుల్లో పుస్తకాలనించి నేర్చుకునేది యెక్కువగా వుంటే యూనివర్సిటీకి వచ్చేసరికి జీవితం గురించి నేర్చుకునేదే యెక్కువవుతుంది. ఆ దశలో కొత్తవి క్లాసులో నేర్చుకున్నా అవి అతి త్వరగా మరుగున పడ్డం కద్దు. నాకయితే కాలేజికి వచ్చేప్పటికి వయసు తక్కువ అవడం చాత జీవితంగురించి యెక్కువగా యూనివర్సిటీలోనే నేర్చుకున్నాను. అయితే జీవితం కాలేజిలో నేర్పిన పాఠాలు తరువాతతరువాత అర్ధమయి అబ్బురపరచిన సందర్భాలూ లేకపోలేదు. ముందుగా నా జ్ఞాపకాల్లో శిష్ట్లా రామకృష్ణ ని గుర్తుచేసుకోవాలనిపిస్తోంది. అతను నాకు ఒకటిరెండు సంవత్సరాలు సీనియర్.అతను ఆజానుబాహువూ స్ఫురద్రూపీ.కంచుకంఠం అతనికి దేవుడిచ్చిన వరం. ఆచార్య ఎస్వీ జొగారావు గారి తమ్ముడు. అతను స్టేజి మీద విలన్ వేషం వేసి కౄరంగా నవ్వితే గుండెలు జలదరించేవి. అది నిజంగా నవ్వు కాదనీ బొహహహా అంటే అలానే ధ్వనిస్తుందనీ అతనే నాకు నేర్పించాడు. అతనూ నేనూ కలిసి చాలా నాటకాల్లో వేశాం. అంధ్రవిశ్వవిద్యాలయం స్టేజిమీద ఆచార్య ఎస్వీ జోగారావు గారిని చూసినవాళ్ళెవరయినా వుంటే ఈ నవ్వు తెలిసే వుంటుంది. అతనే ముందు గుర్తుకిరావడం యెందుకంటే అతను కొనగోటితో అధ్భుత కళాఖండాలు సృష్టించేవాడు. గోటితో చిత్రాలువేయడం చాల అశ్చర్యంగా వుండేది. మేమందరం కోరికోరి మా బొమ్మలు మాకు కావలసిన బొమ్మలూ వేయించుకునేవాళ్ళం. ఈ విద్య తరవాత రోజుల్లో నఖచిత్రకళగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలేజి వదిలాక అతను నెమ్మదిగా అధ్యాత్మికలోకంలోకి వెళ్ళి చాలా ఆనందాన్ని సొంతం చేసుకున్నాడు. సుందరాకాండని అంతటినీ నఖచిత్రాల్లో లిఖించి దాదాపు ఎమ్మెస్ రామారావుగారంతపేరూ గడించేడు. ఇతనే మా లైబ్రరీ గట్టుమీదకూర్చుని అమ్మాయిలని ఆటలాడించేవాడన్న మాట యెక్కడయినా చెపితే యిప్పుడు కొట్టినా కొడతారు.

Monday, August 20, 2007

kuu chuk chuk

నిన్న మధ్యాహ్నం ఎన్ డీ టీ వీ లో వే టు ఇండియా అన్న కార్యక్రమంలో మన పాత రైళ్ళని చూసినప్పటి నించీ ఆ జ్ఞాపకాలే మనసులో తిరుగుతున్నాయి. కూ అని మహా గంభీరంగా గర్జిస్తూ చుక్ చుక్ చుక్ అంటూ ప్లాటుఫారం పైకి వచ్చి ఆగే రైలూ బొగ్గింజనూ ఆగగానే కలకలం సందడీ చోటు కోసం పరిగెత్తడం పిల్లలం విండో సీటు కోసం పోటీపడడం. రైలు కదిలింతరవాత అదంతా ఒక సూక్ష్మప్రపంచంగా రూపాంతరం చెంది యెక్కడలేని సంగతులూ అందరూ ఒకేసారి మాటాడుకుంటుంటారు. టవర్ అఫ్ బేబెల్ ఇంకెక్కడుంటుంది.ఆ సందడి లోనే పాటలు పాడే వాళ్ళూ, టీ కాఫీ అమ్మేవాళ్ళూ, వేలం పాటపాడేవాళ్ళూ . జీవితంలో ఒకసారయినా నయాగరా జలపాతం దాని శబ్దం వినాలన్న నానుడి మనకి తెలుసు. కాని జీవితంలో భారతదేశంలో బొగ్గురైలు ఒకసారైనా యెక్కని వాళ్ళని చూసి యేమని జాలి పడగలం.యీ నాటి యే సీ బొగీలూ బయటి చప్పుడు వినబడకుండా గాజు కిటికీలూ లోపల పలకరిస్తే యేమైనా ముల్లె పోతుందన్నట్టు మూతి బిగించుకు కూర్చునే "పెద్ద" మనుషులూ భేషజాలూ యెంత సానిటైజ్ అయిపోయాం. ఇక ఫ్లైటయితే చెప్పనే అక్కరలేదు. నేను చేసిన రైలుప్రయాణాల గురించి కూడా అప్పుడప్పుడు రాయాలనే వూహ రూపు దిద్దుకుంతోంది. వీలు చూసుకుని మధ్యమధ్యలో ఇరికిస్తాను. మనమందరం యెన్నో ప్రయాణాలు చేసిన వాళ్ళమే. అనుభవాల్ని పంచుకుంటే బాగుంటుంది.

Thursday, August 16, 2007

sthalapuraaNam chivaripejii

స్థలపురాణం సాస్ బహూ సీరియల్ లాగ స్..ఆ ఆ గుతున్న ఫీలింగ్ వస్తోంది. ఇక యీ రోజు తో ముగించి జ్ఞాపకాలలోకి వెళితే మళ్ళీ ఉత్సాహభరితంగా వుంటుందేమో. రెండు మెట్లూ దిగి వెనక్కి వచ్చాం కదా.యెదురుగానే ఫిజిక్స్ లాబ్ వెనక తలుపు వుంటుంది. యెప్పుడైనా ప్రాక్టికల్సు నించి మధ్యలో కాస్త షికార్లు కొట్టాలంటే వాడేవాళ్ళం.సాధారణంగా ఆ తలుపు మూసే వుండేది-- అటెండర్ తో ప్రత్యేక పలుకుబడి వున్నవాళ్ళకి తప్ప. ఆ వరండాలో ముందుకివెళితే బోటనీ డిపార్ట్మెంట్. జయంతి వెంకన్నపంతులు గారి ప్రభావం ఆవరించుకుని వుండేది, ఆయన లేకపోయినా, లేకపోయినా యెందుకంటే ఆయన యూనివర్సిటీలో పీ ఎచ్ డీ చెయ్యడానికి వెళ్ళేరు. నా నాలుగేళ్ళలో మూడున్నరేళ్ళు ఆయనలేరు. అయినా ఆయన పేరు చెపితేనే భయంభయంగా వుండేవాళ్ళు. మరిచాను. జయంతి వున్నా మాకూ ఆయనకీ యేమీ చుట్టరికం లేదు. కొసమెరుపేమిటంటే నేను వాల్తేరు వెళ్ళిన కొంతకాలానికే ఆయన కూడా యూనివర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్లో అధ్యాపకులుగా చేరారు. ఆయనతో నాకిక్కడే పరిచయం యెక్కువ. బోటనీ దాటగానే ప్రిన్సిపాలు ఆఫీసు. అక్కడ కుడి పక్కకి తిరిగి మళ్ళీఈ కుడిపక్కకి తిరిగితే జువాలజీ డిపార్ట్మెంట్. అక్కడ సురేష్ కుమార్ గారు వుండేవారు.నాకా సబ్జెక్టుతో సంబంధం లేకున్నా ఆయన కలుపుగొలు స్వభావం అందరికీ దగ్గర చేసింది. ఆయన హాస్టల్ వార్డెన్ గా కూడా వుండే వారు. నేను హాస్టల్లో వుండే పరిస్థితే లేకపోయినా అబ్దుల్లాదీవానా అన్నట్టు అన్నిట్లోనూ వేలుండేది. అది దాటి ముందుకివస్తే మరి మా స్వగృహం లాంటి ఫిజిక్స్ లాబ్ ముందు గుమ్మం, లెక్చరర్లు కూర్చునే గది , వస్తాయి. జ్ఞాపకాలన్నీ అందులో వున్నాయికదా. అందుకని ప్రస్తుతానికి వదిలేద్దాం. అది దాటి పక్కకి తిరిగితే మళ్ళీ బయల్దేరిన ఫిజిక్స్ గాలరీ కి వస్తాం. కాలేజంటే రూములు కాదోయ్ కాలేజంటే అనుభవాలోయ్ అని ఇక వాటిలోకి దూకుదాం.

Saturday, August 11, 2007

m.r.college contd again

గత కొన్ని రోజులుగా నన్ను చూడడానికి వచ్చేవారితో సమయం గడిచిపోయింది.అందరూ నేను బాగున్నాననే సంతృప్తితో వెళుతున్నారు. మా కాలేజ్ లో ఆరెండు గదుల సంగతీ చెప్పాను కదా. ఇప్పుడు ఆ దారిలోనే ముందుకి వెళితే ఒక రెండు మెట్లు వస్తాయి. అవి దాటితే కెమిస్ట్ర్య్య్ లాబ్. ప్రియూనివర్సిటీ లోనూ బి ఎస్ సీ మొదటి సంవత్సరంలోనూ ఇక్కడే ప్రాక్టికల్సు చేసే వాళ్లం. కింద పైన ఒక వింగంతా లాబే. నిన్ననే నేనూ నా భార్యా అనుకుంటున్నాం. తను నాగ్ పూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు లో చదివింది. ఆ కాలేజిల లాబరేటరీలున్నంత స్థలంలో ఇప్పుడు రెందు కాలేజిలే వుంటున్నాయి.ఇక విద్యార్ధి వ్యక్తిత్వం పెరగాలంటే యెలా పెరుగుతుంది? సరే , ఆ లాబ్ పక్కనే ఒక చిన్న క్లాస్రూము- చిన్నదంటే ఎనభై మందిమి విశాలంగా కూర్చునే వాళ్ళం.దాని పక్కన కెమిస్ట్రీ గాలరీ.ఇది ఫిజిక్సు గాలరీ కన్నా కూడా పెద్దది.మూడు నాలుగు వందలమంది సునాయాసం గా పడతారు. మా క్లాసు ముందు రెండు మూడు వరసలలోనే నిండేది. అకౌస్టిక్స్ దిజైన్ చేశారో లేదో తెలీదు కాని, యెవరు మాట్లాడినా మూడు వందలమందికీ స్పష్టంగా వినిపించేది-ఆఖరికి మాధవరావు గారి పాఠమైనా. ఆయన సంగతి వేరే చెపుతాను. ఇంకా స్థలపురాణం లోనే వున్నాం కదా. మొదటి బెంచిలో నేనూ కవిరాయని రామచంద్రమూర్తీ రామారావూ కే వెంకటరావూ కూర్చుని యెక్కువగా రమణమూర్తి గారి పాఠాలే వినే వాళ్ళం. మాకు దాదాపు కెమిస్ట్రీ అంతా ఆయనే చెప్పారు.వెంకటరావు మొదటి సంవత్సరం తరవాత వాళ్ళ నాన్న గారికి బదిలీ అవడం తో మరో వూరికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వాడు తిరిగి నేను రిసెర్చి లో చేరిన సమయానికి యూనివర్సిటీకికి వచ్చి తిరిగి కలిశాదు.మధ్యలో ఇంజనీరయ్యాడు. తరవాత ఈ సీ ఈ హెడ్డూ చైర్మనూ అన్నీ చేసి నాకన్నా ఒకేడు ముందు రిటైరై ఇప్పుడు జీ ఎం ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాలుగా ఆ కాలేజ్ ని ఉన్నత స్థానానింకి తీసుకు వెళ్ళాడు. .ఇక్కడితో ఆ భాగం అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రెండు క్లాసురూములూ దాటి వరండాలోకి వచ్చి ముందుకు సాగుదాం.

