Search This Blog

Friday, July 31, 2009

యు ఎన్ బీ రావు

ముల్లు మరిచిపోయేలా చేసిన అజ్ఞాత వ్యక్తికి కృతజ్ఞతలు.ఆయన ఒకానొక వెబ్ సైట్ లో నా బ్లాగు గురించి రాసిన రివ్యూ చదివి మళ్ళీ రాయాలని కోరిక కలిగింది. యు. నాగభూషణరావు అని ఒక మంచి మిత్రుడు. విజయనగరం లో పి యు సీ లో క్లాసుమేటు. బి ఎస్ సీ లో జియాలజీ తీసుకోడంతో క్లాసు మారింది కాని స్నేహం మారలేదు.కొంచెం సెన్సిటివ్ వ్యక్తి. మన మందం టోలుకీ దానికీ యెలా కుదిరిందో చెప్పలేను కాని కుదరడం మాత్రం నిజం. యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా ఇద్దరం కలిసే వచ్చాం. వాడు జియాలజీ ఎం ఎస్ సీ లో చేరాడు. చేరిన కొత్తలో ఇద్దరం మార్నింగ్ షో సినిమాకి వెళ్ళాం.ఆనాటి అలంకార్ థియేటర్ లో.సహదేవుడిలాకాదులెండి. మాకు విశాఖ కొట్టిన పిండే.సినిమా అయి బయటకి వచ్చాక చాలా రష్ గా వుంది. ఆ సందడిలో వాడి పర్స్ యెవరో కొట్టేశారు.అయిటే దొంగ చెయ్యి జేబులో వుండగానే వాడు పట్టుకున్నాడు. ఆ రోజుల్లో పోలీస్ కంట్రోల్ రూం అలంకార్ సినీమా పక్కనే మైన్ రోడ్డు మీద వుండేది.ఇప్పుడు సిల్క్ ఎంపోరియం వున్న మేడమీద. ఇద్దరం దొంగని తీసుకుని అక్కడైకి వెళ్ళాం.నేను వద్దంటున్నాను. నీ పర్స్ ఒచ్చేసిందికదా ఆకలేస్తోంది పద అని. వాడేమో ఇలా వదిలేస్తే మరొకళ్ళ పర్స్ కొట్టేస్తాడు. పోలీసులకి అప్పగించాల్సిందే అని తీసుకు పోయాడు. ఆ నాటి దొంగలు కూడా అమాయకులే. ఇప్పుడైతే మేమింత మాట్లాడే లోగా యేంజరిగేదో!తీరా వెళ్ళిన తరవాత ఆ దొంగని పోలీసులు ప్రశ్నించసాగారు.కొంతసేపయాక వాళ్ళ అసలు పధ్ధతులు తీశారు.ఒక్కొక్క దెబ్బా పడుతుంటే తనకే తగిలినట్టు విలవిల లాడసాగేడు నాగభూషణరావు. కాస్సేపటికి పోలీసులకి అడ్డుపడి కొట్ట వద్దని బతిమాలాడు.యెలాగోలా ఆపించి. బయటకి వచ్చి హాస్టల్ గదికి వెళ్ళిన దాకా సైలెంట్ గా ఉండిపోయాడు. వాడు మామూలు మనిషవడానికి రెండు మూడు రోజులు పట్టింది.నాలుగో రోజు మంగళవారం--వాడి మౌనవ్రతం! ఆ నాగభూషణరావే తరువాత ఐ పీ ఎస్ పాసై ఢిలీలో ఉన్నత పోలీసు పదవులు సాధించి రిటైరయ్యాడు.మరి పదవీ కాలంలో ప్రశ్నా విధానాలు మార్చాడో లేదో తెలీదు. మార్చే వుంటాడు. విషాదమేమంటే కొడుకు చిన్న వయసు లోనే మరణించడం. అతని పేరుమీద ట్రస్ట్ పెట్టి తను పుట్టి పెరిగిన చోట్లలో పేద విద్యార్ధులకి సాయంచేస్తున్నాడు.సాయం అందిన వాళ్ళు అర్హులుగా పెరుగుతారని ఆశిద్దాం.

