Search This Blog

Sunday, December 21, 2008

drying up

నాలుగు దశాబ్దాలకిందటి మాట.అప్పట్లో జె బాపురెడ్డి గారు విశాఖలో ఉండేవారు. మా అక్క తురగా జానకీరాణి ఏదో పని మీద ఇక్కడికి వచ్చి పాత మిత్రుణ్ణి చూడాలని నన్నుకూడా తీసుకుని వెళ్ళింది.వాళ్ళ పిచ్చాపాటీలో ఆయన్ని అడిగింది .మీకెప్పుడైనా ఒకసారి యేమీ రాయలేకుండా అయిపోతుందా అని. తనకి ఉన్నట్టుండి అలా అయిందని యేదన్నా రాద్దామంటే అసలు మనసు పుట్టడంలేదనీ అంది. ఆయనేదో సమాధానం చెప్పారనుకోండి. నేను మాత్రం కుర్రతనపు వేడిలో వాళ్ళ హిపోక్రసీ కి నవ్వుకున్నాను. ఈ మధ్యనే ఆ బాధేమిటో తెలిసింది. కొన్ని దశాబ్దాలుగా ఫిజిక్సో ఎలెక్ట్రానిక్సో కధలో బ్లాగులో అదేపనిగా రాస్తూనే పోయినా గత నెల రోజులుగా మనసటుపక్క పోవడంలేదు. ఈ రోజే కొంచెమైనా చెయ్యి కదిలింది. నన్ను రాయమన్న కంపెనీలన్నీ జుట్టు పీక్కుంటున్నాయి. ఇద్ మొదలేమో అని ఆశగా వుంది.

Friday, December 12, 2008

Friday, October 24, 2008

ఉపేంద్రనాధ్ గురించిచెప్పాలి.అతను ఇంగ్లీషులో మామూలుగా మాట్లాడే పదాలకి తెలుగు మాటలు సృష్టించడంలో నిష్ణాతుడు. మాటవరసకి వర్క్ షాప్ ప్రాక్టికల్సుని కార్మికుల కార్యక్రమం అని నామకరణం చేసింది అతనే. అలాగే ఎలెక్ట్రానిక్స్ లాబ్ లో వైర్ల మీద ప్లాస్టిక్ స్లీవింగ్ తీసే కార్యక్రమాన్ని తోలు తీయడం అని అన్నదీ అతనే.షడాననరావు రూమ్మేటుగా చాలా గమ్మత్తయిన జంటల్లో ఒకడుగా మమ్మల్ని అలరించెవాడు.అతని పెదనాన్నగారు పేరెన్నికగన్న సైంటిస్టు అంతే కాకుండా మా డిపార్ట్మెంటుకి అనేక సార్లు యెక్జామినరుగా వచ్చి కర్కోటకుడని పేరు తెచ్చుకున్నవాడు. ఆయనగురించే తొమ్మిదీ లేక తొంభయ్ అనే నానుడి వచ్చి భూప్ రాజ్ పాండే లాటివాణ్ణి గడగడలాడించింది.యెవరా పాండే యేమాకధ అంటే కొంచెం ఆగాలి మరి. ఉపేంద్రనాధ్ మాతో పాటు యెలెక్ట్రానిక్స్ స్పెషల్ తీసుకున్న అయిదుగురిలో ఒకడు. ఎం ఐ టి శాస్త్రి గారి మాటకే బిక్కచచ్చిపోయిన జే ఎస్ ప్రకాశరావు కి కొండంత అండగా నిలిచిన వాడు. ఈ కధలన్నీ వినాలంటే కొంచెం ఆగాలి మరి.`

Thursday, October 23, 2008

bahukaladarsanam

కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడల్లా నా మనమరాలు వొళ్ళోకెక్కి మారాం చెయ్యడంచేత ఇన్నాళ్ళూ పోస్టు చెయ్యడం కుదరలేదు. మనమరాళ్ళతోనూ కొడుకూ కోడలు తోనూ కాలం ఆనందంగా గడిచిపోయింది.ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో నా ఇంట్లో వున్నాను. సియాటిల్ లో ఉన్నప్పుడే విశాఖలోనే వుండే మా పెద్దబ్బాయి కూడా వేరే పని మీద సియాటిల్ రావడం అందరంకలిసి కాలం గడపడం ఒక మెరుపు. అన్నదమ్ములిద్దరూ చాలాకాలంతరవాత వాళ్ళిద్దరే కలిసి వూరిమీద రెండురోజులు బలాదూరు తిరిగారు.కాలేజిరోజులతరవాత దాదాపు పదిహేనేళ్ళకి. మా కోడలూ మేము వాళ్ళని రెండు రోజులు వొదొలేశాం.తిరుగు ప్రయాణంలో కొంత కష్టం కలిగింది- మా విమానం యే సీ చెడిపోయి వెనక్కి ఆంస్టర్డాం వెళ్ళిపోవడంతో. కట్టు బట్టలతో ఒక రోజుండాల్సి రావడమూ ఇండియా వచ్చేక హైదరాబాదు నించి విశాఖ కి రిజర్వేషన్లన్నీ వృధా కావడమూ ఇత్యాదులు.ఉపేంద్రనాధ్ గురించి చెప్పాల్సిన చోట ఆగాను. మళ్ళీ రేపు మొదలు పెడతాను.

Sunday, August 17, 2008

షడాననరావు

ఈసారి షడాననరావు గురించి చెప్పాలి. మంచి మిత్రుడు.కలుసుకుని ఇన్నాళ్ళయినా యెప్పటికీ ఆప్తుదే.గవర్నమెంటు కాలేజిల్లో ప్రిన్సిపాలుగా చాలాచోట్ల చేసి రిటైరై గుడివాడలో ఇల్లు కట్టుకుని సెటిలయ్యాడు. వాళ్ళమ్మాయి పెళ్ళి చేశాడీమధ్యనే.మేమందరం ఒక రూములో కూర్చుని కబుర్లూ పిచ్చాపాటీ చెప్పుకుంటూ వుండే వాళ్ళం.ఒకరోజు ఆంధ్రప్రభ వారపత్రిక ఒకరు గట్టిగా చదువుతుంటే యెవరకితోచిన కామెంట్లు వాళ్ళు చేస్తూ పోయే వాళ్ళం . ఆ పత్రికలో మాలతీ చందూర్ జవాబులూ ఆంధ్రపత్రికలో ఒకవారం విపరీతం ఇలాటివన్నీ మాకు విందు భోజనంలా వుండేవి. జవాబుల్లో ఒకరోజు యెవరో ఐ యె ఎస్ పరీక్షలగురించి అడిగితే మాలతి గారు తన పేటెంటి శైలిలో ఆ పరీక్షల గురించీ అందులో ఒచ్చే ప్రశ్న ల తరహా గురించీ ప్రవచించేరు. బంతి నేలకి కొడితే మళ్ళీ పైకెందుకొస్తుందనే ప్రశ్న గురించి ప్రస్తావించారు. షడాననరావు వంక చూసి యేం భాయ్ యెందుకొస్తుందంటావ్ అని అడిగాడు ఉప్పిగాడనబడే ఉపేంద్రనాథ్[అతనిగురించీ చెప్తాను. షడాననరావ్ అందర్నీ భాయ్ అని పిలిచే వాడు. మేమూ అతన్నంతే. టౌనుకెళ్ళి టెరికాట్ షర్టు చింపించుకొద్దాం రా భాయ్ అన్నాడంటే అతనికి మనియార్డరు వచ్చినట్టే.] కొంచెం సేపు ఆలోచించి, "యెందుకంటే యేం చెప్తాం భాయ్ , దానికి పుట్టుక తో వచ్చిన బుధ్ధది. " అని తేల్చేశాడు షడాననుడు.ఇంకో సారి మరెవరో చదువుతున్నారు ఒక వుత్తరం." నేను ఈ వుత్తరం తెనాలి నించి రాస్తున్నాను, నా పేరు -----. వయస్సు పధ్ధెనిమిది సంవత్సరాలు. ఇంకా పెళ్ళికాలేదు.--" తరవాత మాట చదివే ముందే ఉపేంద్రనాథ్ స్వగతాన్ని గట్టిగా అన్నాడు."యేమిటో యీవిడకంత తొందర!". ఇలా వుండేవి మా కాలక్షేపాలు.టీవీలూ, డిస్క్ మాన్లూ ,పబ్ లూ లేని రోజులు కదా!