Thursday, August 2, 2007

mr college contd

వరసగా రెండు గదులుంటాయని చెప్పానుకదా. అందులో రెండో గది లోనే మాకు క్లాసులు యెక్కువగా అయ్యేవి. ఇంకో దాంట్లో మరో సెక్షను వాళ్ళకి అయ్యేవి. ఎంపీసీ రెందు సెక్షన్లుండేవి.ఈ గదిలో బి ఎస్ సీ మొదటి సంవత్సరంలో జగన్నాధరావు గారు సింబలిన్ నాటకం చెప్పేవారు. అలాగే మదనమోహనరావు గారు ప్రోజూ పారడైస్ లాస్టు రెండో పుస్తకం చెప్పేవారు. గుమ్మం పక్కనే అడ్దం గా వున్న బెంచిలో నేనూ రామారావూ ముద్దుక్రిష్ణా మరో ఇద్దరూ కూర్చునే వాళ్ళం. మా యెదురుగా వున్న బెంచిలో అమ్మాయిలు కూర్చునేవాళ్ళు. ఇద్దరు నరసమ్మలు బాగా గుర్తున్నారు. మిగిలినవాళ్ళు లీలగానే గుర్తున్నారు. దానికీ కారణం వుంది. జగన్నాధరావు గారు మదన మోహనరావు గార్ల క్లాసులు చల్లారిన నీళ్ళ టీ తాగుతున్నట్టే వుండేవి. దానితో ఆ క్లాసుల్లో చుక్కలాటలు, కబుర్లూ ఇత్యాదుల్లోనూ లేదా నాటకాలూ యెలక్షన్లూ. సాయంత్రం గ్రౌండులో చెయ్యబొయే పనుల గురించీ కాలం గడిచేది. సింబలిన్ నాటకంలో సోలెమ్న్ మ్యూజిక్ అని వచ్చినప్పుడల్లా టట్ట డడ్డఢాం అంటూ వాయించడం మామూలయిపోయింది. యీ గోలలోంచి యెప్పుడు తలెత్తి చూసినా సత్యవతి అనబడే బి ఎస్ యే నరసమ్మ నన్నే చూస్తూ వుండేది. నేనటు చూడగానే జి నరసమ్మ వైపు తిరిగి యేదో మాట్లాడుతుండేది. నేను అంతగా పట్టించుకునే వాణ్ణి కాదు కాని ఒక్ సాయంత్రం ఫిజిక్సు స్పెషల్ క్లాసు అయ్యాక జీ నరసమ్మ చీకట్లో పక్కకి వచ్చినట్టే వచ్చి అకస్మాత్తుగా ఒక ముద్దుపెట్టి పారిపోవడంతో గుర్తున్నారు. ఆ తరవాత మళ్ళీ ఆ అమ్మాయి నన్ను తప్పించుకునే తిరిగింది.

Monday, July 30, 2007

back in form

మా డాక్టరు సరదా తీరింది. సర్జన్ రూపంలో నాకొక మంచి మిత్రులు దొరికేరు. మళ్ళీ తలుపులు మూసుకోకుండా అడ్డు పెట్టేరు. జరుగుబాటుంటే రోగమంత రాజభోగం లేదని మూడు రోజులు భోగం అనుభవించి ఇంటికి చేరాను. రేపట్నించి మామూలే. నలభయ్యేళ్ళ మైత్రి వెంకటరామశాస్త్రి [చూ: కిర్లంపూడి క్రికెట్] రూపంలో నా సర్జరీ అయినంతసేపూ గుమ్మం లోనే నిలబడివుంది. ఇంత మంచి అనుభూతి స్నేహం కాక మరేది ఇస్తుంది?

Wednesday, July 25, 2007

m.r college contd

ఇంకా రెండు రోజులుందిగా స్టెంటు వేసుకోడానికి. ఈ లోగా మాకాలేజి మేడ యెక్కుదాం. ఫిజిక్సు లాబ్ వైపు మెట్లెక్కగానే యెడమ వైపు ఫిజిక్సు గాలరీ వస్తుంది.అక్కడ మళ్ళీ రెండు మెట్లెక్కి వెళ్ళాలి. ముందు పెద్ద వరండా వుంటుంది.వరండాకి యెడమ వైపు కూడా ఒక లాబరేటరీ ఉంది.మేము బీ ఎస్ సీ చదివేటప్పు డు అక్కడ యేమీ చెయ్యలేదు కాని యూనివర్సిటీ లో పాఠాలు చెప్పడం మొదలెట్టాక ఒక ప్రాజెక్టు కోసం ఆంపియర్ బాలన్స్ అవసరమై అక్కడికి వెళ్ళాను.ఇదే చెపుతుంది ఆ ప్రయోగశాల స్థాయిని. ఫిజిక్సు గేలరీ లో మొదటిసారి అడుగుపెట్టడమే సంభ్రమం కలగచెసింది. అంత పెద్దది. ఆ బ్లాక్ బోర్డు . ఫిజిక్సు పాఠాలే కాకుండా అక్కద చిన్నా పెద్దా సాంస్కృ తిక కార్యక్రమాలూ డిబేట్లూ ఇంకా యేవైనా సమావేశాలూ జరిగేవి. ప్రీ యూనివర్సిటీ లో మా అదృష్టమో దురదృష్టమో కాని తెలుగు పాఠ్యపుస్తకంలో మా ప్రిన్సిపాలు వసంతరావు వెంకటరావు గారు రాసిన జగత్తు జీవము అనే పాఠం వుండేది. ఆయన బహుశా చాలామందికి తెలిసే వుంటుంది ఫిజిక్సు మాస్టారు.కాని ఆయన రాసినది కావడం చాత ఆయనే చెప్పడానికి వచ్చేవారు.వినిజీర్ణించుకోవడం యెంత కష్టంగా వుండేదో ఆ తరవాత చాలా యేళ్ళకి బ్రహ్మానందం సినిమాల్లో ముఖభంగిమలు చూశాక మళ్ళీ గుర్తుకొచ్చింది. వెంకటరావు గారు కాలేజికి యెప్పుడూ పంచా ఖద్దరు జుబ్బా లోనే వచ్చే వారు.ఆయనకి పూర్తిగా వ్యతిరేకంగా కే ఎస్ రామకృష్ణరావు గారు యెప్పుడూ ఫుల్ సూటులోనే కాలేజికి వచ్చే వారు. ఆయన అంత సీరియస్ గా యెందుకు వుండేవారో పెద్దయ్యాక ఈ వాతావరణంలో సూటు వేసుకోవలసిన సందర్భాలు వచ్చినప్పుడు బాగా అర్ధమయ్యింది.ఇంతకీ వెంకటరావు గారి గురించి కదా చెప్పుతున్నాను. ఆయన యెప్పుడేమంటారో యెవరికీ తెలిసేదికాదు. మాటవరసకి ఒకసారి మా మిత్రుడొకడు ఉదయాన్నే కాలేజిలో ఆయనకి యెదురు పడి అలవాటు ప్రకారం చెయ్యెత్తి గుడ్ మార్నింగ్ చెప్పి వెళిపోతుంటే చొక్కా పట్టుకుని ఆపి రెండవ చెయ్యి లేవదా పక్షవాతమా అని గద్దించారు.ఇలాటివి ప్రత్యక్షంగా ఇబ్బందిగానూ పరోక్షంగా వినోదం గానూ వుండేఅవి. తరవాత చాలాయేళ్ళకి వారి అమ్మాయి నా దగ్గర రిసెర్చికి చేరడమూ వివాహానంతరం భర్తతో కలిసి వ్యాపారవేత్తగా యెదగడమూ జరిగాయి. మెట్లకి కుడి పక్కన ఫిజిక్సు లాబ్ వుంటుంది. దానిలోకి మరో సారి వెళదాం ఇప్పుడు ముందుకి వెళ్ళి కుడివైపు తిరిగి మళ్ళీ యెడమవైపు తిరిగితే రెండు క్లాసు రూములు వస్తాయి. అక్కడ తెలుగు ఇంగ్లీషు క్లాసులు అయ్యేవి. ఇది 1960 తరవాత మాట. 59-60 లో నేను మొదట చేరి నప్పుడు భాషా ఆర్ట్సు క్లాసులు రాజు గారి కోట లోపల రౌండు మహల్ అనబడే అంతః పురం లో జరిగేవి. రౌండు మహల్ జ్ఞాపకాలు చాలా రసవత్తరమైనవి. మరోసారి రాస్తాను

Saturday, July 21, 2007

thanks

యెందరో మిత్రులు సహృదయంతో పలకరించేరు. అందరికీ కృతజ్ఞతలు

i am ok

డాక్తరే రైటని తేలింది.నిన్ననే ఆంజియో ప్లాస్టీ చేసి చిన్నదాంట్లొనే కాని ఒక పెద్ద అడ్డమే ఉందని తేల్చారు.వచ్చే శనివారం ఒక బెలూను ఊది స్టెంటు పెడతారట. చేతిలో కన్నం పొడవడం చాత కొంచెం నొప్పి పెడుతోంది. రేపు మళ్ళీ కలుస్తా.

Tuesday, July 17, 2007

who ia right?

మెదడు మోకాల్లో ఉండడం అందరికీ తెలిసిందే. నా గుండె మోకాలు కిందకి దిగిందని అనుమానంగా ఉంది. ఎందుకంటే కాళ్ళు నొప్పిగా ఉన్నాయని మా డాక్టరు దగ్గరకెళితే మోకాలికీ బట్టతలకీ ముడేసినట్టు గుండె నాళం సగం మూసుకు పోయిందన్నాడు. నా హృదయ కవాటాలు యెప్పుడూ తెరుచుకునే ఉంటాయంటే గుండె వేరూ హృదయం వేరూ కావాలంటే రేపు హాస్పిటల్లో చేరు అంజియోగ్రాం తీస్తా అన్నాడు. కాసేపాగితే మరేమంటాడో అని వొప్పేసుకున్నా. నిజానికి అన్నాళ్ళు పిల్లలకి పాఠాల్లో చెప్పినవి నామీదే వాడతానంటే నాకూ సరదాగానే వుంది.నేను రైటయితే రెండ్రొజుల తరవాత ఎం ఆర్ కాలేజి మేడ మీదకి టూరు తీసుకెళతా. డాక్టరు రైటయితే మరొ రెండు రోజులు పడుతుందేమో. అందాకా ఓపిక పట్టండి.

Monday, July 16, 2007

here again

ఈ మధ్య ట్రాన్స్ లేషన్ అనబడే మంత్రసానితనానికి ఒప్పుకుని చాలానే పట్టుకోవలసి వచ్చి కాలయాపన జరిగింది. అంత లోనే మళ్ళీ ఒక అమ్మాయి టీ వీ లో నా పాట మళ్ళీ పాడింది[ చూ : నా పాత పోస్టు] చాలా మట్టుకు పాట గుర్తు వచ్చింది. తూరుపు దిక్కున సూరీదూ నిదురలేపి పిలిచేనూ పడమర దిక్కున యారాడా కొండ నిన్ను పిలిచేనూ ఊగిపోతున్నదీ సాగీపోతున్నదీ ఉయ్యాలగా పడవ వయ్యారి పడవా వల లోంచి కొర్రమీను జారిపోతది జాగరతా జారిపోతే నోటికాడ కూడుపోతదీ జాగరతా లాగరా నా చక్కనివోడా లాగరా నీ ఒడుపంతా సూపిలాగరా నావోడా లాగరా యీ సేపలన్నీ రూకలేనురా రేతిరికీ ఊగి పోతున్నదీ.. ఇంకా కొంచెం ఉండాలి. విజయనగర్ కాలనీ లో ఒక అద్దె ఇంట్లో ఉండే వాళ్ళం పది మంది స్కాలర్లం. ఆ కధలు చెప్పడం ఇంకా బాకీ ఉంది. ఆ ఇంట్లో పీ ఎస్ ప్రభాకర రావూ నేనూ ఒక వర్షా కాలం సాయంత్రం పక్కింటి పంజాబీ అమ్మాయి ఇచ్చిన టీ తాగుతూ ఈ పాట కట్టాం. అతను వరస అంటూ వుంటే నేను మాటలు చెప్పడం. నేను కొంచె ముందుకి పోతే అతను వరస కట్టడం.మధ్యలో ఇవీవీ భాస్కర్ ఇత్యాదులు ఒహొ అనీ చీ చీ అనీ అంటుండడం అలా సాగింది. పంజాబీ అమ్మాయి కి ట్యూషను చెప్పిన వైనం, ఈవీవీ భాస్కర్ కథా ఇంకా ముందు ముందు రాస్తాను.

Tuesday, July 3, 2007

m.r. college 3

మైన్ బిల్డింగుకీ లైబ్రరీ బిల్డింగు కీ విడిగా క్వాడ్రాంగిలు నాలుగో అంచుని నిర్దేశిస్తూ ఒక చిన్న భవనం వుండేది. అందులో లెక్కల విభాగమూ జియాలజీ విభాగమూ వుండేవి.ఎం పీ సీ విద్యార్ధిగా నాకు ఆ భాగం తో సంబంధం వుండడం సహజమే అయినా ఇంకా మరో ముఖ్యమయిన అనుబంధం కూడా వుంది.విజయనగరం కళల కాణాచిగా పేరొందడం అందరికీ తెలిసినదే అయినా ఇదో కమ్మని జ్ఞాపకం. మా లెక్కల లెక్చరర్ పేరిశాస్త్రి గారు అతికమ్మగా పాడే వారు. పాటలకి అతి మనోహరంగా వరసలు కట్టేవారు. విజయనగరం కాలేజి నించి విశ్వకళాపరిషత్తు యువజనోత్సవాలకు వెళ్ళే జట్లకు లలిత సంగీతమూ బృందగానాల్లో ఆయనే శిక్షణ ఇచ్చే వారు. సోమనాధం గారు నాటకాల్లో శిక్షణ ఇచ్చే వారు. దురదృష్ట వశాత్తూ నేను కాలేజికి వచ్చే నాటికి సొమనాధం గారు ఆ వ్యాపకం యెందుకో మానుకున్నారు. అయినా వారూ ఎం ఎస్ ఆర్ కే గారూ ఇతర అధ్యాపకులూ పేరిశాస్త్రి గారి శిక్షణ లో ఉత్సాహంగా పాలుపంచుకునేవారు.నాకు పాడడం అంత రాకపోయినా ఆసక్తీ, నాటకాల జట్టులో వుండడం నించి నేనూ ఆ శిక్షణలో వుండేవాణ్ణి. అన్నట్టు సోమనాధం గారు ఎన్ సీ సీ కమాండెంటుగా కూడా వుండేవారు. బీ సీ వంటి సర్టిఫికేట్లేమీ లేకపోయినా ఎన్ సీ సీ క్విజ్ పోటీల్లొ మాత్రం ప్రతిసారీ ప్రైజు వచ్చేది నాకు. ఆ ప్రక్కనే వున్న జియాలజీ విభాగం లో రామలింగశాస్త్రి కొత్త గా చేరారు. ఆయన నాటకాల్లో శిక్షణ ఇచ్చే వారు. ఆయన గురించి రాసేది ముందుముందు ఇంకా చాలా వుంటుంది. యెందుకంటే నేను యూనివర్సిటీ కి వచ్చే నాటికి ఆయన కూడా అక్కడికి మారి తరవాత కాలం లో మిత్రునిగా మారేరు.నిజంగా ఆ కాలేజిలో ఆ రోజుల్లో చదవడం పూర్వజన్మ సుకృతం. ఆగస్టు పదిహేనూ నవంబరు ఒకటీ యువజనోత్సవాలూ జనవరి ఇరవయ్యారూ స్థాపనోత్సవమూ అలా యేదో ఒక కార్యక్రమం పండుగలాగ జరుగుతూనే వుండేది.సహృదయులైన అధ్యాపకులూ అంతపెద్ద క్రీడాప్రంగణమూ విద్యార్ధి సంఘానికంటూ ఒక ప్రత్యేక భవనమూ యెంతో బాగుండేది.రాధికగారు రాస్తూ ఆ కాలేజి ని చూడాలని వుంది అన్నారు. నలభై మైళ్ళ దూరంలోనే వున్నా నేను విజయనగరం వెళ్ళి చాలాకాలమైంది. భయం. ఇవన్నీ వున్నాయో మారిపోయాయో అని. ఈ జ్ఞాపకాలు మాసిపోవడం భరించలేను.

Saturday, June 30, 2007

m.r.college2

ప్రిన్సిపాలు గదికివెళ్ళే మెట్ల పక్కన ఒకరిద్దరు మాత్రమే పట్టే ఒక సన్నని దారి వుంది. అదిదాటి వెళితే ఒక క్లాసురూము వస్తుంది. ఆ క్లాసు లో మాకు యెక్కువగా లెక్కల క్లాసులు అయ్యేవి. పెరిశాస్త్రిగారి ఆల్జీబ్రా ఎం ఎస్ ఆర్ కృష్ణశాస్త్రిగారి కాల్క్యులస్ సోమనాధం గారి కోఅర్డినేట్ జామెట్రీ ఇక్కడే మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి.ఈ గది సరిగ్గా రోణంకి అప్పలస్వామి గారు పాఠాలు చెప్పిన గది యెదురు గానే వుంటుంది. యీ గది రెండో వైపు క్వాడ్రాంగిల్ వుంది. ఫిజిక్సు గాలరీకి వెల్లే మెట్ల పక్కనా ఇలాగే సన్నని దారి వుంది. అది దాటి వెళితే కెమిస్ట్రీ లాబరేటరీ , ఇంక అక్కడి నించి అంతా కెమిస్ట్రీ లాబరేటరీనే . దానికి రెండో వైపు పెద్ద స్టేజి.క్వాడ్రాంగిలు లో జనం అంతా ఈ స్టేజి మీద జరిగే సభలూ ప్రదర్శనలూ చూసేవాళ్ళు. దాదాపు ఆరేదు వేలమంది పట్టే ఈ ఆరుబయలు రంగస్థలం ప్రతిప్రదర్శనకీ కిక్కిరిసే వుండేది. అక్కడ కూర్చునే నేను జమ్మలమడక మాధవరాయశర్మ గారి వాగ్ఝరిలో గడ్డిపువ్వునై వూగిపోయాను. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అమృతభాషణ లో తడిసిపరవశించాను. ఆ స్టేజి మీదనే నటరాజ రామకృష్ణ గారి సోదాహరణ నృత్యప్రసంగం చూసి తన్మయుణ్ణయాను. గోపీకృష్ణ తన కాలికి కట్టిన మువ్వల్లో ఒకేఒక్క దాన్ని కదిలించి మోగించడం చూసి అబ్బురపడ్డాను.....ఆ స్టేజి మీద నేనుకూడా నాటకాలు వేశాను.

Thursday, June 28, 2007

m.r.college

విజయనగరం మహరాజా కాలేజి.అంతకు ముందు చాలాసార్లు చూసినా విద్యార్ధి గా చేరి నా కాలేజి అని అనుకునేప్పటికి అదో మంచి భావన. పెద్ద గేటు లోంచి లోపలికి వెళ్ళగానే రెండుపక్కలా బోటనీ శాఖ వారి పెద్ద తోటలు. యెదురుగా కాలేజ్ భవనం. కొద్దిపాటి మట్టినేల దాటివెళితే కాలేజ్ వరండా పైకివెళతాం. వరండాకి రెండు చివర్లా రెండు పెద్ద స్టెయిర్ కేసులు. కుడిపక్కది యెక్కితే ప్రిన్సిపాలు గారి గది కి వెళతాం. యెడమ పక్కది యెక్కితే ఫిజిక్సు గాలరీ కి వెలతాం. ఈ రెండూ కాక పోతే గేటు యెదురు గానే మధ్హ్యలో ఒక చిన్న స్టెయిర్ కేసు.దానికి యెడమ పక్క కామర్సు పాలిటిక్సు యెకనమిక్సు అధ్యాపకులుండే గదులు. రెందొ పక్క క్లాసు గదులు.ఫిజిక్సు గాలరీ కి వెళ్ళే మెట్ల పక్కన భవనం ఎల్ ఆకారం లో తిరుగుతుంది. ఆ ఎల్ లో బి ఎస్ సీ వాళ్ళ కోసం పెద్ద ఫిజిక్సు లేబరేటరీ. ప్రిన్సిపాలు మెట్లు దాటాక కుడి పక్క మరో భవనం. పెద్ద వరండాతో .అది లైబ్రరీ. ఆ భవనం లోనే నా జీవితానికి పునాదులు. ఆ వరండా మీద గంటల తరబడి కూర్చునే వాళ్ళూ వచ్చే పోయే అమ్మాయి లని చూసే వాళ్ళూ. ఆభవనం చివరన మేడమీద ఒక గది.ఒక్కటే. దానికి వేరే మెట్లు. ఆ గది లోనే రోణంకి అప్పల స్వామి గారు అందుకున్న వాళ్ళకి విజ్ఞానాన్నీ, అందుకోని వాళ్ళకి వినోదాన్నీ పుష్కలంగా పంచింది. ఈ టూరు ఇంకోసారి పొడిగిద్దాం. ఈ ముక్కలు యెవరికయినా తీపి గుర్తుల్ని నిద్దరలేపితే అందరితోపంచుకోండి

Sunday, June 24, 2007

starting college

నేను 1959 లో విజయనగరం ఎం ఆర్ కాలేజి లో చేరాను. అప్పటికి నాకు పదమూడో యేడు నడుస్తోంది.ఒక్కసారిగా కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టినా నాలో ఆ భావం ఎందుకనో అంతగా కలగలేదు..నేనింకా బాల్యంలోనేవుండడం వల్లనేమో. జీవితంలో వివిధ దశలు . చిన్నప్పుడు స్కూలులో మన అమ్మానాన్నల పిల్లలు గానే పెరుగుతాం. కాలేజీకి వచ్చేటప్పటికి కొంత వ్యక్తిత్వం మొదలవుతుంది.అదిన్యాయంగా డిగ్రీ పూర్తిచేసేటప్పటికి బాగావికసించాలి. కాని నా విషయంలో అది జరగలేదు. బాల్యం నించి కౌమారానికి వచ్చే సరికి నా డిగ్రీ అయిపోయింది. యూనివర్సిటీ నన్ను నిజంగా పురి విప్పి ఎగిరేలా చేసింది. కాలేజి అనగానే విశాల మయిన గదులు, పెద్దపెద్ద ప్రయోగశాలలు,భాషలు నేర్చుకోడానికి మరో ప్రాసాదానికి వెళ్ళడం, [విజయనగరం గురించి తెలిసిన వాళ్ళకితెలుస్తుంది. అవి నిజంగారాజప్రాసాదాలే] పెద్ద స్టేజీ క్వాడ్రాంగిలూ అందులో కళాప్రదర్శనలూ, అయోధ్య మైదానమూ అందులో టెన్నిస్ నించి కబడ్డీ దాకా అన్ని ఆటలూ ఆడే వాళ్ళూ. ఈ రోజుల్లో ముట్టుగదుల్లాంటి క్లాసురూములూ [క్షమించాలి]కారాగారాల్లాంటి ప్రయోగశాలలూ[అసలంటూ వుంటే] వాటిని కాలేజీ లనడం చూస్తే నిజంగా ఈ తరం మీద జాలి వేస్తుంది.కాలేజీ అనుభవాలని వచ్చే పోస్టు నించి మొదలెడతాను.

Friday, June 22, 2007

oka ammamma

అనగనగా ఇక అమ్మమ్మ. ఆమెకి యేడుగురు మనమలూ మనమరాళ్ళూ. ఆమె యెనభైయవ పుట్టిన రోజు, దేశకాల పరిస్థితుల వల్ల వాళ్ళకి తెలుగు రాయడం చదవడం రాదు. ఆమెకు తెలుగు తప్ప మరో భాష రాదు. అందుకని వాళ్ళు వాళ్ళ భావాల్ని తెలుగులో రాయడానికి నా సహాయం తీసుకున్నారు. వారి భావనలు నాకు నచ్చి వారి అనుమతితో ఇక్కడ ఉంచుతున్నాను ఆమె శిరస్సు పై మెరిసే చంద్రబింబాలనూ, ఆమె చుట్టూ దాక్కున్న శతసహస్ర సూర్యబింబాలనూ ఎవరమూ లెక్కపెట్టలేము. మనం ప్రేమగా అమ్మమ్మ అనో నాయనమ్మ అనో పిలుచుకునే వ్యక్తి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఒక సంస్థ. మన ఊహలకందని ఒక మహత్తర శక్తి. ఒక అనుభూతి. దైవం మా కోసం పంపిన దేవత నే మా భావన. ఆమె గురించి మా జ్ఞాపకాలలో అతి ప్రత్యేకమైనది ఒకటుంది. కర్లీ స్ట్రీట్ మా పూర్వీకుల నించీ వస్తున్న ఇల్లు. చిన్న ఎర్ర గేటు. గేటు దగ్గర ఆమె. ప్రపంచాన్ని చూస్తూ ప్రతి మనిషి కోసమూ చిరునవ్వు చిందిస్తూ, నవ్వుతున్న ఆమె కళ్ళలోని కాంతులు ఆమె చెవులకున్న వజ్రాల దుద్దులని హేళన చేస్తుంటే, ఆ గేటు దగ్గర అమ్మమ్మ. ఆమె పాలు పంచుకోని క్షణాలంటూ మా జీవితంలో యేవీ వుండేవికావు. యేడుగురు మనమలూ మనమరాళ్ళూ. యేడు జీవితాలు. అన్నీ విభిన్నమైనవీ విశిష్టమైనవీ. అన్నీ ఆమె పై మా ప్రేమతో విడదీయలేనంతగా అనంతంగా కలిసిపోయినవీ. ఆమె నవ్వులో మాకు ఆమె యెనభై సంవత్సరాల జీవితంలో ప్రదర్శించిన అంతశ్శక్తీ మనోధైర్యమూ వినబడతాయి. ఆమె కళ్ళలో మేము ప్రపంచంలోని మంచినంతా ప్రేమించడం నేర్చుకున్నాము. ఆమె అసామాన్యమైన మేధస్సు ఆమెతో గడిపిన ప్రతిక్షణం మాకు మరింత జ్ఞానాన్ని అందించింది మనం దేవుణ్ణి పూజిస్తాం. ఆ దేవుడు సహస్రచంద్రదర్శనం చేసినవారిని పూజిస్తాడంటారు. అంటే యెనభైయేళ్ళు పూర్తి చేసుకున్నవారిని. సహస్ర చంద్రుల్ని దర్శించడమే కాకుండా మా జీవితలలో సహస్రసూర్యుల వెలుగు నింపిన ఆ అమృతమూర్తిని మేము పూజిస్తాము. మా బాల్యం అంటే ఆమె చేత స్నానం పొయించుకోవడం ,ఆమె అన్నం పెట్టడం,ఆమె తిట్టేవి తినడం,ప్రేమించబడ డం,పాఠాలు నేర్చుకోడం, ఆమె వొళ్ళో నిద్రపోడం, నిద్ర లేచి ప్రశాంతత మూర్తీభవించిన ఆమె వదనం చూస్తూ భయాలూ బాధలూ మరిచిపోడం ఇంటి నించి దూరం గా వచ్చి జీవన సమరాలలో వ్యస్తులమైనప్పుడూ,ఒంటరితనం కుంగదీస్తున్నప్పుడూ కళ్ళు గట్టిగా మూసుకుని కన్నీళ్ళ మధ్యనించి మాకు తెలిసిన ఒకేఒక నిర్మల వదనాన్ని ఊహించుకోడం నాకు తెలుసు. క్షణక్షణం ఆ భావన బలపడి ఆ వదనం మరింత నిర్దుష్టం గా కనబడి ఆమె రూపంలో మాకు లభించిన అవ్యాజానురాగం మాలో మరింత శక్తిని నింపింది. ప్రియాతిప్రియమైన అమ్మమ్మా/నాయనమ్మా నీ యెనభయ్యవ పుట్టిన రోజు నాడు నిన్ను మేము అత్యంత పవిత్రంగా ప్రేమిస్తున్నామనీ,పూజిస్తున్నమ నీనితో అనుభవాని ఒక పండుగ లాగా అనుభవిస్తున్నామనీ నీవు లేని జీవితం నిస్సారమవుతుందనీ నీతో చెప్పడానికే యిదంతా. నీకు మేము జివితాంతం కృతజ్ఞులం యెప్పటికీ నీ

Saturday, June 16, 2007

pch

ప్చ్, మళ్ళీరెండు అప్పుతచ్చులు

Add to My AOL

apputachchulu

అప్పుతచ్చుల గురించి నన్ను మెలుకొలిపిన s గారు ఇంకో విధంగా నన్ను కొంచెం పెద్ద ముల్లుతోనే పొడిచారు. ద్వివేదుల విశాలాక్షి గారిని విషాలాక్షి అని రాసి రాక్షసమంత్రి విషకన్యను కనులముందు ఆడించారు. విశాలాక్షి గారు కాశీ విశాలాక్షి లాగానే అమృతమయి. ఆమె కళ్ళు విషాలు చిమ్మడం ఊహించుకోడమే కష్టం. ఒక్క కీ తేడాతో యెంత ప్రమాదం జరిగిపోయింది. ఇక మీద ఒళ్ళు దగ్గిర పెట్టుకుంటాను.నన్ను ఇలాంటి ప్రమాదాలనుంచి జాగరూకుణ్ణి చేసిన మిత్రుడికి కృతజ్ఞుణ్ణి. నరసింగరావు గారూ కుటుంబమూ అమెరికా వెళ్ళిన రోజుల్లో ఆ ఇంటిలో ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు వుండేవారు. తరువాతి రోజుల్లో ఆయన చాలా లబ్ధప్రతిష్థులయ్యారు. విజయనగరం మహారాజా కాలేజి లో ఆయన చెరేనాటికే ఆయనకు డాక్టరేటు వుండేది. అది చాలా అరుదైన విషయమని వేరే చెప్పక్కరలేదు. అయినా అప్పటీ ఆయన చిన్న వయసును దృష్తిలో పెట్టుకుని కొంతమంది ఆయనను బచ్చా మేష్టరు అని ముద్దుగా పిలుచుకునే వారు. ఈ మాటరాసి యెవరినైనా నొప్పించివుంటే క్షంతవ్యుణ్ణి. వీరభద్రరావు గారి సతీమణి రాయప్రొలు సుబ్బారావు గారి కుమార్తె. కధల్లొ రాస్తూ వుంటారు- యేడు మల్లెల యెత్తు రాకుమారి అని. ఆ మాట సాక్షాత్కరించినట్టు వుందే వారు. అంతటి సౌకుమార్యం ఆరోజు నించి నేతిదాకా యెక్కడా నేను చూడలేదు.వారి యింతిలోనే వారి మెనల్లుళ్ళు ఇద్దరు వుండి చదువుకుంటుండేవాళ్ళు. చిన్నవాడు ఆనందమోహన్ ఫిఫ్తు ఫారం లో నా సహాధ్యాయి. అతని అన్న కాలేజి లో చదివే వాడు. వారిద్దరికి వడ్రంగం అంటే అభిరుచీ మంచి నిష్ణాతులు కూడానూ. ఇమంతిలో పుస్తకాల షెల్ఫులూ తబుళ్ళూ వాల్లే చేసే వాళ్ళు. ఇది కొంత విచిత్రం గానే వుండేది.తరువాత వీరభద్రరావు గారు హైదరాబాదు వెళ్ళిపోయారు. తాజాకలం: మిత్రుడు లంబోదర్ నా చందమామ జ్ఞాపకాలు చదివి నేను సైతం అన్నారు. ఇలాగే చందమామ ప్రేమికుల్లో మద్దిపత్ల నాగేస్వరరావును చెప్పుకుని తీరాలి. కిర్లంపూది హాస్తల్లో మాతో పాటు వుండేవాడు. ఫార్మసీ అధ్యాపకుడు. అతని వద్ద చిన్నప్పటి నించి అన్ని చందమామలూ బైండు అయి వుండేవి.

Monday, June 11, 2007

naani

నేను స్కూలులో చదువుతున్నరోజుల్లొ మా పక్క ఇంటిలో ద్వివేదుల నరసింగరావుగారు వుండేవారు.వారు మహారాజా కాలేజి లో యెకనామిక్స్ లెక్చరర్ గా పనిచేసేవారు. కొంతకాలం తరువాత వారు అమెరికా వెళ్ళడమూ తిరిగి వచ్చాక యు ఎస్ యెద్యుకేషనల్ ప్రోగ్రాం అధికారిగా మద్రాసు వెళ్ళడమూ జరిగింది. వరి సతీమణి విశాలాక్షి గారు తరువత కధా నవలారచయిత్రి గా ప్రసిధ్ధులు. అయితే అప్పటికి ఆమె రచనా వ్యాసంగం యింకా మొదలుపెట్టలేదు. దగ్గరలో ముఫ్ఫయ్యేళ్ళ వయసులో ఆమే ఆమె చుత్తాలమ్మాయి మరొకరూ ఆంధ్రామెట్రిక్ పరీక్షకి హాజరవడం ఆ చిన్నవూళ్ళో కొంత సంచలనమే అయింది. మా రెండు కుటుంబాలూ చాలా సన్నిహితం గా వుండేవి. వారి అబ్బాయి శ్రీనాధ్ నాకు మంచి మిత్రుడు. మా ఇంటి లోనో వాళ్ళింటిలోనో ప్రతివారం తప్పకుందా బాలానందం కార్యక్రమం వినేవాళ్ళం. మా స్నేహితులు కూడా వచ్చే వాళ్ళు. రేడియో వినడానికి ఇంకో ఇంటికి వెళ్ళడం అంటే యిప్పుడు పిల్లలు నవ్వుతారు. ఆఆంధ్రపత్రిక వారపత్రికలో ఆ రోజుల్లో టాం సాయర్, హకల్ బెర్రీఫిన్ స్కార్లెట్ పింపర్నల్ రాజూపేదా వంటి సీరియళ్ళు వచ్చేవి. చందమామలో తోకచుక్క మకరద్వీపం వంటి సీరియళ్ళు వచ్చేవి. యేకాక్షీ చతుర్నేత్రుడూ వంటి పాత్రలు మనసుకి హత్తుకునేవి. అందరం కలిసి చదవడం పైవరమో పై నెలో యేమవుతుందని చర్చించుకోడం యెంతో బాగుండేది. విశాలాక్షి గారు కూడా మాతో చర్చించేవారు. అమెలోని రచయిత్రి ఆ రోజుల్లోనే వికసించిందేమో.అమెరికా వెళ్ళాక నానీ అనబదే శ్రీనాధ్ చదువు అక్కదే గదిచింది. అమెరికాలోనే అతను కారుప్రమాదంలొ చిన్నవయసులోనే మరణించాదు. అతని చెల్లెలు ఛాయ కూదా మాతోనే ఆడుతుండేది.

Monday, June 4, 2007

bandaru

బందరు బ్లాగరుడు వ్యాఖ్య పంపించి బందరు జ్ఞాపకాలని వెలికి తెప్పించారు. బందరులో యెందరో మిత్రులు. మా అమ్మమ్మ గారి వూరు కావడంతో చిన్నప్పటి నించీ బాగా అలవాటైన వూరే. కాని యూనివర్సిటీలో మిత్రులైనవాళ్ళు అనేకులు. ఎన్ ఎస్ ఎస్ ప్రసాదూ నాకు ఒక సంవత్సరం జూనియరే. రిసెర్చ్ లో చేరిన మొదటి యేడాది అతని రూములో వుండనిచ్చాడు. చాలా మంచి మిత్రుడు. నా రెండొ కుమారుడి పెళ్ళికి వచ్చాడు. అప్పుడు కలిశాం. నా ఇద్దరు కొడళ్ళూ హైదరబాదు వాళ్ళే కావదం మిత్రుల్ని కలవడానికి అవకాశం ఇస్తోంది . సౌభ్యం అనబడే జీవీవీ సుబ్బారావు ని మిత్రుదు అనడానికి లేదు. ఇంకో ప్రాణం అనాలి. బందరు హిందూ కాలేజి లో ఫిజిక్సు చెప్పేవాడు. మీటియరాలజీ చదివిన ఆదిశేషు మరో మంచి మిత్రుడు. అతని మరణవార్త ఈ మధ్యనే విన్నాను.వృత్తిధర్మంలో రేదియేషను కి గురి అయ్యాడు. యూనివర్సిటీ మిత్రుల గురించి వరుసలో చివరికి రాద్దామనుకున్నాను కాని బ్లాగరుడు తాడు లాగి డొంకని కొంచెం కదిలించాడు. వీళ్ళందరి గురించీ రాయడానికి ఇంకా మజా అయిన సంగతులు బోలెడు. మళ్ళీ చెపుతా. ఇంకా స్కూలు రోజుల్లోనే వున్నాం కదా

Thursday, May 31, 2007

friends

స్కూలు రోజుల్లో యెన్నెన్నో జ్ఞాపకాలు, యెందరెందరో మిత్రులు. కొంతమంది మళ్ళీ కనిపించలేదు. కొంతమంది ఈ నాటికీ రోజూ కలుస్తూనే వున్నారు. కొంతమంది మధ్యలో కనిపించి మళ్ళీ మాయమవుతుంటారు.యెవరికయినా వీళ్ళెవరన్నా తెలిస్తే అలా అలా మళ్ళీకలుస్తారేమో. వద్దిపర్తి వీరరాఘవస్వామి వాళ్ళిల్లు స్కూలు యెదురుగానే వుండేది. మళ్ళీ కనిపించలేదు. జి. గురునాధరావు చాలా దగ్గరగా వుందేవాళ్ళం. విజయనగరంలో వున్నన్నాళ్ళూ కనిపిస్తుందేవాడు. తరవాత మరి కలవలేదు. ఎం. సూరిబాబు. అతనంత మంచి దస్తూరీ నేనిప్పటిదాకా మళ్ళీ చూడలేదు. నాకు తెలుగులోనూ ఇంగ్లీషు లోనూ కాలిగ్రఫీ లాంటి డిజైను అక్షరాలు రాయడం అతనే నేర్పించాడు.చిత్రకళ సంగతి అందరికీ తెలిసిందే అయినా ఇలాంటివి బాగానే వచ్చాయి.ఎం ఎల్. నరసిం హమూర్తి .ఒకళ్ళనొకరం చూసుకోకుండారోజు గడిచేది కాదు. యెలా దూరమయి పొయామో . ఎస్ ఎస్ ఎల్ సీ లో స్కూలు ఫస్టు నాకు కాకుండా ప్రేమస్వరూప్ అనే అమ్మాయికి ఒక్క మార్కు లో వెళ్ళినందుకు నా కన్నా వీళ్ళందరూ చాలా విచారించారు. యింకా చాలామంది వున్నారు. రేపు మరికొందరు .

Tuesday, May 22, 2007

Tuesday, May 15, 2007

a memory, a feeling called pain

ఈ జ్ఞాపకాలు రాస్తుంటే ఒక విషాదకర సంఘటన గుర్తుకి వచ్చి గొంతు లో అడ్డం పడింది. ఆ జ్ఞాపకం పేరు పాండురంగారావు.పాండు ఆ సంవత్సరమే మా క్లాసులో చేరాడు.1958. మా స్కూల్ ఫైనల్ క్లాసులో. వాళ్ళ నాన్న గారికి బదిలీ అయి వాళ్ళు విజయనగరం వచ్చారు. ఆ రోజుల్లో స్కూలులో చేరడం అంటే వెళ్ళి ఫీజు కట్టెయ్యదమే. సీటు కోసం బాధ లేదు. పాండు క్లాసులో అందరికన్నా పెద్దవాడు. 16,17 యేళ్ళు వుంటాయేమో .నేను అందరిలోకీ చిన్నవాణ్ణి. పదమూడేళ్ళు.నేను పరీక్ష రాయడానికి మా నాన్న చీఫ్ సెక్రటరీ దగ్గర అనుమతి తీసుకుని వచ్చాడు. సరే. పాందు కీ నాకూ మధ్య స్నేహమూ అప్యాయతా అవ్యాజం గానే పెరిగాయి.రోజూ సైకిలు మీద యెక్కించుకుని నన్ను షికారు తీసుకెళ్ళే వాడు. నాకు సైకిలు తొక్కడం వచ్చినా కూడా. నేను అతని హోంవర్కూ నోట్సులూ అన్నీ చూసుకునే వాడిని. ఒక రోజు అతను స్కూలుకి రాలేదు. నాకు చాలా ఆతృతగా వున్నా క్లాసులో పాఠాలు గట్టిగా జరుగుతుండదంతో పట్టించుకోలేదు.పైగా బడి ఎగ్గొట్టడం పాండు కి కొత్త కాదు. చిన్న వూరుకదా. సాయంకాలం తెలిసింది. పాండు రైలు పట్టాలపై శవం గా ముక్కముక్కలై వున్నాడని. అంతకు ముందు కూదా నాకు మృత్యువు తో పరిచయం వున్నా [నా మొదటి పోస్టుల్లో చూడవచ్చు] వూహ పూర్తిగా తెలిసిందిప్పుడే. ఆ అనుభూతినే బాధ అంటారని తరవాత తెలిసింది. మరిచిపోవడం మనిషికి దేవుడిచ్చిన వరం అంటారు. మరిచిపోతుంటే మనిషి యెదగడం యెలా?

Friday, May 4, 2007

Wednesday, May 2, 2007

two other arts

చిత్రకళా సంగీతమూ నా మీద దున్నపోతు మీద వాన పడ్డట్టే అయినా సాహిత్యమూ నటనా నాకు బాగానే అంటుకున్నాయి. ఉపాధ్యాయుడి గానూ, పరిశోధకుడి గానూ లబ్ధ ప్రతిష్టుణ్ణే అయి అనేకమంది ఆప్యాయతా అభిమానమూ సంపాదించినా ఆమధ్య యెప్పుడో పాడుతా తీయగా లో యెప్పుదు రాశానో నేనే మరచి పోయిన నా పాట ని ఒక అమ్మాయి పాడి రచన అశొక్ అని పడ్డప్పుడు చాలా ఆనందం కలిగింది.విజయనగరం లో నాకు చిన్నప్పుదు పరిచయమయిన పెద్దల్లొ శ్రీరంగం నారాయణబాబు గారు , పూసపాటి కృష్ణం రాజు గారు ,చాగంటీ సొమయాజులు గారూ, పఠాభి గారూ ఉన్నారు. వీరందరూ కూడా రోణంకి అప్పలస్వామి గారి అభిమానులూ శిష్యులూ అవడం కాకతాళీయం కాదు.వారి శిష్యకోటిలో చివరి తరాల్లోని వాడినయిన నాకు అది గర్వకారణం కూడా. మానేపల్లి సత్యనారాయణ నా సహాధ్యాయి. ఆ రోజుల్లో విజయనగరం లో రాఘవ స్మారక నాటాకోత్సవాలు చాలా ఘనం గా జరిగేవి. చాలా ఉత్సాహం గా చూసే వాళ్ళం. మహా నటులు. గరికపాటి రాజారావు ఆర్. వీ చలం, కర్నాటి లక్ష్మీ నరసయ్య వంతి వారి నటన చూసి ముగ్ధుల మయ్యే వాళ్ళం. ర స న సమాఖ్య అనబదే రసికుల, సరసుల నటకుల సమాఖ్య తో విజయవాడ నించి నాటకాలు వేసిన కుప్పిలి వెంకతేశ్వరరావు అంటే చాలా గ్లామరు వుండేది. ఆకాశరామన్న, విశ్వశాంతి వంటి ఆయన నాటకాలు బలేగా వుండేవి.పెద్దయి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరాక ఆయన దర్శకత్వం లోనూ ఆయన తో కలిసీ నాటకాలు వేస్తాననీ ఆయన నా పెళ్ళి రిసెప్షను కి వచ్చి అర్ధరాత్రి దాకా పిట్టకధలతో అందరినీ అలరిస్తారనీ ఆ రోజుల్లో వూహించలేదు

Monday, April 30, 2007

ఈ జ్ఞాపకాలు రాస్తుంటే నిజం గానే నా జీవితం ఇంత వర్ణభరితం గా గడిచిందా అనిపిస్తోంది. ఇంకా జీవితం మొదట్లోనే వున్నాను. మా అమ్మానాన్నా విజయనగరం సామాజిక జీవితం లో ప్రముఖులు గా వుండే వారు. అంచేత నాకూ పలువురు ప్రముఖుల పరిచయ భాగ్యం కలిగింది. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఫిడేలు సాధన చేస్తున్న్నప్పుడు దాదాపు ప్రతి రోజూ అదే గది లో కూర్చుని వుండే అదృష్టం నాకు కలిగింది. అయితే కోహినూరు వజ్రం తో బాదం కాయలు కొట్టుకున్న గొల్లపిల్లవాడిలా నా భాగ్యాన్ని నేను గుర్తించలేదు. అలాగే అంట్యాకుల పైడిరాజు గారికీ వారి శ్రీమతి కీ నా మీద అవ్యాజమైన అభిమానం వుండేది. పైడిరాజు గారు నాకు చిత్రకళ గానీ శిల్పకళ గానీ నేర్పుదామని చాలా ప్రయత్నించారు. వారు ఒకసారి నా తల ఆకారాన్ని మృత్తికా శిల్పం లాగ చేసి ఇచ్చారు. నేను కూడా ఆయన బొమ్మ గీశాను. కానీ ఇవ్వడానికి మనసొప్పలేదు. దాన్ని చూసి ఆయనేమైపోతారో అని భయమేసింది. ఏమయితే అయిందని దాన్ని మా తెలుగు మాస్టారికి ఆయన బొమ్మే అని ఇచ్చేశాను.ఆయన నన్ను బెంచీ ఎక్కించారు. ఆ రకం గా నా చిత్రకళాభ్యాసం ముగిసింది

Sunday, April 15, 2007

wanted feeling

1959 మార్చ్ తో నా స్కూలు జీవితం ముగిసింది. నేను ఎస్ ఎస్ ఎల్ సీ పాసయ్యాను. ఎనిమిది పరీక్షలు నాలుగు రోజుల్లో పూర్తయ్యాయి. పదినించీ పన్నెండున్నరా రెందు నించీ నాలుగున్నరా.ఇంటి నించీ స్కూలు దగ్గరే. అయినా మధ్యాహ్నం మా నాన్న వచ్చి తల తడి గుడ్డ తో తుడిచి ఇంటికి తీసుకు వెళ్ళి మళ్ళీ విడిచి పెట్టే వాడు. ఆయన ప్రముఖ రాజకీయవెత్తా పార్లమెంటు మెంబరూను. మా అమ్మ డాక్టరూ సంఘసేవకురాలూ రాజకీయ వేత్తా. అయినా నన్ను వాళ్ళెప్పుడూ వంటరి వాణ్ణనే భావం కలగనీయలేదు. చెప్పడం మరిచాను. నేను ఒక్కణ్ణె సంతానాన్ని. కావలసిన వాళ్ళమనే భావన పిల్లల్లొ కొండంతబలాన్నీ ఆత్మవిశ్వాసాన్నీ యిస్తుంది.నేనూ నా భార్యా కూడా అదే సూత్రాన్ని పాటించాం.మా పిల్లల ఆత్మ విశ్వాసం ముచ్చట గొలుపుతుంది

Friday, April 6, 2007

head master

ఇతరత్రా వ్యస్తుడనై ఉండడం వల్ల కొంతకాలం ఇక్కడకి రాలేకపోయాను. మా బడి జ్ఞాపకాలను ప్రధానోపాధ్యాయులు రామదాసు గారి గురించి చెప్పి తరువాత ముందుకు సాగుతాను, వారిని చూస్తే అందరికీ దడ. వారు యెప్పుడూ యెవరినీ పల్లెత్తు మాట అన్నట్టు యెవరూ చూడలేదు.వారి గంభీర వ్యక్తిత్వం తోనే అది సాధ్యమనుకుంటాను. నా ఉపాధ్యాయ జీవితం లో ఈ అనుభవాలు చాలా సాయపడ్డాయి. మాకొక తెలుగు మాస్టారు ఉండేవారు. ఆయన ఆకారవికారాల వలన తొండబుర్ర అనే ముద్దుపేరుని సంపాదించారు. ఆ పేరు ఎవరు పెట్టారో యెప్పుదు పెట్టారో ఎవరికీ తెలియదు . ఆయన అసలు పేరు నాకు ఇప్పటికీ తెలియదు. ఒకసారి అర్ధసంవత్సరపరీక్షలు జరుగుతున్నాయి. నేను రాసేదంతా అయిపోయీ నా మిత్రుడొకదు రాయడానికింకేమీ మిగలకా కొంచెం ముందుగానే బయటపడ్డాం. పిల్లచేష్ఠలతో అక్కడేదో ఇసక కుప్ప వుంటే గంతులేస్తున్నాం. ఇంతలో ఏం చేస్తున్నారు అని గంభీర స్వరం వినిపించింది. రామదాసు గారు. బిక్కచచ్చిపోయాం. నెమ్మదిగా నోరు పెగుల్చుకుని పరీక్ష రాయడం అయిపోయింది అన్నాను. మరో ప్రశ్న, యే రూము లో రాశారు. చెప్పాం. యిప్పుడు కష్టం ఒచ్చి పడింది. వాచరు యెవరు ? అని అడిగేరు. తొండబుర్ర గారు అని చెప్పాలి. యెలా?. హెడ్మాస్టరుతో?. చిన్న బుర్రలోని తెలివితేటలన్నీ ఉపయోగించి యేమయితే అదయిందని టీ బీ గారండి అనేశా. తల తాటించి వెళ్ళిపోయరు. అమ్మయ్య అనుకుని స్కూలు బయటకి పరుగో పరుగు. పెద్ద క్లాసు లకి వచ్చి రామదాసు గారు మాకు లెక్కలూ జామెట్రీ చెప్పినప్పుడు తెలిసింది. ఆయన అంత భయంకరుడేమీ కాదని.

Thursday, March 29, 2007

మళ్ళీ విజయనగరం చిన్న నాటి జ్ఞాపకాలకి. మాకు హైస్కూలులో లాఠం చెప్పిన వారిలో బలిజేపల్లి గోదావరిరాజుగారు ఒకరు. చక్కని పంచకట్టుతో మల్లెపువ్వు లాంటి జుబ్బాతో మూర్తీభవించిన తెలుగు హుందాతనం నడిచి వస్తున్నట్టుండేది ఆయన క్లాసుకి వస్తుంటే. యెస్ వీ రంగారావు గాత్ర గాంభీర్యం లేకపోయినా ఆకార గాంభీర్యం మాత్రం వుండేది. ఆ రోజుల్లో మాస్టర్లంటే భయం ప్రేమా రెందూ కలగలిపి వుండేవి. వారు మాకు సోషల్ స్టడీస్ చెప్పేవారు . ఆ మహానుభావుల వద్ద చదవ బట్టే అర్ధశతాబ్దం కింద చదివిన హిస్టరీ జాగ్రఫీ ఇంకా గుర్తున్నాయి. వారి కుమారుడు రామమోహన రావు గారు మెడిసిన్ చదివారు . ఆయన లాగ చదువు కోవాలని చెప్పే వారు మాకు.ఒక సారి మాస్టారు ఒక నెలానెలన్నర పాటు స్కూలు కి రాలేదు. చెప్పద్దూ మాకు కొంచెం పండగ లాగే వుంది అప్పుడు. తరవాత పెద్ద వాళ్ళు అనుకుంటుంటే తెలిసింది. రామమోహనరావుగారూ గాయని సుశీల గారూ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారనీ.ఆ పెళ్ళి కి పెద్దలు ఇష్టపడలేదనీ. ఇద్దరూ ఒక వూరి వారే.ఒక కులం వారే. లబ్ధప్రతిష్ఠులే. అయినా పెద్దల అహంకారాలు అడ్డం వచ్చాయి. తరువాత అంతా మామూలయిందనే అనుకుంటాను. ఆ రోజుల్లో చూచాయ గానే తప్ప పెద్దల విషయాల్లో జొక్యం పిల్లలకి అంతగా వుండేది కాదు .