Saturday, July 11, 2009

ముల్లు

ఒక యుగం అయినట్టుగా వుంది. రిప్ వాన్ వింకిల్ లాగ నిద్ర పోయానా!నిద్రలో పీడకలలాంటి నిజం ఒకటి జరిగి మనసు కలిచివేసింది.ఇన్నాళ్ళకి మామూలవుతున్నా[నా?] మా ఎదురింటిలో సన్నగా పొడుగ్గా ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి గీతం లో ఇంజనీరింగ్ చదివేది.రోజూ ఉదయం నేను వాకింగ్ చేసి తిరిగి వచ్చే సమయానికి ఆ అమ్మాయి కాలేజికి వెళుతూ కనిపించేది.కాగడామల్లెలా తయారై చిరునవ్వుతో పలకరించేది. నేనూ పలకరించి బాగున్నావా అనో బాగా చదువుతున్నావా అనో అడుగుతూ వుండే వాడిని.తరవాత రోజంతా మరి ఆ అమ్మాయిని కలిసే సందర్భమే వుండేది కాదు.కొన్ని రోజులు నేను ముందుగాలేచి వాకింగ్ కి వెళ్ళడమో లేదా బధ్ధకించడమో జరిగి ఆ అమ్మాయిని కలవలేదు. బధ్ధకానికి బరువెక్కువై డాక్టరు చేత చీవాట్లు తిని మళ్ళీ మామూలు సమయానికి వాకింగ్ మొదలు పెట్టి రోజూ ఆ అమ్మాయిని కలవడం మొదలైంది.ఒకరోజు వాకింగ్ కి వెళ్ళే ముందే పెందరాళే లేచిపోయాను.తోచక నెట్ తెరిచి మ్యూజిక్ సైట్లు బ్రౌజ్ చేస్తూ ఫ్యూషన్ రామదాసు అనే ఆల్బం విన్నాను.బాగా నచ్చింది.సరే వెంటనే నా మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసి జేబులో పెట్టుకుని వాకింగ్ బయలుదేరాను. తిరిగివస్తున్నప్పుడుకూడా ఆ పాటలు వింటూ వస్తుంటే ఆ అమ్మాయి కనబడింది. అన్య మనస్కంగా పాటలు వింటున్న వాడిని తిరిగి పలకరించలేదు. రియలైజ్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ అమ్మాయి చాలా దూరం వెళిపోయింది. నిజంగానే చాలా దూరం వెళిపోయిందని మర్నాదు సాయంకాలంగాని తెలియలేదు.ముందు రోజు చేసిన తప్పు దిద్దుకోవాలని మర్నాడు ఆ అమ్మాయిని కలిసే సమయానికి వాకింగ్ వెళ్ళాను.కాని ఆ అమ్మాయి కలవలేదు .ఇంటికొచ్చి ఈనాడు తెరిచి చూస్తే లోకల్ పేపర్లో ఇంజనీరింగ్ విద్యార్ధిని రుషికొండ బీచ్ లో ఆత్మహత్య అని వుంది.అయ్యో అని పెట్టేశాను. సాయంత్రం మా పనిమనిషి మా ఆవిడతో చెప్పింది. మా యెదురింట్లో వుండే అమ్మాయి చచ్చిపోయిందని బాడీని తీసుకు వెళ్ళడానికి అదేదో వూరినించి వాళ్ళ తలిదండ్రులు వచ్చారనీ. యెక్కడో కలుక్కుమంది.ఆ పిల్ల తో వ్యక్తిగతంగా నాకెలాంటి పరిచయమూ లేదు.తన బాధలేమిటో నాకు తెలీదు.కాని ఆ రోజు ఉదయం పట్టించుకోకుండానేను తిరిగి పలకరించకపోవడం తన నెవరూ పట్టించుకోటంలేదు ఆఖరికి ఈయన కూడా అనే నిరాశకి సాయమయిందా.నాకు తెలీకుండానే నేను అంతిమతృణాన్నయ్యానా అనే ముల్లు ఇన్నిరోజులుగా నానూ గుచ్చుతూ యే పనీ సంతోషంగా చెయ్యనివ్వలేదు. ముఖ్యంగా నా విద్యార్ధులు ఒకరిద్దరిని ఇదే పరిస్థితుల్లో నేను ఆపగలిగాను.ఈ అమ్మాయిని కూడా ఆపగలిగి వుండేవాడినా! యేమో.