Saturday, August 9, 2008

hanumamtuDu

హనుమంతుడు పరీక్షల్లొ పెట్టిన ఇబ్బంది చెప్పాను కదా. మొదటిసారి పార్ట్ వన్ పరీక్షకి వెళ్ళినప్పుడు వాడేమాత్రం చదివాడో మీకీ పాటికి తెలుసు.ఎలెక్ట్రికల్ మెషిన్స్ ప్రాక్టికల్ కి వాడితో కలిసి భయం గానే వెళ్ళాను. సీతాపతిరావుగారు ఎక్స్టర్నల్ ఎక్జామినర్. వీడికి యేదో ప్రాక్టికల్ వస్తే నాకు రాదన్నాడు .నీకేదొచ్చు అని అడిగారాయన. వీడికి ఇండక్షన్ మోటార్ అయితే పెద్దగా యేమీ చెయ్యక్కరలేదని మాత్రం తెలుసు అందుకని అది చేస్తానన్నాడు. కాల్క్యులేషన్స్ యెక్కువ వున్నా ఆ సంగతి తరవాతనుకున్నాడు. కాని ముందుగానే వాణ్ణే వైవా కి పిలిచాడాయన. మరి వీడికేం రాదుగా. తెల్లమొహం కాస్సేపు చూసాక నీకేం తెలుసో చెప్పమన్నారాయన.జనరల్ ఫిజిక్స్ యేదైనా అడగమన్నాడు. ఆయన సరదాగా ఎలె క్ట్రాన్ స్పీడెంత అన్నారు. నేను నా ప్రాక్టికల్ మానేసి ఇది జాగ్రత్తగా వింటున్నాను.కరక్ట్ జవాబు చెప్పేశాడు . వూరుకోవచ్చుగా-- యెలా కొలుస్తావని అడిగాడాయన.కుర్చీలో ఇబ్బందిగా అటూఇటూ కదిలేక చెప్పేశాడు.186000 మైళ్ళ పొడుగున్న దారం ఒకటి తీసుకోండి. దానికి ఒక చివర ఎలెక్ట్రాన్ని వదిలి రెండో చివరికి యెంతసేపట్లో వెళుతుందో చూసుకోడమే.!!!! అవాక్కవడం అందరి వంతూ.

Thursday, August 7, 2008

hanumamtasastri

హనుమంతశాస్త్రి గురించి చెప్పాలంటే యెంతైనా ఉంది. మచ్చుకి ఇంకోటి చూడండి.మాకు ఎం ఎస్ సీ టెక్ రెండో స్మంవత్సరం చివరికి పార్ట్ వన్ పరీక్షలుండేవి. నిజానికి అవే ఆయువు పట్టు.పొద్దున్నే యెలక్ట్రానిక్స్ పరీక్ష వుందనగా అందరం బిగుసుకు పోయి చదివేస్తున్నాం.సడెంగా హనుమంతుడొచ్చాడు. నీ దగ్గర టెర్మన్ వుందా అంటూ.పొద్దున్న పరీక్షయితే యిప్పుడు టెర్మన్ చదువుతావా అనుకుంటూ మేం యెలానూ ముట్టుకునేది లేదు కదా అని యిచ్చాను.మళ్ళీ రాత్రి ఒకటిన్నరకి వచ్చాడు. ఇది చూసావా అంటూ. వీడేదో కనిపెట్టడని తెలిసిపోయింది. యేదిరా అన్నం. యీ మొదట్లో చూశావా-- అన్నాడు. చూశాం. మాకు కొత్తగా యేం కనిపించలేదు. యేం మనుషుల్రా. అసలైనది ఒదిలేసి ఊరికే బట్టీ వేస్తారు. అసలు యెలెక్ట్రాన్ గురించి యిక్కడ పూర్తిగా ఉంది చూశావా. ఇది చదివితే మొత్తం అంతా అర్ధమైపోతుంది. అన్నాదు.సరే అని సంతోషించి బాగా చదివేసై అని చెప్పాం . అంతకన్నా చేసేదేముంది.

Tuesday, August 5, 2008

malli hello

నెల రోజుల పైనే అయింది ఇక్కడికి వచ్చి. ఇంత విరామం ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకుంటా.ఈ నెలలో మొదటి విశేషం యేమంటే నేను ఇప్పుడు అమెరికాలో వున్నాను. రెండో తారీకున వచ్చాను. యెందుకూ అంటే జూన్ పదమూడున నాకు రెండో మనమరాలు పుట్టింది.దాన్ని చూడ్డానికి నేనూ మా ఆవిడా రెడ్ మాండ్ వచ్చాము.పెద్ద మనమరాలి పుట్టినరోజు నవంబరు పదకొండు. అప్పటిదాకా వుండి వెళదామనుకుంటున్నాము. ఈ సందడిలో కొంచెం రోజులు పాతమితృలనీ మంచి జ్ఞాపకాలనీ కొంచెం వెనక్కి పంపడం జరిగింది.మల్లికార్జునాచారి గురించి చెప్పాను కదా. ఇంకా మా లాబ్ బాచిలో తాతి నాగేశ్వరరావూ చతుర్వేదుల హనుమంతశాస్త్రీ వుండే వాళ్ళు.తాతి నాగేశ్వరరావు మంచివాడు తెలివైనవాడే కాని అంత విలక్షణత వున్న వాడు కాదు. ప్రాక్టికల్ పరీక్షలకి వచ్చేప్పటికి వచ్చే సరికి బాచికి ముగ్గురే కావడంతో ఎ హెచ్ ఎం అని నేనూ ఆచారీ హనుమంతశాస్త్రీ మిగిలి నాగేశ్వరరావు పక్క బాచికి వెళ్ళాడు. అది నాకు వరమో శాపమో తెలీని స్థితి వచ్చింది. వర్క్షాప్ ప్రాక్టికల్ కి వెళ్ళడానికి గంట ముందు నా రికార్డు యేదిరా అని వెతుక్కోడమ్మొదలు పెట్టాదు. అందరం కలిసి కిందామీదా పడి వెతకడం మొదలెట్టం. చివరకి పీవీ రావనబడే మా సీనియర్[మరో విలక్షణ వ్యక్తి] రూములో టేబిల్ కాళ్ళకింద యెట్టుకి మడత పెట్టి పెట్టబడి వున్నాయి వీడి రికార్డ్ కాగితాలు. వాటి ఆకారం చూసి పాత కాగితాలేమో అనుకుని మడిచిపెట్టడాయన!కంగారుగా అందరం కలిసి వాటినివీలయినంత సాఔ చేసి బిక్కుబిక్కుమంటూ పరీక్షకి వెళ్ళాము. యెక్జామినర్ మూడ్ బాగోకపోతే మిగిలిన వాళ్ళందరినీ కూడాయేంచేస్తాడో అని భయపడే రోజులు అవి!ఇదే విచిత్రం కాదు. ముందింకా వుంది.

Monday, July 7, 2008

police

తెలుగు సినిమాల్లో పుంఖానుపుంఖంగా వస్తున్న టీనేజి ప్రేమకథలు మా దైనందిన జీవితంపై ఈ మధ్య కొంచెం ప్రభావం చూపించాయి. లేదు లేదు మా వాళ్ళెవరూ యేమీ చెయ్యలేదు.మా డ్రైవరు ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే [వాడికి అమ్మ లేదు] ఇంకో వూరికి పారిపోయి పెళ్ళి చేసుకుని అక్కడే పని చూసుకున్నాడు. అదే సమయంలో మా పనిమనిషి కొడుకు కూడా ఒకమ్మాయిని ప్రేమించి పార్కులూ సినిమాలూ తిరిగితేవాళ్ళింటివాళ్ళు వీళ్ళింటిమీద దండెత్తి పోలీసు కంప్లైంటివ్వాలా పెళ్ళి చేస్తారా అని కూర్చున్నారు[ట].వెరసి నాకూ మా ఆవిడకీ ఆపసోపాలు తప్పలేదు.నాకు పనివాళ్ళు ఫ్రెంచి లీవు తీసుకున్నప్పుడల్లా వాళ్ళమీద కోపం కన్నా వాళ్ళకేమయిందోఅన్న భావనే యెక్కువగా కలుగుతుంది. దీనికి ఒక బాక్ గ్రౌండు వుంది.[ పృష్ఠ ప్రదేశం అని రాద్దామనుకుని సిగ్గుపడి మానేశా].విజయనగరంలో మేం బి ఎస్ సీ చదువుతున్న రోజుల్లో ,అంతకి చాలా ముందునించీ కూడా, మాఇంటి ముందు గాంధీ కేఫ్ అనబడే హోటలు వుండేది[రెస్టరెంటు అనడం ఫేషను కాదు ఆ రోజుల్లో]. బాబీ గారని దాని యజమాని. అందులో నూకరాజనే ఒక పన్నెండు పదమూడేళ్ళకుర్రాడు పని చేస్తుండే వాడు.వాడు అమ్మ వారి పండగకి ఒకసారి పోలీసు వేషం వేశాడు. అప్పణ్ణించీ వాణ్ణి అందరూ పోలీసనే పిలిచేవాళ్ళు. అందరికీ తలలో నాలుక లాగ చిన్నా చితకా పనులు చేసిపెడుతుండే వాదు. మాకందరికీ వాడితో సరదాగా మాట్లాడ్డం చిన్న చిన్న పనులు చేయించుకోడం యెంతగా అలవాటయ్యిందంటే వాడు రాకపోతే రోజు గడిచేది కాదు.నిజానికి పనేమీ లేకపోయినా కూడా. ఒక రోజు వాణ్ణి షాపుకి వెళ్ళి యేదో తెమ్మని పదిరూపాయలిచ్చి [పెద్ద సొమ్మే ఆ రోజుల్లో] పంపించింది మా అమ్మ పొద్దున్న పది గంటలకి.ఒక పది నిమిషాల్లో రావలసిన వాడు మధ్యాహ్నం మూడు గంటలయినా రాలేదు. మా ఇంట్లో మేం పెద్దగా పట్టించుకోకపోయినా నలుగురూ నాలుగు మాటలనడం మొదలెట్టారు. అంత సొమ్మెవరయినా పనివాళ్ళకిస్తారా అంటూ.మూడున్నరకి విషయం తెలిసింది. కిరాణా షాపు కోమటాయనతో యెకసెక్కాలాడుతూ వీడన్న యేదో మాటకి కోమటాయనకి కోపం వచ్చి చేతికందిన వీశె గుండు [కిలోలు లేవప్పుడు] విసిరేశాడు. అది తగలరాని చోట తగిలి పోలీసు అక్కడికక్కడే మరణించాడు. అందుకే, పనివాళ్ళెవరైనా రాకపోతే నాకు వాళ్ళకేమయ్యిందోనన్న కలత బాధిస్తుంటుంది.

Saturday, June 14, 2008

marinni paatraluu vaati chappullu

ఆ రోజుల్లో మాకు వారానికి నాలుగు రోజులు ఉదయం తొమ్మిదిన్నరకి ప్రాక్టికల్సు ఉండేవి.ఫస్టియరుఒక బాచి సెకండియరు ఒక బాచి ఇద్దరికీ అప్పుడే ఉండేవి. మాతో చేసే సెకండియరుబాచిలో ముఖ్యుడు పిసుపాటి వెంకటేశ్వరరావు అనే పీవీరావు.ఈ నాటికీ ఆప్తమిత్రుడు. రిటయిరయ్యాక కలవడం కొంచెం తగ్గింది కాని కలిసినప్పుడు హృదయరంజకంగా కబుర్లు తప్పవు. రిటైరు కాకముందు రోజూ కొన్ని గంటలుకలిసినవ్వుకోకుండా ఉండే ప్రసక్తేలేదు.అతనితో పాటు ఎం వీ రావు, రామకృష్ణ విఠల్ మరొకరూ [పేరు గుర్తుకి రాటంలేదు-విచిత్రంగా] ఉండే వాళ్ళం. నా బాచిలో టి నాగేశ్వరరావు, హనుమంతశాస్త్రీ మల్లికార్జునాచారీ ఉండే వాళ్ళు. నాగేశ్వరావు సంగతి వదిలేస్తే[ అతనూ ఆప్తమితృడే] మిగిలిన వాళ్ళిద్దరూ విలక్షణ వ్యక్తులే. అందులో మల్లికార్జునాచారి ఎం ఎస్ సీ నేను డిపార్ట్మెంట్ హెడ్డుగా 87 లో చార్జి తీసుకున్నాక గాని పూర్తికాలేదు. అతనిది ఒక విచిత్రమైన కధ. ముందు మాథమాటిక్స్ ఎం ఎస్ సీ లో చేరాదు. అతనూ పిఠాపురం హాస్టల్లోనే వుండేవాడు. అక్కడే పరిచయమయ్యాడు. ఒక రోజు పొద్దున్న టిఫిన్ టయిములో నా పక్కకి వచ్చి కూర్చుని అప్లయిడ్ ఫిజిక్స్ లో ఎలెక్ట్రానిక్స్ చెపుతారుటకదా అన్నాడు. అవునన్నాను. నాకుతెలీనే తెలీదు . తెలిస్తే అందులోనే చేరే వాణ్ణి అన్నాడు. యెవరో అతనికోసం యెదురు చూస్తున్నట్టు. సరే మరి యెవరి కాళ్ళు పట్టుకున్నాడో యేంచెశాడో కాని ఒక వారం తరవాత కనపడి అప్లయిడ్ ఫిజిక్సుకి మారిపోయా అన్నాదు.మంచిదే అనుకున్నాను.అతనిది హోస్పేట . రెండో సంవత్సరంలో ఒక సారి క్లాసు పరీక్ష్లో అతనికి నూటికి పదిమార్కులొచ్చాయి. సీతారామస్వామిగారు నిండుక్లాసులో నిలబెట్టి యే వూరు నించి వచ్చావు అని అడిగేరు. చెప్పాడు. మైలుకి ఒక్క మార్కు వచ్చినా మూడు సబ్జెక్టుల్లో పాసయే వాడివి కదా అన్నారు. ఇలాటిదే కధ మా సీనియర్ భూప్ రాజ్ పాండే ది. అతను నేపాల్ నించి వచ్చేడు. తరువాత నేపాల్లో గూఢచారిశాఖలో ఉన్నత పదవిలో వున్నాడని తెలిసింది.అతని మాట వద్దులెండి .యెందుకన్నా మంచిది.చెప్పొచ్చిన సంగతేమంటే సరైన సమయంలో మల్లిఖార్జునాచారి పరీక్ష పాసవలేదని తెలుస్తూనే వుందికదా.ఫైనలియరయ్యాక కొన్నేళ్ళపాటు ప్రతి సంవత్సరమూ పరీక్షకి వచ్చాడు.ఆ రోజుల్లో పోయిన పేపరొక్కటీ రాసే సౌలభ్యం లేదు. ప్రాక్టికల్స్ తో సహా మొత్తం పరీక్షంతా రాయాల్సిందే. దానితో యేళ్ళు గడుస్తుంటే పని కష్టతరం అవడం మొదలుపెట్టి మూడు నాలుగేళ్ళ తరవాత ఇక కనపడ్డం మానేశాడు.విరక్తి చెందాడేమో అనుకున్నాము. తరవాత తెలిసిందేమంటే పాసైపోయానని చెప్పి యేదో కర్ణాటకలో మారుమూల కాలేజిలో లెక్చరరు ఉద్యోగం సంపాదించాడు. సర్టిఫికెట్ అడిగితే యెక్కడో ఉండిపోయాయి తరవాత చూపిస్తానని నెట్టుకొచ్చాడు. వాళ్ళడిగినప్పుడల్లా ఇతను తెస్తాను పదిహేను రోజుల సెలవివ్వండి అనడమూ దానికి ఇష్టపడక వాళ్ళు సరేలే తరవాత చూద్దాం అనడమూ జరిగేది.ప్రైవేటు కాలేజిలకి తక్కువ జీతంతో యెన్ని క్లాసులైనా తీసుకునే వాడు చాలుకదా! కొన్నాళ్ళకి ఇక సాగని పరిస్థితి వచ్చింది. ఆచారి దానికీ తయారుగానే వున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీ ఆఫీసులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందనిన్నీ అక్కడ రికార్డులన్నీ కాలిపోయాయనీ నమ్మబలికాడు. తరవాత యెండాకాలంలో ఇక యేదో చెయ్యాలని తెలుసుకుని విశాఖకి వచ్చాడు. దైవ సాక్షాత్కారం అయినట్టు నేను హెడ్డు గా కనిపించేను. కధంతా చెప్పి తనమీద పోలీసు కేసు పెట్టకుండా నేనే రక్షించాలని బతిమాలేడు.నేనేదో మతలబు పెట్టి ముఫ్ఫయ్యేళ్ళ తరవాత అతనికి మళ్ళీ పరీక్ష పెట్టించి పేపర్లు నేనే సెట్ చేయించి తెలిసిన వాళ్ళ తోనే దిద్దించి గట్టున పడేశాను. యెందుకంటే యేభయ్యేళ్ళొచ్చి యింక అతను యెవర్నీ మోసం చెసే స్థితిలో లేడనిపించింది.

Monday, June 9, 2008

paatra parichayam

తెన్నేటి సత్య గౌరీపతిశాస్త్రితో నా పరిచయం అలా మొదలైంది.అలాగే ఎన్ సీ విజయా . అతని గురించి ముందో మారు చెప్పాను.అతను ఫ్లూటు ముగ్ధమనోహరంగా వాయించే వాడు. అతని విలక్ష్ణతలో అదో భాగమే అయినప్పటికీ నన్ను అతని పక్క ముందుగా ఆకర్షించినది అదే. అతనిలా ఫ్లూటు వాయించాలని చాలా ప్రయత్నించి బొమ్మలు గియ్యడం నించి లాగానే మరోసారి అస్త్ర సన్యాసం చేశాను. తరవాతి రోజుల్లో అతనితో పరిచయం అంతలా పెరుగుతుందని నేనూ వూహించలేదు. వీళ్ళు కాకుండా విజయనగరంలో నాతోపాటు చదివి ఇక్కడ తేలిన వాళ్ళలో రామం మాట ముందే చెప్పాను. యు ఎన్ బీ రావుగా ప్రసిధ్ధికెక్కిన ఐ పీ ఎస్ ఆఫీసరు నాగభూషణరావు ముఖ్యుడు. అతను ఢిల్లీలో ముఖ్యపదవులు అలంకరించి రిటైరై మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.అతనూ నేనూ ఆప్తులం శ్రేయోభిలాషులం. నన్ను సివిల్ సర్వీసులో అనురక్తుణ్ణి చెయ్యలని అతనికి చాలా కోరిక వుండేది. ఇంకా చంద్రరాజు, సూర్యనారాయణా మరో కొందరూ వుండేవాళ్ళు. మా అప్లయిడ్ ఫిజిక్స్ క్లాసులో పదహారుమందిమి వుండేవాళ్ళం. అందరందాదాపుగా ఇంకా సంబంధాలు కొనసాగిస్తూనే వున్నాం. ప్రత్యక్షంగా వీలు పడనప్పుడు పరోక్షంగానైనా యోగక్షేమాలు తెలుసుకుంటూనే వుంటాం. నేను కాకుండా ఆరాథ్థి నరసిం హమూర్తి, జివివి సుబ్బారావు , షడాననరావు.చతుర్వేదుల హనుమంతశాస్త్రి, మల్లికార్జునాచారి, వ్యాకరణం వెంకటరావు, తాతినాగేశ్వరరావు, మంథా శ్రీనివాసరావు, ఎస్ వీ రమణమూర్తి, జె ఎస్ ప్రకాశరావు, సి ఉపేంద్రనాథ్, వి నరసిం హమూర్తి, ఎన్ వేణుగోపాలరావు కే మారుతిరామారావు,వి సీతారామారావు అనే పదహారుమందిమీ ఒకే కుటుంబంలాగ వుండే వాళ్ళం. ఒకళ్ళిద్దరు డే స్కాలర్లున్నా వాళ్ళూ హాస్టలుకి వచ్చాక అందరం కలిసి గుంపుగా క్లాసుకి వెళ్ళే వాళ్ళం.ఇది ఆ రోజుల్లో కూడా కొంచెం ప్రత్యేకంగానే వుండేది.

Tuesday, May 27, 2008

రాజావారి విడిదిలో దెయ్యం

ఒకటి రెండు రోజుల్లో నా రూమ్మేట్లిద్దరూ వచ్చి చేరారు. పిల్లలమర్రి త్రిమూర్తిది గుంటూరు.ఎం ఎస్ సీ కెమిస్ట్రీ చదవడానికి వచ్చేడు. వాళ్ళ నాన్న గారు పిల్లలమర్రి హనుమంతరావుగారు హిందూ కాలేజి లో తెలుగు ఉపన్యాసకులు. ప్రసిధ్ధులు. మా నాన్నగారికి యూనివర్సిటీలో సమకాలీనులు. పండిత పుత్రుణ్ణి కన్నవారు. త్రిమూర్తి మిగిలిన సంగతులేమైనా మంచి మిత్రుడు. ఇక వెంకటదాసు నెల్లూరు జిల్లా వెంకటగిరి నించి వచ్చేడు. మా ఇద్దరికన్నా వయస్సులో కొంచెం పెద్దవాడు.లైబ్రరీ సైన్సు డిప్లొమా [ఆ రోజుల్లో డిప్లొమా నే వుండేది] చదవడానికి వచ్చేడు. మాకు మిత్రులమవడానికి యెక్కువ సమయం పట్టలేదు. మహా అయితే అరగంట. ఆంధ్రా యూనివర్సిటీ జీవితం నాకు అనేక ప్రాంతాలనీ అక్కడి మనుషులనీ పరిచయమేకాదు-నా స్వంతమనేంతగా చేసింది. అప్పుడు ఈ రోజుల్లో లాగ అన్నికాలేజిలుగా విభజనలేకపోవడం వల్ల అనేక సబ్జెక్ట్లు చదివేవాళ్ళమందరం ఒకే చోట వుండి భావాలనీ జ్ఞానాన్నీ పంచుకోవడం మా మనస్సుల్ని విశాలం చెసింది. మేం ముగ్గురం మొదటిరోజు రాత్రి కబుర్లు చెప్పుకుని చెప్పుకుని నవ్వుకుని నవ్వుకుని నవ్వుకుని యే రాత్రికో నిద్రపోయాం. కొంత సేపటికి మధుర మనోహర స్వరంతో గానం .....యెవరో గంధర్వులు దిగివచ్చారా అనిపించుతూ నిద్రలేపింది. నిజమా కలా అనుకుంటూ నేనూ త్రిమూర్తీ లేచాం. బయటకి వెళ్ళి చూస్తే యెవరూ కనిపించలేదు. రాజావారి వేసవి విడిదిలో యెవరైనా దయ్యమై తిరుగు తున్నారేమో అనిపించింది. కొంచెం ముందుకి వెళ్ళి చూశాం. పక్క రూము లో లైటు వెలిగింది. అప్పుడు మొదటిసారి చూశాను గౌరీపతి శాస్త్రిని. ఆ రాగానికి ముక్తాయింపు మొదలు పెట్టాడు. దెయ్యాన్ని కాదు మనిషినేలే పొద్దున్న మాట్లాడుకుందాం వెళ్ళి పడుకోండి అన్నాడు. అలా ప్రారంభమైన ఆ స్నేహం చిరకాలం కొనసాగింది. అతని కబుర్లు చాలా వున్నాయి. కొద్ది కాలం కింద అతని అకాల మరణం దాకా ఆప్తులుగానే వున్నాం. మా అబ్బాయిలకి కూడామిత్రుడే అయ్యాడు. ఇంకా బొలెడంత వుంది

Thursday, May 22, 2008

విశాఖలో ప్రవేశం

1963 ఆగస్టులో నేను యూనివర్సిటీ కి వచ్చేను. అంతకుముందురోజేవచ్చి రూము తెలుసుకున్నాక ఆ రోజు సామానుతో వచ్చేను. వచ్చింది మా కారులోనే కనుక నాతో బాటు మా రామచంద్రమూర్తీ వాళ్ళనాన్నగారు రమణమూర్తి మాస్టారూ కూడా వచ్చేరు.ఇప్పుడు గుర్తించేను. ఇన్నాళ్ళ విజయనగరం జ్ఞాపకాలలో వీళ్ళిద్దరి ప్రసక్తీ రానేలేదని. యెంత పొరపాటు.తొందరలోనే దిద్దుకుంటాను. రామం పుట్టినరోజు నిన్నే అయింది.వాడు ఎం ఎస్ సీ కెమిస్ట్రీ లో చేరాడు. మా ఇద్ద్దరికీ వేరు వేరు రూములు వచ్చేయి. మేం పట్టించుకోలేదు. పిఠాపురం రాజావారి వేసవి విడిది మా హాస్టలు.ఇల్లు లాగే వుండేది. ఒక పక్కగా కాంపౌండు గోడకి చిన్న గేటు. దాంట్లోంచి వెళితే మూడు గదులు. మూడింటికీముందు అరుగులు. ఒక కొళాయి. బలే సరదాగా వుండేది.నేను వెళ్ళేటప్పటికి ఆ గదిలో శివశంకరం గారూ,గంటి సూర్యనారాయణమూర్తిగారూ వున్నారు. వారు అంతకు ముందు సంవత్సరం ఆ గదిలో వున్నారు.ఎం ఎస్ సీ ఫైనల్ కి వచ్చి మరో రూముకి వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. శివశంకరంగారు యెక్కడ వున్నారో తెలియదుకాని మూర్తిగారితో నా స్నేహం ఇంకా కొనసాగుతోంది.తరవాత నా రూం మేట్లుగా పిల్లలమర్రి త్రిమూర్తీ ఆనం వెంకటదాసూ వచ్చేరు.ఒక్కోళ్ళూ ఒక పోస్టుకి వస్తారు. మా రామం రూములో ఒకాయన వుండే వారు.ఆయన పేరేమిటో గుర్తులేదుకాని ఆయన తమ్ముడు ఎన్ సీ విజయా కూడా వుండేవాడు. అతనితో పరిచయం గాఢ స్నేహంగా మారి అతను ఐ ఐ టీ కాన్ పూరుకి వెళ్ళేదాకా గడిచింది.దూరం వున్నా స్నేహం స్నేహమే. అతని గురించి ఒక పుస్తకమే రాయచ్చు.ఇంకొన్ని పరిచయాల తరవాత జ్ఞాపకాల వరస మొదలు పెడతాను

Monday, May 12, 2008

hrudayatakku

విజయనగరం నించి విశాఖకి దూకిన మీదట కొంత మంది మిత్రులు ఆ కాలంలో జరిగిన కొన్ని విషయాలగురించి రాయలేదేమని కొంచెం నిలదీసినట్టుగానే మైల్ చెశారు. వారందరికీ నా సమాధానం ఒక్కటే.వ్యక్తుల కి సంబంధించి వారి వ్యక్తిత్వానికి భంగం కలిగించే సంగతులేమీ రాయక పోవడం ఉద్దేశపూర్వకమే. వ్యక్తిగతాలు ఇక్కడ కాదని మనవి.ఇది నా ఆత్మకధ కాదు. కాలక్షేపం మాత్రమే.హృదయ టక్కు అనేది మా నాగమునేశ్వర రావు గారికోసం మేము ఫస్ట్ యియర్ చదువుతున్నప్పుడు 1963 లో సీతారామారావు కాయిన్ చెసినది. మేము కాయిన్ చేసినదని యెందుకన్నానంటే ఇర్రివరెన్స్ అన్నది దాదాపుగా యూనివర్సిటీలో మా బాచిల తోనే మొదలైంది. అంతకుముందు గురువులంటే భక్తిశ్రధ్ధలు బాగానే వుండేవి. దీనికి చాలా ఉదాహరణలు ముందు ముందు రాస్తాను. ప్రస్తుతానికి మా నాగమునేశ్వరరావు గారు రష్యా వెళ్ళేముందు పాంటు నడుము గుండె దగ్గర కాకుండా నడుముకి ఇంకొంచెం దగ్గరగా వుండేటట్లు కుట్టించడానికి మాలో కొందరు టైలరు దగ్గరకి వెళ్ళి కాపలా కాయాల్సి వచ్చింది. టాన్ తీటా హృదయటక్కు వంటివి మాతోనే ఆగకుండా ఇంకా ప్రాచుర్యంలో వున్నందుకు కొంచెం ఆశ్చర్యం గానే వుంది.

Sunday, May 11, 2008

my visakhapatnam

అరవైమూడు ఆగస్టులో నేను విశాఖపట్నం వచ్చాను.అంటే అంతకుముందు రాలేదనికాదు. విశాఖతో నా చిన్నప్పటినించీ అనుబంధం ఉన్నదే. మా చిన్నాన్నగారు యూనివర్సిటీ లైబ్రరీలో ఉద్యోగం చేసేవారు. ఆయనతో కలిసి యేడెనిమిదేళ్ళవయసులో లైబ్రరీకి వెళ్ళిన మొదటిసారే అక్కడ పెద్దపెద్ద పుస్తకాలు చదువుతున్న స్కాలర్లని చూసి యెప్పటికైనా నేనూ ఇక్కడ చదివి పరిశోధనలు[ అంటే యేమిటో తెలీకపోయినా యేదో చెయ్యాలని భావన] చెయ్యాలనే కోరికపాతుకుపోయింది.అది చెయ్యగలిగినందుకూ తరువాతకూడా కొనసాగించగలిగినందుకూ నాకు చాలా సంతృప్తేకలిగింది.అప్పట్లో లైబ్రరీ ప్రస్తుతం యూనివర్సిటీ ప్రెస్ ఉన్నచోట ఉండేది.ప్రస్తుత విషయానికొస్తే 63 లో వచ్చినతరువాత ఇదే నా వూరయింది.పధ్ధెనిమిదేళ్ళ వయసునించి అరవైరెండేళ్ళదాకా నేనెంత యెదిగానో యెంత మారానో విశాఖ కూడా అంత యెదిగింది. అయినా నేను అశోక్ నే అయినట్టుగానే విశాఖ కూడా వ్యక్తిత్వం పెంచుకుంది గాని మారలేదనే నాకనిపిస్తుంది.యే మనిషి జీవితంలోనైనా వివిధ స్థాయిలుంటాయి. 63 కి ముందు విజయనగరంలో నేనెన్ని చేసినా యేం చేసినా మా అమ్మానాన్నల కొడుకుగానే. నాకంటూ ప్రత్యేకత అప్పటికి లేదు. విశాఖ వచ్చిన మొదటి సంవత్సరమూ కొంత అలానే గడిచింది. మా తల్లిదండ్రుల సహాధ్యాయులెందరో ప్రొఫెసర్లగానూ ఇతరత్రానూ ఇక్కడ వుండడం ఒహో నువ్వటొయ్ అంటూ పలకరించడం జరిగేవి. నెమ్మదిగా నాకంటూ ఒక వ్యక్తిత్వం నేనేంచేస్తున్నానో దానికి నేనే జవాబుదారీ అన్న బాధ్యత పెరిగేయి. 66లో నేను రిసెర్చ్ కి చేరే సమయానిక్ నాకు ఒక గుర్తింపూ స్థాయీ తెచ్చుకోగలిగాను . అప్పటినించీ మూడో దశ.

Wednesday, May 7, 2008

dabbuludabbulu

విజయనగరం జ్ఞాపకాల్లో క్రికెట్ సంబంధితాలు కొన్ని. సర్ విజ్జీ అనబడే విజయానంద గజపతిగారు క్రికెట్ లోకానికి చిరపరిచితులు. ఆయన పి వి జి రాజు గారికికి పినతండ్రి. వారణాసిలో వుండేవారు [వున్నప్పుడు]. ఆయన్ని కాశీ రాజు గారని పిలవడమూ కద్దు. విశాఖ పార్లమెంటు మెంబరు గా వున్నారు.[విజయనగరం చాలారోజులు విశాఖ స్థానంలో భాగమే.] ఆయనకి రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా రాజు గారు కదామరి. ఆయన పూర్వీకుల వూరికి వచ్చి కోటలో బస చేసినప్పుడు క్రికెట్ ఆడే కాలేజ్ కుర్రాళ్ళందరినీ పిలిచి ఒక ఆట ఆడించి చూసి వెళ్ళే వారు[కాలేజ్ కైనా రాందే క్రికెట్ గురించి తెలిసినవాళ్ళు ఆ రోజుల్లో వుండేవారు కాదు] రాజభోజనాలు తినడం కోసం అందరూ చేరే వాళ్ళం. అలాంటి ఒక రోజు వాన పడింది. ఆట లేదుగా మరి. రాజావారు కారెక్కి కోటకి వెళిపోయేరు. భొజనాలు మాత్రం రెడీ. ఆయనంటే కారులో వూరేగారు కాని మేం తడుసుకుని యేం వెళ్తాం . అక్కడే పెవిలియన్ అనబడే అయోధ్య మైదానపు ముందు భాగంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. మాటో పాటు ఒక పెద్ద రాజు గారు కూడా ఉన్నారు.ఆయన పేరు చెప్పను. మాకన్నా పెద్ద వారు, తరువాతి కాలంలో విద్యారంగంలో అనేక ప్రముఖ పదవులని అలంకరించేరు. ఆయన కాళ్ళు సాగదీసుకుంటా అని లేచి కొంచెం పచార్లు సాగించేరు.వాన కదా ఆక్సిడెంట్లు సహజం. జారిపడ్డారు. తొందరగానే లేచి సర్దుకున్నారు. కాని కొందరికుండే కోతిబుధ్ధి నిరంతరం వుంటూనే వుంటుంది కదా. మాధవరావు అప్రయత్నం గానే రాజుగారూ డబ్బులు డబ్బులు అని అరిచినట్టు అన్నాడు. అంత పెద్దమనిషీ మళ్ళీ మోకాళ్ళమీద కూచుని పాకుతూ యేవీ యెక్కడ అని వెతుకుతుంటే మా మొహాలు మీరు ఊహించుకోగలరుకదా. దరిమిలా అనేక మీటింగుల్లో ఆయనతో పాటు కూర్చున్నప్పుడల్లా ఈ ఘట్టం గుర్తుకిరావడమూ నవ్వాపుకోడానికి విశ్వప్రయత్నమూ చెయ్యాల్సి రావడమూ వేరే సంగతి.

Monday, May 5, 2008

apputachchu

మిత్రులందరూ ముఖ్యంగా రాజెంద్రప్రసాద్ గారు నన్ను క్షమించాలి. 1962 కి 1982 అని టైపుచేశాను.ఇదే శాస్త్రీ మేమూ అందరమూ విశాఖ ఎబ్డెన్ క్రికెట్ టోర్నమెంటు కి ఆ రోజుల్లోనే వెళ్ళాము. శాస్త్రి నీటుగా టక్ చేసి బెల్టు బిగిస్తుంటే మాధవరావు వొరేయ్ అది నడుము రా హోల్డాలు కాదు మరీ అంత బిగించి కట్టకు అని అరిచేడు.

dharmayudhdham

ఒక నెల దాటాక మళ్ళీ మిత్రుల్ని కలుస్తున్నాను. ఈ నెలలో మా పెద్దబ్బాయి ఈ వూరినించి రిలొకేట్ అవడం ఒక కారణమయితే కోడలూ మనవడి బాధ్యత కూడా కొంత కారణం. విజయనగరం గురించి ఇంక ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకుని రాయడంకన్నా విశాఖకి దూకడమే బాగుంటుందని భావన. ఈ లోగా మా శాస్త్రి గురించి ఒక మాట. శాస్త్రి మా కన్నా ఒక సంవత్సరం సీనియర్. బి యే చదివే వాడు. మా వూరిలో పెద్ద లాయరు గారి అబ్బాయి. మాకిద్దరికీ క్రికెట్ గ్రౌండు మీదా వరహాలు ద్వారానూ పరిచయం. మేం బి ఎస్ సీ చదివే రోజులంటే 1982 చైనా యుధ్ధం రోజులు. రోజూ రేడియో లో యుధ్ధం వార్తలు వచ్చేవి.శాస్త్రీ వాళ్ళింట్లో ఒక రోజు వార్తలు అందరూ శ్రధ్ధగా వింటుంటే వాడికి అనుమానం వచ్చింది.నిన్న రాత్రి అని వార్తల్లో యేదో చెప్పారు. వాళ్ళ నాన్న గారినే అడిగాడు.నాన్నా రాత్రి పూట కూడా యుధ్దం చేస్తారా అని. ఆయన కూడా అంతే సీరియస్ గా లేదురా నాన్నా ధర్మయుధ్ధం. ఆరింటికల్లా శంఖం వూదేస్తారు అని చెప్పారు. అవాక్కవడం శాస్త్రివంతూ నవ్వుల్ని ఆపుకోడం మా వంతూ

Sunday, March 30, 2008

hindiitelugu

హిందీకి అంతగా ప్రాచుర్యం లేని వూళ్ళలో హిందీ సినిమా చూడడం ఒక తమాషా అనుభవం.ఒక సారి విజయనగరంలో ముఘల్ యె ఆజం సినిమా చూస్తున్నాము. మొదటిసారి రిలీజయినప్పటి సంగతి. పృధ్వీరాజ్ కపూర్ గంభీర కంఠంతో తహ్ లియా అని గర్జించాడు. మా ముందు కూర్చున్న ఇద్దరిలో ఒకడు యేటన్నాడురా అని అడిగేడు. యేట్నేదురా అని విదిలించుకున్నాడు రెండోవాడు. సందేహం తీరకపోతే మనసూరుకోదు కదా ! మళ్ళీ అడిగేడు. యేటన్నాడురా అని. ఈ సారి కొంచెం అసహనంగా. మరేట్నేదురా , ఆళ్ళందర్నీ దెం......మన్నాడు!!! ఇలాగే మరోసారి వో కౌన్ థీ చూస్తున్నాము. సినిమా అయిపోయే దగ్గరిలో మా ముందువాడు అతిసంతోషంగా అదీ అని అరిచేడు. పక్కవాడితో చెప్పాడు. తెలిసిపోనాదిరా . ఈ బొమ్మలో సాధనా డబల్ ఫొటో యేసినాది.

Sunday, March 23, 2008

narayanamurty

సారధి ఒక స్పెసిమెన్ అయితే నారాయణమూర్తి మరోటి. వాడి నాన్నా విజయనగరంలో పేరున్నాయనే. పెద్ద డాక్టరుగారు. సహజంగానే మాకు బాగా తెలిసిన కుటుంబం.మేధకుడు అన్న మాటకి ప్రాణం పోస్తే నారాయణమూర్తి అవుతాడని అందరూ అనే వాళ్ళు. నాకు మాత్రం అది నచ్చలేదు. అదే నిజమయితే పరీక్షలెలా పాసవుతాడు?కాలేజ్ దాకా యెలా వస్తాడు?కాలేజ్ కి వచ్చినాగాని వాడి ఇష్టాలు మారలేదు. బాధ్యతలూ అబ్బలేదు[ నాకో పెద్ద బాధ్యత యేడిచినట్టు ఆ వయసులో అందరమూ అంతే కదా!] కాని నారాయణమూర్తి కొంచెం స్పెషలే. యెందుకంటే సారధి లాగానే వాడూ ఒక పరీక్ష రోజున ఎనిమిదిన్నరకల్లా వెళిపోదామనుకున్నాడు.వెళ్ళనివ్వకపోతే యేం చేస్తాడు మరి. పాపం సీటు లోనే కూర్చున్నాడు. అరగంట కూర్చోవాలి కదా. తోచద్దూ... కొంచెంసేపు బెంచి మీద టైపింగు చేసాడు. టట్టటట్ట అంటూ. మేమందరమూ కూడా శృతి కలుపుతామేమో అనే అనుమానం వచ్చేక వాణ్ణి ఆపారు.ఇంకేం చెయ్యాలి? కొశ్చన్ పేపరు దొరికింది. రెండు ముక్కలు చేశాదు. ఒక్కొక్కదాన్నీ మడిచి ఆరోలు చేశాడు. ఒకటి నామీదకి విసిరాడు. నేను పక్కన పెట్టాను. ష్ ష్ అని పిలిచాడు. మళ్ళీ ఇమ్మని సైగలు చేశాడు. సరే అని నేను వాడి మీదకి విసిరాను. నేను విసిరింది ఇంకోడి మీదకి వెళ్ళి పడింది. యేమంటారు. ఇద్దరూ పెద్ద డాక్టర్ల పిల్లలు. ఒకడికి కాపీ తో పని లేదని అందరికీ తెలుసు. ఇంకోడికి పరీక్ష యేమయినా పరవాలేదు. పనిష్మెంటిచ్చే కేసు కాదు. ఇక భరించలేక వాణ్ణి పంపేశారు. మేం ప్రశాంతంగా పరీక్ష రాసుకుని పదకొండింటికి రౌండ్ మహల్ మెట్లు దిగి కిందకి వచ్చేసరికి మా కంట పడ్డదేమిటి. అత్యంత యేకాగ్రతతో ఇద్దరు మూడో క్లాసు కుర్రాళ్ళతో నారాయణమూర్తి గోలీలాడుతున్నాడు. నాకెంత ఆనందం కలిగిందో చెప్పలేను. నా గుండెల్లోతున దాగివున్న కోరిక వాడైనా తీర్చుకున్నందుకు. యెవరు మేధకులు. మనసులో యే కోరిక వున్నా అణగతొక్కి మరీచిక[కాదేమో లెండి] వెంట పడే వాళ్ళా? నారాయణమూర్తా?

Thursday, March 20, 2008

saradhi

సారధి విజయనగరంలో ఒక ప్రముఖ లాయరు గారి అబ్బాయి. మేము బి ఎస్ సీ కి వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలముందునించే అతను బి యే చదువుతున్నాడు. ఈ మధ్య అదేదో సినిమాలో సీనియర్ పేషెంటు జూనియర్ డాక్టరు లాగన్నమాట. నిలువెత్తు మనిషి ఉంగరాల జుత్తు పెద్ద మీసాలు యెర్రటి కళ్ళు నోట్లో యెప్పుడూ కారాకిళ్ళీ కానీ అతన్ని చూస్తే ఆప్యాయతే కానీ భయమూ జుగుప్సా లాంటివి యెవరికీ కలిగేవి కావు. అతను కాలేజికి ఫీజెందుకు కడుతున్నాడో అప్పుడప్పుడు కాలేజికి యెందుకు వస్తున్నాడో కూడా అర్ధం కాని[లేని?] సంగతి. ఒకసారి దసరాల సమయంలో [విజయనగరం పక్క దసరాకి బొమ్మలకొలువు పెడతారు} రౌండ్ మహల్ ముందు గాలరీలో వరసగా గ్రూపు ఫొటొలాగ బెంచీలు వేసి విద్యార్ధులందరూ కొలువు తీరి మధ్యలో సారధిని కూర్చొబెట్టి అమ్మాయిలు కాలేజికి వస్తుంటే చూడాలి చూడాలి అని కేకలు వేశారు. వాళ్ళు నవ్వుకుంటూనే వెళిపోయారు. సారధికి అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా వుండేవారు. అనధికారికంగా ఇంకో భార్య[లు] ఉన్నట్టు అనుకునేవారు. అల్లాంటి సారధికి ఫైనల్ బి య్యే పరిక్షలవుతుండగా ఒక పరీక్షరోజు పొద్దున్నే తొమ్మిదింటికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది.టంచనుగా ఎనిమిదిన్నరకల్లా లేచి పేపరు పట్టుకుని ఇన్విజిలేటరు దగ్గరకి వెళ్ళి పేపరు ఇచ్చేసి వెళ్ళిపోబోయాడు. ఆ సంవత్సరమే పరీక్ష ప్రారంభమయిన గంటన్నరదాకా ఎవరూ బయటకి వెళ్ళకూడదనే రూలొచ్చింది. ఇన్విజిలేటరు హిస్టరీ మాస్టారు రంగారావు గారు.పూర్తిగా అయిదడుగులు కూడా వుంటాడో లేదో అనిపించే మనిషి. పేపరు తీసుకోనన్నారు. తీసుకోండీ అని ముద్దులు కురిశాడు సారధి. కుదరదంటే కుదరదని కరాఖండీగా తేల్చి చెప్పారు మాస్టారు.తీసుకోరా అని మళ్ళీ అడిగాడు. తీసుకోను అని మల్లీ చెప్పారు. తీసుకోరా అని మళ్ళీ అడిగాడు. తీసుకోను అన్నారు. అయితే మానీండి అని పేపరు మడిచి చంకలో పెట్టుకుని వెళ్ళిపోయాడు సారధి. లెక్కకో ఆన్సర్ షీటు తక్కువ రావడం దాని తరవాత వసంతరావు వెంకటరావు గారి చిందులు ఉగ్ర రూపం అన్నీ గుర్తు తెచ్చుకుని గజగజలాడిన [రోజులలాంటివి మరి ] రంగారావు గారు వెనక పరిగెత్తి వెళ్ళి పేపరు ఇమ్మని సారధిని ప్రాధేయ పడ్డారు. ఇందాకే తీసుకో వచ్చుగా అని విసుక్కుంటూ పేపరిచ్చి వెళ్ళిపోయాడు.

Wednesday, March 19, 2008

kaamaakshi

విజయనగరం ముగిద్దామనుకుంటే అలలు అలలుగా ఇంకా ఉన్నాం మా సంగతేమిటంటున్నాయి. మరి విశాఖ వెనక పడుతోందంటే నీ తోనే ఉందిగా అని ఇకిలిస్తున్నాయి. మధ్యలో కంచి యాత్రొకటి. చెన్నై నించి కంచికి వెళ్ళడం ఒక పెద్ద ప్రణాళిక అయిపోయింది. అంత చిక్కులతో ఉందని నేననుకోలేదు. అంత మరీ ప్రాచుర్యం లేదా అంటే మరి హోటళ్ళన్నీ నిండుగానే ఉన్నాయి.రైలేదీ లేదు లోకల్ తప్ప. బస్సెక్కాలంటే మరో వూరెళిపోవాలన్నారు. సరే అని టాక్సీ లో వెళ్ళాము. ఆటో యెక్కి కామాక్షి సన్నిధికెళ్ళాము.అంతా మరిచిపోయాను. ఆమె వదనం చూసి.ఆమె యెవరు? తల్లా , సోదరా , మిత్రురాలా, ప్రేమికా. యేమి ఆ ఆత్మీయత!యేమి ప్రశాంతత. జీవితం ధన్యమయిందనిపించింది. యీ విషయాలు మరో చోట. విజయనగరం గురించి రాస్తూ పంచాయతనేశ్వర్ సంగతే యెత్త లేదని గుర్తొచ్చింది. ఎన్ సి సి అండర్ ఆఫీసర్ గా అతను రూట్ మార్చ్ లీడ్ చేసుకుంటూ వెళుతుంటే అందరం ముగ్ధులమై చూసే వాళ్ళం . అప్పట్లో ఎన్ సీ సీ యూనిట్లతో పాటు మిలిటరీ ఆఫీసర్లు ఉండేవారు. ట్రైనింగ్ ఇవ్వడానికి. వాళ్ళ స్నేహం ప్రభావమో,సొంత తెలివో గాని పంచాయతనేశ్వర్ కూడా గెడ్డం పెంచి సర్దార్జీ లాగానే వుండేవాడు. బి కాం చదివే వాడు.యెర్రని మనిషి నిలువెత్తు విగ్రహం . ఇప్పుడేం చేస్తున్నాడో తెలీదు మరి . యెవరికైనా తెలుసా? ఇంకా సారధి గురించి రేపు రాస్తాను.

Sunday, February 17, 2008

vijayanagaram marosaari

విజయనగరం పేర్లు చదివేసరికి చాలామంది మిత్రులు మెయిల్ చేశారు. శాయినాధరావు చాలామంచి మిత్రుడు. అవడానికి నాకొక యేడాది సీనియరే అయినా నాతో కలిసి బి ఎస్ సీ మూడో సంవత్సరం పరీక్ష రాశాడు. మేమిద్దరమూ కంబైండ్ స్టడీ చెసే వాళ్ళం.అతని బాబాయి తెన్నేటి వరహాలు ఇంకా ఆప్తమిత్రుడు. అతని మరణం వల్ల నేను చాలా షాకై ఒక కధ కూడా రాసేను. వీళ్ళిద్దరూ పారనంది రామ్మూర్తీ నేనూ మేమంతా రోజుల తరబడి అడ్డాట ఆడుతుండే వాళ్ళం. అనుక్షణం జోకులతో ఆనందం వెల్లివిరుస్తుండేది.వివిబి రామారావు గారిగురించి మీరన్నది కొంచెం నిజమే అయి వుంటుంది. ఆయన కొత్తగా ట్యూటరుగా చేరడమే నాకు తెలుసు. తరువాత తరువాత ఈ మధ్యలో నాకు పరిచయమైన ఒక డాక్టరు గారు ఆయన తోడల్లుడవడం చేతా, కొన్ని సంవత్సరాలక్రితం వారమ్మాయిని మా పెద్దవాడికిద్దామనుకోడం చాతా ఆయన జ్ఞాపకాలు ఇంకా మిగిలి వున్నాయి. ఆయన కొన్ని నవలలు కూడా రాసి బహుమతులు గెల్చుకున్నారు. నారాయణస్వామి తెలుగు మాస్టారే. ఆయనకి సారాకొట్టుండడం నాకు న్యూసే.అన్ని విద్యలున్నాయనుకోలేదు. ఆయనా మేం చదువుతున్నప్పుడు కొత్తగా చేరాడు.ముద్దుకృష్ణ నా క్లాస్ మేటు. చాలా నాటకాలు కలిసి వేశాం.అతన్ని డ్రమటిక్ అసోసియేషన్ సెక్రటరీ గానిలబెట్టి గెలిపించినప్పుడు కరపత్రాల మీద శ్రీశ్రీ గేయాలు ముద్రించి ఒక కొత్త వరవడిని సృష్టించాను. రేపు బయలుదేరి నా భార్యతో కంచి యాత్రకి వెళుతున్నాను.దైవభక్తి నాకు నామమాత్రమే అయినా సంస్కృతిమీద అపారమైన గౌరవం వుంది. మధురమీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి అంటే యెందుకో తెలియని ఆప్యాయత. మళ్ళీ కలుస్తాను.