Friday, March 23, 2007

kirlampudicricket2

మరొ సంవత్సరం క్రికెట్ మాచ్ గురించి చెప్పే ముందు ఒక సంగతి చెప్పాలి. మిత్రులందరమూ కలిసి యెవరినైనా మోత మొయ్యాలంటే వాళ్ళనే కెప్టెన్ చెయ్యడం ఆనవాయితీ గా వుండేది.కొంత మంది అది వారి ప్రజ్ఞా పాటవాలకూ ప్రాముఖ్యతకూ గుర్తింపు అని భ్రమ పడడమూ కద్దు. మరి అందుకే కదా వారిని మోసేది. యిలాంటి కెప్టెన్ల లో మాధవరావు ఒకరు .యింకో సంగతి యేమంటే ఉదయం బాటింగ్ చెసే టీము లో చేరి మధ్యాహ్నం ఫీల్డింగు యెగగొట్టడం కూడా మామూలే.మాధవరావు టాస్ వేసి గెలిచినట్టుగా థంస్ అప్ సిగ్నలు ఇచ్చాడు. [డ్రింక్ కొత్తదయినా సిగ్నల్ పాతదే] వెంటనే గబగబా వెళ్ళి వెంకట రామశాస్త్రి మాధవరావు టీము లో తన పేరు రాసేసాడు. తీరా మాధవరావు మళ్ళీ పెవిలియన్ లోకి వచ్చాక తెలిసింది. అతను అతి తెలివి ప్రదర్శించి ఫీల్డింగ్ తీసుకున్నాడని. మాచ్ చిన్నదైనా కామెంటరీ వగైరాలన్నీ వుందేవి. ముసిముసి నవ్వుల కామెంటేటర్ మాధవ రావుని అడిగేడు . మీరు ఫీల్దింగ్ తీసుకున్నారు. పిచ్ యెలా వుంటుందని భావిస్తున్నారు అని. మధ్యాహ్నం మేటనీ పోయినందుకు ఉక్రోషం లో ఉన్న వెంకటరామశాస్త్రి మైకు లాక్కుని "పిచ్చి ముదిరింది " అన్నాడు.

Thursday, March 22, 2007

kirlampudi cricket

జ్ఞాపకాల ఆకులు ఎగిరెగిరి వస్తుంటే వాటి లోంచి ఒక క్రికెట్ జ్ఞాపకం.ఇది క్రికెట్ సమయం కదా. మేం ఆంధ్ర విశ్వవిద్యాలయం లో పీ ఎచ్ డీ చేస్తున్నప్పుదు వుందే కిర్లంపూడి హాస్టల్ చాలా ప్రఖ్యాతి పొందింది. చాల మంది ప్రముఖ స్థానాల్లొ ఉన్న వ్యక్తులు అక్కడ వుండేవారు. ఆ హాస్టల్ జీవితాన్ని గురించి మరో సారి. ప్రతి సంవత్సరమూ ఒక ప్రత్యేక క్రికెట్ మాచ్ ఆడే వారం. ఒక సం వత్సరం వైఎస్వీఎస్ అనబడేఆ వై.ఎస్. వెంకటసుబ్రహ్మణ్యమూ డి ఎల్ ఎన్ హాం అనబడే దూర్వాసుల లక్ష్మీ నరసిమ్హమూ చెరో టీము లోనూ చేరి ఒకరు బాటింగూ మరొకరు బౌలింగూ మొదలుపెట్టడానికి తయారై ప్రజలం దరినీ భయభ్రాంతుల్ని చేశారు. ఎందుకంటే, రన్ వస్తే ఒకరు ఆ షాటు గురించి ఒక వారం రోజుల దాకా అం రికీ తెలియజెప్పుతాదు. కొట్టకపోతే ఆ బంతి విశిష్ఠత గురించి రెండో వాడి దగ్గర వినాలి. ఇం కో మాచ్ గురించి రేపు

Thursday, March 15, 2007

sri TVL

ఎం ఎచ్ స్కూలు లో మాకు పాఠం చెప్పిన వారిలో టీ వీ ఎల్ నరసిం హం గారు వుండెవారు .ఆ మహాను భావుడి చలవ వల్లే నాకు అంతో కొంత ఇంగ్లిషు భాష అబ్బింది. ఈ రోజుల్లొ తెలుగు మీడియం లో చదవడం పట్ల చిన్న చూపూ వగైరా , వాళ్ళకి ఇంగ్లీషు చాలా కష్టం అవుతుందనడం ఇవన్నీ నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. టీవీఎల్ గారు నేర్పించిన ఇంగ్లీష్ గ్రామర్ మరిచిపోయేది కాదు. ఆయన ఒకసారి మా మిత్రుడొకడు రోడ్డు పక్క ప్రకృతి పిలుపు తీర్చుకుంటుండగా చూశారు . భయం చెప్పడం కోసం క్లాసు లో ఆ సంగతి ప్రస్తావిస్తూ అలాంటి పనులు చేస్తే రెండు నెలల దాక జైలు శిక్ష పడుతుంది. నేను కూడా కొన్నాళ్ళు అని ఆయన మాట పూర్తి చేసే లోగానే క్లాసంతా గొల్లుమన్నారు.వెధవల్లారా పూర్తిగా వినండి అని ఆయన పూర్తి చేశారు. నేను కూడా కొన్నాళ్ళు ఆనరరీ మేజిస్ట్రేటు గా పని చేసి కొంత మందికి శిక్షలు వేశాను అని అన్నారు. అయినా నవ్వులు ఆగలేదు .వారి మనమడు జీ వీ సూర్యనారాయణ నా క్లాసుమేటూ మిత్రుడూ. ఎం ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా కూడా పని చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. .

Wednesday, March 14, 2007

my life

సముద్రం మీంచి చల్లని గాలి వీస్తుంటే నీ చల్లని స్పర్శ లా అనిపిస్తుంది. వెన్నెల్లో పడుకుంటే నువ్వు నన్ను చూసి నవ్వుతున్నట్టుంది. యెండాకాలం విశాఖ ఉక్కపొత నీ ప్రేమలో ఉక్కిరిబిక్కిరి అయినట్టుంది . ప్రకృతి అంతా నువ్వే. నువ్వే నా ప్రకృతి

Monday, March 12, 2007

telugu saregamapa

జీ తెలుగు లో సరిగమప కార్యక్రమం క్రమం తప్పకుండా చూస్తున్నాను. ఆ యువత గాత్ర మాధుర్యం విస్మయపరుస్తోంది. అంతకన్నా తెలుగు భాష ని వాళ్ళు పలుకుతున్న తీరు తన్మయపరుస్తోంది. తెలుగుభాష మరుగున పడుతోందని మనమందరం చేస్తున్న కాకిగొల రజ్జుసర్ప భ్రాంతే ననిపిస్తోంది అంతలోనే నన్ను ఎసెమెస్ లతో యిన్నళ్ళూ యెంకరేజ్ చేసినందుకు థాంక్స్ అంటూ వాళ్ళు పలుకుతున్న చిలకపలుకులు చిలక పలుకులు కాకుండా కాకి గోల అనిపిస్తున్నాయి . తెలుగు అంత స్వచ్చం గా మాట్లాడగలిగిన వారికెందుకీబాధ. యిడ్లీ లో సాస్ నంచుకున్నట్టు .కార్యక్రమం రూపొందించే వారు యింకొంచెం శ్రధ్ధ తీసుకొవాలి

Saturday, March 10, 2007

prof ronamki

I was writing about ronamki appala swamy garu. whenever i think of him my heart thrills with ecstacy--his readings of shakepear, milton ,dylon thomas, arudra, pathabhi still replay themselves in my mind. it was teachers like that who made me capable of being alone in a crowd and being in a crowd with all those characters in the books, even when i am alone.. there is never a dull moment in life. thankyou, sir. it was he who made me read sherlock holmes and perry mason to improve my conversational ability. a classical english teacher. that speaks a lot of his vision

stoneworkers.

Today in the hindu metroplus i saw an item about how many buildings in vizag including andhra university and the collectorate are stone buildings. this reminded me of the time when i was deputed to escort an american professor, i dont recall his name, on his visit to andhra university. at that time some building was under construction in the university . as usual there were many workers chiselling stones into almost perferct rectangular cuboids. this being a everyday occurance and usual whenever there was construction, does not attract much attention from the locals. but the american was staring amazedly at the sight from the window of the guest house. ashok, he said to me, i think the pyramids must have been built like this.

Sunday, March 4, 2007

మళ్ళీ విజయనగరం జ్ఞాపకాలు. పాత పుస్తకాల మధ్యన దాచిన ఎండిపోయిన పువ్వుల్లా ఏదొ తెలియని విచిత్రమైన సుగంధాలతో . ఏభై ల లో మినర్వా టాకీసులో తెనాలి రామక్రిష్ణ సినిమా విడుదలయింది . ఆ సినిమా లోని చందనచర్చిత అష్టపదిగురించీ అది పాడిన సుశీల గారి గురించీ యిప్పుడు అందరికీ తెలుసు . అప్పుదు తెలీదు. ఆపాట యింటర్వల్ దగ్గిరలొ వస్తుంది. వొకాయన ప్రతిరోజూ సినిమా టిక్కెట్ కొనుక్కుని ఆపాట వచ్చే సమయానికి హాల్లోకి వచ్చ్చి పాట వినేసి వెళ్ళిపోతుండే వారట. యిలా వారం పది రోజులయే సరికి అందరూ దీన్ని గమనించారు . హాలు మేనేజరు బ్రహ్మాజీ గారు ఆ పెద్దాయన దగ్గరకి వెళ్ళి అయ్యా ఏమిటిలా వస్తున్నారు అని అడిగితే యేమీ లేదండీ ఆ పాట పాడింది మా అమ్మాయే అన్నారటా సుశీల గారి నాన్నగారు .ఆలుక్కరచుకుని[ఆ పెద్దయన వూళ్ళో అందరికీ తెలుసు, యెటొచ్చీ వారమ్మాయి పాటపాడిందని తెలీదు] ఆ రోజునించీ ఆయన యెప్పుడు కావాలన్నా హాల్లో కి వచ్చి కూర్చుని వెళ్ళే యేర్పాటు చేశారు బ్రహ్మాజీ గారు

Friday, March 2, 2007

i did not post for the last 2/3 days. just did not feel like it. mean while i am intrigued by the antics of ramojirao. today eenaadu carried on the frontpage at the top a statement by ramojirao which i felt belonged more to his son suman's stupid serials. does the fact of running a news paper ,we should call it a tabloid, give anybody a licence to do anything they wanted in their other businesses and claim immunity from enquiry or action just because they also happen to run a news paper? one gets the doubt whether this is the reason they started the paper in the first place.we saw the same thing with ramnath goenka earlier. why should a consciencious newspaper editor have a finger in so many pies. we thought an upright editor will steer clear of any thing that may compromise him. of the groups blatantness , everybody knows it. on their channels one health programme sometime back repeatedly was singing the praises of ricebranoil as THE best for health. we know whose company produced ricebran oil under the brand name priya on the same channel they are now running the telugu version of a natgeo documentory. and the producers name is , you guessed it ramojirao. how brazen can you get.