Tuesday, May 5, 2009

యూనిసెక్సూ బ్రాహ్మణోత్తముడూ

కాన్వొకేషన్ కి ఇచ్చిన పాసులపై నంబర్లుండేవి. దాని ప్రకారం సీటు దగ్గరకి వెళితే ఆ కుర్చీలో ఒక పాకెట్లో డిగ్రీ , కాన్వొకేషన్లో చెయ్యాల్సిన పనుల జాబితా ,తీసుకోవల్సిన శపథం కాపీ ఇత్యాదులు వుండేవి. అవి తీసుకుని కూర్చోవాలి. వేరే ఇవ్వడం అదీ ఏమీ వుండదు-మెడల్సు పుచ్చుకునే వాళ్ళకి తప్ప.నేను ఎం ఎస్ సీ టెక్ ఫస్టియర్ చదువుతున్నప్పుడు బి ఎస్ సీ డిగ్రీ తీసుకున్నాను అందర్లాగే.మా పాతకాలేజి నించి మిత్రులు కూడా వచ్చేరు ఈ పని మీదే. వాళ్ళలో గోపాలరత్నం అనే అమ్మాయి కూడా వచ్చింది.ఈ యూనిసెక్స్ పేరుతోనే వచ్చింది తంటా. ఆ అమ్మాయి తన సహ విద్యార్ధినులతో కలిసి లోపలకి వెళ్ళాక అసలా అమ్మాయి నంబరున్న సీటే లేదు అక్కడ!ఇలాంటి చిన్న పొరపాట్లు ఆ రోజుల్లో జరిగేవికాదు--చండశాసనులనిపించుకున్న సూపరింటెండెంట్లుండేవాళ్ళు రిజిస్ట్రారాఫీసులో.వెతగ్గా వెతగ్గా సంగతి బయటపడింది. ఆ నంబరు సీటు మగవాళ్ళ సీట్లలో వుంది. పోనీ పాకెట్ తీసేసుకోమంటే-- డిగ్రీ మీద మిస్టర్ గోపాలరత్నం అని రాసి వుంది.అది పనిచెయ్యదే!ఈలోపల కాన్వొకేషన్ మొదలయ్యే టైమయిపోతోంది.అక్కడ వున్న సూపరింటెండెంటుని అడిగితే. ఆ పాకెట్ ఆఫీసులో ఇచ్చేసి లెటర్ పెట్టమన్నాడు. అమ్మాయి మాతో హాస్టల్లో పడుకునే రోజులు కాదుకదా. అందుకని ఒక కాగితం మీద సంతకం పెట్టించి ఆ పాకెట్ తీసుకుని ఆమెని సరదా చూసేసి ఇంటికి పొమ్మన్నాం మరునాడు ఉదయమే క్లాసు ఎగ్గొట్టి ఆ డిగ్రీ , జరిగింది వివరిస్తూ ఒక ఉత్తరమూ పట్టుకుని రిజిస్ట్రారు వారి ఆఫీసుకి వెళ్ళి మొదటి అంతస్తులో ఒక చివరికి వున్న ఆ సెక్షను కి వెళ్ళి గుమ్మం లో నిలబడి లోపలికి తొంగి చూస్తూ నిలబడ్డాం. యు వి రమణయ్య గారనే సూపరింటెండెంటు కళ్ళజోడు పైనించి చూసి తల యెగరేశాడు యెందుకూ అన్నట్టు. ఆ రోజుల్లో వాళ్ళన్న భయంగానే వుండేది--వాళ్ళ నిజాయితీ రుజువర్తనమే వాళ్ళకా మర్యాద తెచ్చేవనుకుంటాను.పైగా యే క్షణంలోనైనా రిజిస్ట్రారు వస్తారేమోనన్న దడ --కూర్మావేణుగోపాలస్వామి గారివ్యక్తిత్వమూ అలాంటిదే. సరే రమణయ్యగారి సైగకి జవాబుగా చేతిలోని కాగితాలని పైకెత్తి ఆడించాను . మళ్ళీ తల తాటించారు. అంటే రమ్మని అన్న మాట.లోపలికి వెళ్ళి ఆయన ముందు నిలబడి చేతికి కాగితాలు అందించాం. ఒక సారి డిగ్రీ పక్క చూసి రేపు సాయంకాలం అన్నారు. ఒక్కమాటే నన్నమాట ఆ వేళకి.సమస్యకొంచెం వివరించబోయాం 'ఇదీ' అంటూ. ఈ సారి తల గుండ్రంగా తిప్పి చెయ్యి గాల్లోకి ఊపేరు. అర్థం అయింది వెళ్ళమని మేమూ అర్థం చేసుకుని ఇంకోచెంసేపుంటే గెంటిస్తాడేమోనని వచ్చేశాం. గెంటిస్తే ధర్నా చెయాలని అప్పట్లో తెలీదుగా.రెండోరోజు సాయంత్రం అయిదింటికల్లా టంచనుగా వెళ్ళీ నిలబడ్డాం. మళ్ళీ ఆయనే. సూపరింటెండెంటుకి తప్ప మరెవరికీ బయటవాళ్ళతో మాట్లాడే హక్కు లేదు ఆ సెక్షన్లో. పేరు ? అని ప్రశ్నించేరు--డిగ్రీ మీదదని ఊహించి గోపాలరత్నం అన్నా ఊఉ అని తన ముందున్న దస్త్రం లోంచి వెతికి చేతికిచ్చేడు.చూసుకున్నాం. మిస్ గోపాలరత్నం అని వుంది. థాంక్సండీ అని వెనుతిరిగాం. ఉండు అని హుంకరించేడు. గతుక్కుమని వెనక్కి తిరిగేం. సంతకం చెయ్యద్దా అని పుస్తకం ముందుకి తోసేడు. సరేనని సంతకం చేసిచ్చి నిలబడ్డాం మళ్ళీ పిలిస్తే వెనక్కి తిరగడమెందుకని. ఒకసారి సంతకం చూసి ఇదేమిటి ? గోపాలరత్నం నువ్వు కాదా? అని డిగ్రీ వెనక్కిమ్మన్నట్టు చెయ్యి చాచేడు. కంగు తిని సీత రాముడికేమవుతుందో పూర్తిగా వివరించి చెప్పాను. అవును కదూ అని కళ్ళ జోడు సర్దుకుని మళ్ళీ చెయ్యి ఊపాడు. అమ్మయ్య అని బయటపడ్డాం. అయ్యా అదీ రమణయ్య గారితో నా తొలి పరిచయం. తరవాతి రోజుల్లో ఆ బ్రారహ్మణోత్తముడు చాలా మంచి మిత్రులయ్యేరు.