Saturday, February 2, 2008

vijayanagaram

విజయనగరం జ్ఞాపకాలు ముగిద్దామనుకుంటే ముగిసేవికాదు. ఆ వూరి సుగంధమే అంత.ముద్దుక్రిష్ణ, పెద్దిరాజు, జగ్గప్ప, మల్లపరాజుగారు, ఇనపదేముడనబడే నారాయణస్వామి గారు, రామశరమ, ఎం ఎస్ ఆర్ కేఅ, రామా, చంద్రశేఖరశర్మగారి దుర్యోధన యేకపాత్రాభినయం, వీ వీ బీ రామారావుగారు, భాస్కరరామమూర్తిగారు,స్యాంసుందర్ గారు, ఢిల్లీ నీలాచలరావు గారు, ఏ యూ ఎస్ యూనియన్ భవనంలో మేం చేసిన అల్లర్లు, మచ్చ గాడనబడే వెంకటరావు,టీ Yఏఆ నాయుడనబడేఅ అప్పలనాయుడు, సాయినాధరావు, అహ్మద్ ,వరహాలు, చైనా డాక్టరు కొడుకు, శాస్త్రి, రామదాసు, పార్ధసారధి, సత్యమూర్తి, బులుసు వారి పుస్తకాలషాపు, డీఫీ శాస్త్రి గారి పుస్తకాల షాపు, దేవీ విలాస్, నియొ మలబార్ హోటల్ లొ స్పిన్నర్ చంద్రశేఖర్ తో కలిసి మసాలాదోశ తినడం, యెన్ని స్మృతులు. వీళ్ళలో యెవరన్నా మీకూ తెలిస్తే రాస్తారా

Thursday, January 24, 2008

tan theta one more time

ఆర్ ఎస్ జీ గారికి. మీ సందేహానికి సమాధానం పోస్టు ద్వారా ఇస్తున్నందుకు మీరేమీ అనుకోరనే భావిస్తున్నాను. అరటిపండు ఒలిచినట్టే చెప్పానని అనుకున్నాను.కదళీఫలం అనుకున్నది నారికేళం కూడా అవవచ్చని వూహించలేదు.పప్పు నాగరాజు గారు వెంటనే పట్టుకున్నారు. వారూ విజయనగరం వారు కావడం వల్లనేనా.[ జై విజయనగరం] తీటా గ్రీకు అక్షరంతెలుసుకదా సాగదీసిన కోడిగుడ్డు నిలుచున్నట్టుంటుంది అంతకన్నా మరేం లేదు. పైగా టాంజెంటు కూడాకలిస్తే గీత అని కూడానేమో. నిజానికి ఇది నా టిప్పణి మాత్రమే. ముద్దుపేర్లకి లాజిక్కేమీ ఉండక్కరలేదు--అందరి నోళ్ళలోనూ నాని రుచిగా తయారవడం తప్ప. విజయనగరం జ్ఞాపకాలు బాగా సాగుతున్నాయని ముగిద్దామనుకున్నాను.విశాఖ పూర్తిచెసేటప్పటికి చెయ్యలేనంత వృధ్ధాప్యం వస్తుందేమోనని.అయితే మిత్రులు చాలామంది వద్దువద్దని ప్రోద్బలిస్తున్నారు. మరి కాదనలేక కొనసాగిస్తున్నాను. సిటీ క్లబ్ టెన్నిస్ పోటీల గురించి ఇంతకు ముందొకసారి ప్రస్తావించాను. అక్కడ టెన్నిస్ చూడ్డానికి టిక్కెట్టు కొనడం కుర్రాళ్ళకీ కొనిపించడం క్లబ్ వాళ్ళకీ సమస్యగానే వుండేది. యెందుకంటే ఆట చూడకుండా యెంట్రీ గేటు దగ్గర ఉండే టెన్నిస్ ఫాన్లు యెవరుంటారు? సిటీక్లబ్ పేకాట క్లబ్ కూడా కావడం పనికొచ్చింది. కరడు గట్టిన వృధ్ధ పేకాట రాయుళ్ళనిద్దరిని యెంచారు. వాళ్ళిద్దరికీ ఒక టేబుల్ గుమ్మని కడ్డంగా వేసి హాండ్ తు హాండ్ మీక్కావలసినంత సేపు ఆడుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరి మీద గిరిపడ్డా వరింక అక్కడినించి కదిలే వారు కాదు. లోపల నస్టసే లాల్ మాచ్ అవుతోంది చుడరా అని బుట్టలో పడేద్దామంటే వాళ్ళెవరు? నా కౌంట్ ఆడు కడతాడా అని కసిరే వారు. అయ్యా అదీ సంగతి.

Sunday, January 6, 2008

kraantikumar

మర్నాడు ఒక కర్రపుల్ల క్రాంతిని తీసుకుని మా ఇంటికి వచ్చాడు.వాడిని బయటే నిలబెట్టి క్రాంతి ఇంటిలోకి వచ్చాడు.అసలు సంగతేమని అడిగాను.వాళ్ళ పల్లెటూరిలో ఒక వీధిబడి మాస్టారి కూతురు . ఆమెని చూడగానే యేదోలా అయిపోయేడట.కొన్ని జన్మలనించీ కలిసివున్న అనుబంధమని అనిపించిందట. ఆ అమ్మాయికికూడా అలానే అనిపించిందా, యెప్పుడయినా చెప్పిందా అని అడిగేను. చెప్పుతో కొడతానందట. ఇంకా గోల చేస్తే వాళ్ళ వాళ్ళతో చెప్పి చావగొట్టిస్తానందట.అయితే మరెందుకీ గోల అనడిగేను. మనసనేదొకటుందికదా అన్నాడు.బియ్యే సంగతేమయింది.మళ్ళీపరీక్ష రాశావా అని అడిగాను.వాడి ముఖమే చెప్పింది. చూడు క్రాంతీ మనం వేసిన నాటకాలు వేరు. జీవితం వేరు.మనతోనే తిరిగిన తేజేశ్వరరావు ని చూడు. అతను పేదప్రజల పక్షాన నిలబడి యెంతో పోరాటం చేశాడు. వాళ్ళకి దేవుడై నిలిచాడు. ప్రాణాలకి లెక్క చెయ్యలేదు. ప్రాణం ఇస్తే ఆశయాలకోసం ఇవ్వాలికాని ఇలా వూహల కోసం కాదు అని చెప్పాను. నన్ను చూడు. నేనూ జీవితంలో యేదో కొంత సాధించాను.అనీ చెప్పాను.[ఇలా ఇంటర్నెట్ లో వున్నప్పుడల్లా వీటన్నిటికీ మూలస్తంభమైన ఐ సీ ఆవిర్భావంలో నాకూ సూదిమొనంత భాగస్వామ్యం వుందనిపించినప్పుడు అప్పుడప్పుడు ఛాతీ ఉప్పొంగుతుంది]ప్రేమ చాలా చిన్న విషయం అని నేనంటే నా పక్క నమ్మలేనట్టుగా చూశాడు.అంతేనంటావా అన్నాడు. యేమనడానికీ నేను సర్వాంతర్యామినికాదు. నా ఉద్దేశం చెప్పాను. ఒక మిత్రుడిగా సలహా ఇచ్చాను అని చెప్పాను. తరవాత అందరం కలిసి లంచ్ చేశాం.చాలా రిలాక్స్డ్ గా మారాడు.మధ్యాహ్నం టీ కూడా అయ్యాక వెళ్ళొస్తాను, థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పటి దాకా కనపడలేదు. బాగుపడ్డాడో లేక నన్ను కూడా కౄరకఠోర లోకంలో ఒక భాగంలా భావించి కాలంలో కలిసిపోయాడో పెరిమాళ్ళకెరుక