Monday, February 26, 2007

World Top Blogs - Blog TopSites

telivaina laayaru

ఇది కొంత పాత జోకే. ఇంగ్లీషు వాళ్ళ కాలం లో ఒక కొర్టు లో ఏదొ ఒక కేసులో వాదొపవాదాలు గంటల తరబడి జరుగుతున్నాయి. కొంతసేపటికి విసుగెత్తిన జడ్జీ గారు ప్రతివాది లాయరు తో " అయ్యా ఇందాకటినించి మీరు మాట్లాడుతున్నదంతా నా కుడి చెవిలోంచి లొపలకి వెల్లి ఎడమ చెవి లోంచి బయటకి వచ్చేస్తోంది " అని హాస్యమాడారు. దానికి లాయరు గారు ఊరుకుంటారా ." చిత్తం. అందుకే మీ ముందున్న జడ్జీ గారు ఒక చెవి లో పెన్సిలు పెట్టుకునే వారు" అని సెలవిచ్చారు

Sunday, February 25, 2007

JOIN AGLOCO

http://www.agloco.com/r/BBBP7743

Saturday, February 24, 2007

Friday, February 23, 2007

ronamki appalaswaamy

నిన్నటి సందెశం లో ఉద్దేశపూర్వం గానే ఒక మహా మనీషి ని పేర్కోడం మానాను. ఆచార్య రోణంకి అప్పలస్వామి గారిది మాటల కందే వ్యక్తిత్వం కాదు. ఒక మనిషికి అంత పాండిత్యం ఉండడం సాధ్యమేనా అని మా సహోధ్యాయులం ఆశ్చర్యపోయిన సందర్భాలు అనేకం. ఆయన కావడానికి మా యింగ్లీషు లెక్చరర్ .కాని క్లాసు లో మాకు ఆయన గీత గోవిందాన్నీ పథాభి పంచాంగాన్నీ ఫిడేలు రాగాలు డజన్ నీ ఆరుద్ర త్వమేవాహాన్నీ వినిపించి తన్మయుల్ని చేసిన సందర్భాలు అనుభవైకవేద్యాలు. మాక్ బెత్ నాటకాన్నీ మిల్ టన్ పారడైస్ లాస్ట్ నీ ఆయన బోధించిన విధానం జన్మ జన్మ లకీ మా మనొఫలకాల మీద ఆ సాహిత్యం ముద్రించుకుపోయేలా చేసింది. యెంతదాకా అంటే చెపుతా ఆ బియెస్సీ యెం ఆర్ కాలేజి అంతా అయి పోయిన దశాబ్దాల తర్వాత నేను పూర్తిగా ఫిజిక్సూ ఇన్ స్త్రుమెంటేషనూ లో మునిగి తేలుతున్నా ఒక కాలేజ్ కి ఇంటర్వ్యూ కమిటీ లో కూర్చుని ఒక యింగ్లీషు లెక్చరర్ ఉద్యోగానికి వచ్చిన అతనికి లార్డ్ అఫ్ ది ఫ్లైస్ అంతే బీల్ జి బబ్ అని గుర్తు చేసేంత .ఆ కాలేజి ప్రిన్సిపాల్ అప్పలస్వామి గారి కుమారుడే అవడం కొసమెరుపు అప్పలస్వామి గారు నాకు వ్యక్తిగతం గా నేర్పిన విషయాలు మరొసారి.కానీ ఆయనకి మాకియవెల్లి రాజనీతి శాస్త్రాన్ని తెలుగు లోకి అనువదించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిన సంగతి గుర్తు చేసుకోడం బాధ్యత

Thursday, February 22, 2007

my teachers

మనసు కాంతి కన్నా వేగం గానూ కాలం కన్నా హుషారు గానూ పరిగెడుతుంది. ఈ మధ్యలో టెన్నిస్ మాచ్ ల గురించి రాస్తున్నప్పుదు ఆ ఆటల్లొ మా మాస్టారులు కూడా రావడం అందరమూ కలిసే కాలెజికి వెళ్ళడం గుర్తుకొచ్చాయి . నిజంగా నేనింతవాణ్ణి [ఎంత వాణ్ణయితే అంతవాణ్ణే ] అవడానికి నాకు పాఠాలు నేర్పిన వాళ్ళందరూ ఎంత చేయూత నిచ్చారో చెప్పడం చాలా కష్ఠం కే రామదాసు గారు టీవీఎల్ నరసిం హం గారు గొదావరిరాజు గారు పేరిశాస్త్రి గారు ఎం ఎస్ ఆర్ కే శాస్త్రి గారు వేటూరి రామక్రిష్ణరావు గారు యిలా ఎంత మందని గౌరవాన్ని అదిగి తెచ్చుకొనక్కరలేదని వాళ్ళందరూ నాకు చూపించారు . అదే నా ఉపాధ్యాయ జీవితం లో బాగా అక్కరకు వచ్చిన సత్యం

Monday, February 19, 2007

nudikaaram

టెన్నిస్ పోటీల మాట వచ్చింది కాబట్టి మరొ సరదా మాట .ఈ పోటీలు మామూలుగా ఫిబ్రవరిలొ జరిగేవి. ఎండ బాగానే వుండేది. ఈ పొటీలకి విజయనగరం లో అన్ని వర్గాల నించీ ప్రెక్షకులు వచ్చెవాళ్ళు . వారిలో హరిదాసు ఆకెళ్ళ అప్పారావు కూడా వకరు ఒక రొజు ఉదయం ఎండలో ఆయన గొదుగు వేసుకుని మాచ్ చూస్తున్నారు. గాలరీలో క్రింద వరసలొ కూర్చున్న మా శాస్త్రి అయ్యా అప్పారావు గారూ కాస్త ఆ గొవర్థనం కిందకి దించండి అని అరిచాదు. జనం ముసిముసి నవ్వులు చిందించారు హై హాయ్ ల మధ్య ఆ అచ్చ తెలుగు నుడికారం విని ఎన్నాళ్ళయిందో

Friday, February 16, 2007

అరవయ్యవ దశకంలొ విజయనగరం సిటీక్లబ్ లొ టెన్నిస్ పోటీలుచాలా బాగా జరిగేవి.కృష్ణన్, లాల్, ముఖర్జీ నస్తత్సె వంటి ఆటగాళ్ళని చూసే అవకాశం ఆ చిన్న వూళ్ళ్లో కలిగిందంటే నారాయణరావుదొర గారిని మరీమరీ తలచుకోవాలి.ఆటచూసి వెన్లక్ లైబ్రరీ పార్క్ లో గడ్డి మీద కూర్చుని గప్పాలు కొట్టడం ఒక మంచి అనుభూతి ఆ రొజుల్లొనె న్యూ పూర్ణా హాలులో దిల్ తేరా దీవానా సినిమా రిలీజయింది ఆరొజు మాచ్ చూసి సినిమా కి వచ్చాం . ప్రేంజిత్ లాలూ జైదీప్ ముఖర్జీ హాలు బైట తచ్చాడుతున్నారు .హౌస్ ఫుల్ బోర్దుచూసి సంగతి అర్ధమయింది. మా దగ్గర 60 పైసల టిక్కెట్లు వున్నై . వస్తారా అని అడిగితే మహా సంతోషం గా వచ్చి మాతో పాటు వేరుశనగపప్పులు తింటూ ఎంజాయ్ చేశారు. నిజం గానే వాళ్ళు కావాలంటే హాలు వారు టిక్కెట్ ఇవ్వరా మర్యాదలు చెయ్యరా భేషజాలు లేని ఆ మనుషులు వేరు. ఆరోజులూ వేరే

Tuesday, February 13, 2007

looking back

when i look back i really wonder. how far have we travelled? i vividly remember. i was in the 2nd form those days--equivalent to the seventh class of now-, aged 8 or nine. there was a smallpox epidemic in vizianagaram. in the day time there were huge rallies to the gramadevata temple. small pox is known as ammavaaru ofcourse. in the night the muslims were roaming in groups shouting loudly and marking all the houses with their palm prints in saffron colour. all thix to ward off the dreaded desease. medicines were frowned upon. schools also were closed for some days. when they reopened we went back to school only to find some of the seats in the classroom empty. can my children and grand children imagine such things happened? india progressed a great deal did it? i some times wonder. i actually know of instances when the dates for an international scientific conference were fixed after consulting the panchangam and an astrologer. well it takes all kinds to make the world

so many faces-1

one person who deeply impressed me was abu abraham ,the cartoonist.my interaction with him was for a few hours only.the year was 1976. he came to visakhapatnam to cover the science congress. indira gandhi inagurated it. it was the height of emergency. the level of security was never seen in andhra university. we were barred from going near our daily haunts. i also remember the occassion for our first taste of satellite television. me and my friend bhaskar were assigned to keep mr abu abraham company for the one day he stayed in vizag.we were awe struck being so near a personality whom we adored.conversation--what can i say ? we managed to mumble some platitudes and inanities about the lectures we heard . most of them were about the garibi of bharat and what was being or to be done.abu smiled and asked us whether we really thought india is poor. how can someone ask even. the whole world knows that. he said the whole world wants you to believe that. dont go by the gdp comparisons. see what that amount buys. 10 rupees in india can buy alot more than what a dollar can in india. what does a spare meal cost? pao bhaji for example. those words changed the way we looked at our poverty forever. i am reminded of this incident now because recently i saw a news item on how india is a very costly place. the comparison was the price of a mcdonald burger in the U.S. and in india. who cares for mcdonalds in india except for fattened calves

Saturday, February 3, 2007

ఎప్పుడో దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు యువజనోత్సవాలలో పాడడం కోసం నేనుఒక పాట రాశాను. మిత్రుడు ప్రభాకరరావూ నేనూ కలిసి వరస కట్టాం ఆ పాటని ఈ తరం యువతీ యువకులు పాదుతా తీయగా సరిగమప వంటి కార్యక్రమాలలో పాదుతుంటే మజా వస్తోంది ఊగి పొతున్నదీ సాగిపొతున్నదీ ఉయ్యాలగా పడవ వయ్యారి పడవ అని మొదలవుతుందా పాట నెమ్మది గా గుర్తు తెచ్చుకుని మొత్తం ఇక్కడ రాస్తాను ఎవరికైనా గుర్తు వస్తే నాకూ గుర్తు చెయ్యండి

Thursday, February 1, 2007

i saw the telugu cinema diamond jubilee on TV. i could not recognise any of the new heroines as that was the first time i am seeing them with clothes on
ఏదీ మరొక్క మారు హ్రుదయేశ్వరా గుండెలు పుల్కరింపగా ఊదగదోయి సుధామయ యుష్మదీయవేణూదయ రాగడోలికలనూగుచు విస్మ్ర్రుతిలో విలీనమైపోదును నీదు క్రొవ్వలపు పూల ముగ్ధపరీమళమ్ములో

Wednesday, January 31, 2007

ASKASHOK

hey this is ashok

studied in MH school kaspa Vizianagram 1953-59

MR college vizianagram MPC PASSED 1963

M Sc Tech applied physics

andhra university 1963-66

PhD in thin films

taught in andhra university from 1973 to 2005.

visit this site for information on net freebies,

music and video downloads

vizag news

telugu literature.

english fiction

translation from english to telugu--telugu to english.

and ofcourse physics fiberoptics lasers optical communications

ask me any thing. those who know me call me a living encyclopaedia and dictionary put together.

you wont be disappointed

ask me

i am waiting

i will be adding online games from time to time

if you have any specific assignments to help,

problems to solve,

or translations to be done

pay US$2.0 only by paypal

Click for Cwc Vishakhapatnam, India Forecast Click for Redmond, Washington Forecast