Friday, February 13, 2009

convocation

ఆంధ్రా యూనివర్సిటీ జీవితంలో ముఖ్య స్థానంలో హాస్టల్ జీవితం, మెస్సులు , కాంటీన్ ఆక్రమిస్తాయి. ఇక్కడేకాదు --ఐ ఐ టీ విద్యార్ధులని అడిగినప్పుడూ ఇదే చెప్పారు. వీటికి సంబంధించిన జ్ఞాపకాలూ మధురమే. మెస్సుల్లో ఫీస్టులని వివిధ సమయాల్లో నిర్వహించే వాళ్ళు. వాటికి మిత్రులని గెస్టులుగా పిలిచే యేర్పాటు వుండేది. దాదాపు పెళ్ళి భోజనాల్లాగ మంచి సందడి వుండేది. సంవత్సరాంతంలో వోపెన్ ఎయిర్ ఫీస్టు వుండేది. దానికి మాస్టర్లని పిలిచే రివాజు వుండేది. ఒక చీఫ్ గెస్టు ప్రముఖుల్నెవర్నైనా పిలిచే వాళ్ళం. కాన్వొకేషన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి శనివారం నిర్వివాదంగా నిర్వహించే వారు. దీనికి ఒక ప్రాముఖ్యత యేమంటే అప్పట్లో డిగ్రీ [బి ఏ, బి ఎస్ సీ వంటివి] పాసైనవాళ్ళకి కూడా కాన్వొకేషన్ లోనే డిగ్రీ ఇచ్చే వారు. ఎం ఏ ఎం ఎస్ సీ మొదటి సంవత్సరం విద్యార్ధులందరూ ఆ మార్చిలో డిగ్రీ పాసయిన వాళ్ళే వుండేవాళ్ళు--స్వాభావికంగా. అందుకని వాళ్ళందరూ కూడా కాన్వొకేషన్లో డిగ్రీ తీసుకునే వాళ్ళు యూనివర్సిటీలో చేరకపోయినా మిత్రులిక్కడవుండడంతో పాసైన మిగిలిన వాళ్ళు కూడా కాన్వొకేషన్ కి హాజరయ్యే వాళ్ళు. దానితో ఒక పండగ వాతావరణం వుండేది.పైగా డిగ్రీ తీసుక్లునే వాళ్ళు గౌన్ ధరించాలనే నిబంధన వుండడంతో గౌన్లు అద్దెకిచ్చే వాళ్ళతో హాస్టల్ అరుగులన్నీ నిండి వుండేవి. మరి ఫొటోలు తీసే వారు సరేసరి. ఈ సమయంలోనే యువజనోత్సవాలు జరిగేవి. అంతర్ కళాశాలల నాటక పోటీలు జరిగేవి. మూడేళ్ళకోసారి ఈ సమయంలోనే వైజ్ఞానిక ప్రదర్శన కూడా వుండేది. పైగా ఈ సమయంలోనే ఒక ఫీస్టు కూడా వుండేది.స్వస్థలాలనించి డిగ్రీ తీసుకోడానికి వచ్చిన మిత్రులకి ఆతిధ్యమియ్యడానికి మంచి అవకాశంగా వుండేది. ఈ పండగలో పాలు పంచుకోడానికి నాకు చాలానే అవకాశాలు వచ్చాయి. యెందుకంటే విజయనగరంలో బి ఎస్ సీ చదువుతున్నప్పుడుకూడా నాటకాల పోటీలకి మూడేళ్ళు వచ్చాను.సరే తరవాత ఆ గూటి పక్షినే కాబట్టి అలవాటైపోయింది.సంఖ్య యెక్కువ కావడంతో క్రమేణా డిగ్రీ పాసయిన వాళ్ళకి ఇక్కడ పట్టాలివ్వడం మానేశారు. ఆ అందమూ పోయింది--అన్నిటిలాగానే. ఇంతకీ ఇదెందుకు మొదలెట్టానంటే నేను డిగ్రీ తిసుకున్న సంవత్సరం ఒక విచిత్ర సంఘటన జరిగింది.దానిగురించి వచ్చే సారి.

Sunday, January 25, 2009

సహదేవోపాఖ్యానం-2

సాయంత్రం ఆరయ్యేప్పటికి అందరమూ మా రూము ముందున్న ఎంక్లోజర్ లో కూచున్నాము. సినిమా ఆరింటికవుతుంది. సహదేవుడు బస్సెక్కడానికి మరో అరగంట తీసుకున్నా యేడింటికల్లా రావాలి. వాడికి మెస్సు తెరవగానే తిండికి తయారవడం[ క్రీం బాచి] అలవాటు కనుక వీలయినంత తొందరగా వచ్చేయాలి. ఈ లో గా అవుట్ గేటు నించి మిరపకాయ బజ్జీలు తెచుకుని తింటూ వాడి అనుభవం వినడం కోసం వేచిచూస్తున్నాం. యేడయినా వాడి జాడ లేదు.మెస్సుకి వెళిపోయుంటాదని మేం కూడా వెళ్ళాం. మా భోజనాలు పూర్తిచేసినా వాడు రాలేదు. వాడి కోసం చూద్దామన్నా సీట్లు ఖాళీ చెయ్యాలి. మెస్సు ముందే కుర్చీలు తెప్పించి వేసుకుని కూర్చున్నాం తొమ్మిదిన్నరయినా వాడు కనబడలేదు.[శనివారం పదిన్నర దాకా మెస్సుంటుంది.] తప్పిపోయాడేమో అని అనుమానం వచ్చింది. అయితే రావలసింది యూనివర్సిటీ కి కనుక యెలాగైనా వచ్చేస్తాడు పరవాలేదని యెవరి రూముకి వాళ్ళు వెళిపోయాం . రాత్రి యెప్పుడొచ్చాడో యేమోకాని పొద్దున్న లేచి చూసేప్పటికి గదిలో ముసుగు కప్పుకుని నిద్రపోతున్నాడు. లేపి యేమయిందని అడిగితే యేమీ మాట్లాడలేదు. సైలెంట్ గా మెస్సుకి వెళ్ళి టిఫిన్ తిని వచ్చేశాడు. తరవాత కొంచెంసేపటికి ఇంతకీ ఆ సరస్వతీ టాకీసు యెక్కడుందిరా అని సగం యేడుస్తున్న గొంతుతో అరిచాడు.అయితే నువ్వు సినిమా చూడనే లేదా అని హాచ్చెర్య పోయాం[నవ్వు దాచుకుంటూ] హాలు కనిపిస్తేకద సినిమా చూడ్డానికి. మీరు తిన్నగ దారి చెప్పకుండా నన్నేడిపిస్తారా అని కోపించాడు. అదేమిట్రా చౌల్ట్రీ దగ్గిర దిగి యెవర్నైనా అడగమన్నాం కదా అంటే ఆ వాడేమో చౌల్ట్రీ యెదురుగా వున్న రోడ్డు మీద వెళ్ళమన్నాడు అలా వెళితే వెళితే రైలు పట్టాలూ బ్రిడ్గీ వచ్చాయి ఇంకా ముందుకెళితే రైలుగేటొచ్చింది అక్కడడిగితేనేమో నన్ను అదోలా చూసి వెళిపోయారు .ఆ చుట్టూ తిరిగి తిరిగి యెంతకీ కనపడక పోతే ఇంతలో రెండో నంబరు బస్సు కనిపించింది. ఇంక అది యెక్కి రూముకి వచ్చాను. అన్నాడు. మాకేమీ అర్ధం కాలేదు.కొంచెం సేపటికి వెలిగింది. వాడు అమాయకుడనుకున్నామే కాని మరీ ఇంత అనుకోలేదు. యేమయిందంటే వాడు వెళ్ళిన రోడ్డు మీద ఒక అయిదు నిమిషాలు నడిచాక కుడిపక్క తిరగాలి. ఇప్పుడయితే అక్కడ డాల్ఫిన్ హోటలూ జ్యోతీ థియేటరూ వున్నాయి. అప్పుడవేమీ లేవు. అక్కడ వాడెవర్నైనా మరోసారి అడిగివుంటే బాగుండేది. అలా కాకుండా తిన్నగా ముక్కుకి సూటిగా వెళ్ళాడు.అయినా అప్పటికి రాజేశ్వరీ మనోరమా వంటి సినిమాహాళ్ళు లేవు-ఇప్పుడూ లేవనుకోండి!. చావుల మదుం బ్రిడ్జి దాటి కూడా వెళ్ళి రామ్మూర్తిపంతులు గేటు దగ్గిరకి వెళిపోయాడు. అక్కడికి వెళ్ళి సరస్వతీ టాకీసని అడిగితే అదోలా చూడరామరి!ఇంతకీ అసలు సందేహం తీరలేదు. మరి అంత సేపేం చేస్తున్నావురా అని అడిగితే మీరంతా ఆట పట్టిస్తారని అయిదింటి నించీ లైబ్రరీ లో కూర్చున్నాను. అని సెలవిచ్చాడు. అందరం తలో దెబ్బా వేసి ప్రాయశ్చిత్తంగా వాణ్ణి వూటీ హోటలుకి తీసుకెళ్ళి స్పెషల్ మీల్సు పెట్టించి బందిపోటు సినిమా చూపించి పాప నాశనం చేసుకున్నాం. తరవాతి రోజుల్లో ఆ అమాయకత్వాన్నంతా వదిలించుకుని టాప్ రాంకరై వో ఎన్ జీ సీ లో ఉన్నతోద్యోగి అయ్యాడు వాడికి నా శుభాకాంక్షలు. చదువుతాడు నాకు తెలుసు.

Friday, January 23, 2009

సహదేవోపాఖ్యానం

నిన్న యెందుకనో సహదేవుడు గుర్తుకొచ్చి మళ్ళీ రాయడానికి పురికొల్పాడు. సహదేవుడు నేను చేరినప్పుడ యూనివర్సిటీలో చేరాడు-జియోఫిజిక్సులో చేరాడు. గ్రామీణ ప్రాంతం నించి వచ్చినవాడవడంచేత కొంచెం అమాయకంగా వుండేవాడు మొదట్లో- తరవాత షరామామూలే కదా.1963 ఆగస్టు నాటి సంగతి.అప్పటి విశాఖకీ నేటి విశాఖకీ రాజసులోచనకీ ముమైత్ ఖాన్ కీ ఉన్నంత తేడా.యూనివర్సిటీకీ టౌన్ కీ మధ్య అగాధమే అనవచ్చు. మరో వూరెళ్ళినట్టే వుండేది.రాత్రి తొమ్మిదయ్యాక తిరిగి రావడమంటే నడకే. ఆటోలు లేవు. రిక్షావాడు లాగలేడు.[రిక్షా వాడితో సి ఆర్ చంద్రన్ కధ కూడా వుంది. సమయానుసారం అదీ వస్తుంది] మొదటాట సినిమాకి వెళితే తిండీ దొరకదు. అందుకని అయితే మేట్నీ కీ లేకపోతే యెలాగా నడవాలి కాబట్టి సెకండ్ షోకీ వెళ్ళేవాళ్ళం.మరి సెకండ్ షో అంటే నిర్మానుష్యంగా వున్న దార్లో కొంచెం ధైర్యం కాని బోలెడు మొండితనం కాని వుండాలి.అలాంటి రోజుల్లో బందిపోటు సినిమా రిలీజయింది. సరస్వతీ టాకీసులో. అన్న గారి సినిమా పైగా అప్పట్లో విశేషాకర్షణగా బోలెడు నేలబారు నృత్యాలున్న సినిమా.మేం హెడ్ వాకింగ్ చేసి మొదటి రోజునే చూసివచ్చి తెగ కబుర్లు చెప్పుకున్నాం. వినివినీ సహదేవుడికి నోరూరింది.చూడాలి చూడాలి. వాడప్పటికా వూరొచ్చి వారమే అయింది. విశాఖలో దారులు అంతబాగా తెలిసిన వాడు కాదు. సినిమాకి తనే టిక్కెట్టుకొని తీసుకెళతానని ఎవర్నైనా కలిసి రమ్మనీ చాలా అడిగాడు. యే బుధ్ధితో ఉన్నారో ఎవరూ పలకలేదు. మర్నాడు శనివారం. మధ్యాహ్నం పన్నెండింటికల్లా బయలు దేరి తనే వెళ్ళాడు. టిక్కెట్టు దొరక్కపోతే యెలా సంపాదించాలో తలో సలహా ఇచ్చారుకాని ఎవరూ కదల్లేదు.కొంచెం విశాఖ గురించి గుర్తు చెయ్యాలి. అప్పట్లో సిటీ కి వెళ్ళాలంటే టర్నర్స్ చౌల్ట్రీ నే ముఖ్య బస్ స్టాపు. ఇప్పట్లా దాన్ని సూపర్ బజార్ అనే వారు కాదు. నిజానికి అప్పుడు సూపర్ బజారింకా లేనేలేదు.ఆ స్థలంలో ఒక టీచర్ ట్రైనింగ్ స్కూలుండేది. సరే జగదంబ సంగతి చెప్పక్కరలేదు.అప్పట్లో యెల్లమ్మ తోట అనబడే ఆ స్టాపు దగ్గర దిగినా అక్కడేమీ ఉండేవి కావు. అందుకని చౌల్ట్రీ దగ్గర దిగమని మరీ మరీ చెప్పి కాగితం మీద రాసి ఇచ్చి మరీ సాగనంపాం. బస్సుకి పన్నెండు పైసలు సినిమాకి రూపాయి పది పైసలు. ఇంటర్వెల్లో సోడా మూడు పైసలు,తిరిగి బస్సు పన్నెండు పైసలు పైసలు, వెరసి రూపాయి ముఫ్ఫయ్యేడు పైసలు యెందుకన్నా మంచిది రూపాయిన్నర తీసుకెళ్ళమని కూడా చెప్పాం . నవ్వకండి సినిమా కెళ్తే మాఖర్చు ఆ రోజుల్లో అంతే-- మేటనీ కైతే! అదే మొదటాట కైతే తిరుగు బస్సుండదు కాబట్టి ఇంకా తక్కువ.టిఫిను కూడా తింటే మరో ఇరవై ఎనిమిది పైసలు. ఆ మాట పక్కన పెడదాం. వాడు వెళ్ళిన తరవాత ఆ మధ్యాహ్నమంతా వాడు యెలా గడుపుతాడో తలుచుకుని తలుచుకుని ఒకటే ఆనందించాం-- బారిష్టరు పార్వతీశం గారిని కూడా తలుచుకున్నాం.మొత్తానికి మంచి మధ్యాహ్నం.ఇంతకీ యేమయింది?