Search This Blog

Wednesday, August 29, 2007

sistlaa ramakrishna

నిన్ననే డాక్టరు మళ్ళీ మామూలు జీవితానికి పొమ్మని సెలవిచ్చాడు. ఈ బ్లాగులో తొందరగా మళ్ళీరాయమనీ ఆదెశించాడు. కాలేజి స్థలపురాణం అయ్యాక ఇక జ్ఞాపకాలకి వద్దాం.వీటికి కాలానుసరణ యేమీ కనపడకపోతే పట్టించుకోకండి.ఆ క్షణానికి గుర్తొచ్చినట్టు రాస్తున్నాను. నిజం చెప్పాలంటే చదువులో ఒక్కొక్క దశా దాటుతుంటే మనం క్లాసురూములో నేర్చుకునేది తాగిపోతూ జీవితంగురించి నేర్చుకునేది పెరుగుతూ వస్తుంది. స్కూలు రోజుల్లో పుస్తకాలనించి నేర్చుకునేది యెక్కువగా వుంటే యూనివర్సిటీకి వచ్చేసరికి జీవితం గురించి నేర్చుకునేదే యెక్కువవుతుంది. ఆ దశలో కొత్తవి క్లాసులో నేర్చుకున్నా అవి అతి త్వరగా మరుగున పడ్డం కద్దు. నాకయితే కాలేజికి వచ్చేప్పటికి వయసు తక్కువ అవడం చాత జీవితంగురించి యెక్కువగా యూనివర్సిటీలోనే నేర్చుకున్నాను. అయితే జీవితం కాలేజిలో నేర్పిన పాఠాలు తరువాతతరువాత అర్ధమయి అబ్బురపరచిన సందర్భాలూ లేకపోలేదు. ముందుగా నా జ్ఞాపకాల్లో శిష్ట్లా రామకృష్ణ ని గుర్తుచేసుకోవాలనిపిస్తోంది. అతను నాకు ఒకటిరెండు సంవత్సరాలు సీనియర్.అతను ఆజానుబాహువూ స్ఫురద్రూపీ.కంచుకంఠం అతనికి దేవుడిచ్చిన వరం. ఆచార్య ఎస్వీ జొగారావు గారి తమ్ముడు. అతను స్టేజి మీద విలన్ వేషం వేసి కౄరంగా నవ్వితే గుండెలు జలదరించేవి. అది నిజంగా నవ్వు కాదనీ బొహహహా అంటే అలానే ధ్వనిస్తుందనీ అతనే నాకు నేర్పించాడు. అతనూ నేనూ కలిసి చాలా నాటకాల్లో వేశాం. అంధ్రవిశ్వవిద్యాలయం స్టేజిమీద ఆచార్య ఎస్వీ జోగారావు గారిని చూసినవాళ్ళెవరయినా వుంటే ఈ నవ్వు తెలిసే వుంటుంది. అతనే ముందు గుర్తుకిరావడం యెందుకంటే అతను కొనగోటితో అధ్భుత కళాఖండాలు సృష్టించేవాడు. గోటితో చిత్రాలువేయడం చాల అశ్చర్యంగా వుండేది. మేమందరం కోరికోరి మా బొమ్మలు మాకు కావలసిన బొమ్మలూ వేయించుకునేవాళ్ళం. ఈ విద్య తరవాత రోజుల్లో నఖచిత్రకళగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలేజి వదిలాక అతను నెమ్మదిగా అధ్యాత్మికలోకంలోకి వెళ్ళి చాలా ఆనందాన్ని సొంతం చేసుకున్నాడు. సుందరాకాండని అంతటినీ నఖచిత్రాల్లో లిఖించి దాదాపు ఎమ్మెస్ రామారావుగారంతపేరూ గడించేడు. ఇతనే మా లైబ్రరీ గట్టుమీదకూర్చుని అమ్మాయిలని ఆటలాడించేవాడన్న మాట యెక్కడయినా చెపితే యిప్పుడు కొట్టినా కొడతారు.

No comments: