Search This Blog

Friday, January 23, 2009

సహదేవోపాఖ్యానం

నిన్న యెందుకనో సహదేవుడు గుర్తుకొచ్చి మళ్ళీ రాయడానికి పురికొల్పాడు. సహదేవుడు నేను చేరినప్పుడ యూనివర్సిటీలో చేరాడు-జియోఫిజిక్సులో చేరాడు. గ్రామీణ ప్రాంతం నించి వచ్చినవాడవడంచేత కొంచెం అమాయకంగా వుండేవాడు మొదట్లో- తరవాత షరామామూలే కదా.1963 ఆగస్టు నాటి సంగతి.అప్పటి విశాఖకీ నేటి విశాఖకీ రాజసులోచనకీ ముమైత్ ఖాన్ కీ ఉన్నంత తేడా.యూనివర్సిటీకీ టౌన్ కీ మధ్య అగాధమే అనవచ్చు. మరో వూరెళ్ళినట్టే వుండేది.రాత్రి తొమ్మిదయ్యాక తిరిగి రావడమంటే నడకే. ఆటోలు లేవు. రిక్షావాడు లాగలేడు.[రిక్షా వాడితో సి ఆర్ చంద్రన్ కధ కూడా వుంది. సమయానుసారం అదీ వస్తుంది] మొదటాట సినిమాకి వెళితే తిండీ దొరకదు. అందుకని అయితే మేట్నీ కీ లేకపోతే యెలాగా నడవాలి కాబట్టి సెకండ్ షోకీ వెళ్ళేవాళ్ళం.మరి సెకండ్ షో అంటే నిర్మానుష్యంగా వున్న దార్లో కొంచెం ధైర్యం కాని బోలెడు మొండితనం కాని వుండాలి.అలాంటి రోజుల్లో బందిపోటు సినిమా రిలీజయింది. సరస్వతీ టాకీసులో. అన్న గారి సినిమా పైగా అప్పట్లో విశేషాకర్షణగా బోలెడు నేలబారు నృత్యాలున్న సినిమా.మేం హెడ్ వాకింగ్ చేసి మొదటి రోజునే చూసివచ్చి తెగ కబుర్లు చెప్పుకున్నాం. వినివినీ సహదేవుడికి నోరూరింది.చూడాలి చూడాలి. వాడప్పటికా వూరొచ్చి వారమే అయింది. విశాఖలో దారులు అంతబాగా తెలిసిన వాడు కాదు. సినిమాకి తనే టిక్కెట్టుకొని తీసుకెళతానని ఎవర్నైనా కలిసి రమ్మనీ చాలా అడిగాడు. యే బుధ్ధితో ఉన్నారో ఎవరూ పలకలేదు. మర్నాడు శనివారం. మధ్యాహ్నం పన్నెండింటికల్లా బయలు దేరి తనే వెళ్ళాడు. టిక్కెట్టు దొరక్కపోతే యెలా సంపాదించాలో తలో సలహా ఇచ్చారుకాని ఎవరూ కదల్లేదు.కొంచెం విశాఖ గురించి గుర్తు చెయ్యాలి. అప్పట్లో సిటీ కి వెళ్ళాలంటే టర్నర్స్ చౌల్ట్రీ నే ముఖ్య బస్ స్టాపు. ఇప్పట్లా దాన్ని సూపర్ బజార్ అనే వారు కాదు. నిజానికి అప్పుడు సూపర్ బజారింకా లేనేలేదు.ఆ స్థలంలో ఒక టీచర్ ట్రైనింగ్ స్కూలుండేది. సరే జగదంబ సంగతి చెప్పక్కరలేదు.అప్పట్లో యెల్లమ్మ తోట అనబడే ఆ స్టాపు దగ్గర దిగినా అక్కడేమీ ఉండేవి కావు. అందుకని చౌల్ట్రీ దగ్గర దిగమని మరీ మరీ చెప్పి కాగితం మీద రాసి ఇచ్చి మరీ సాగనంపాం. బస్సుకి పన్నెండు పైసలు సినిమాకి రూపాయి పది పైసలు. ఇంటర్వెల్లో సోడా మూడు పైసలు,తిరిగి బస్సు పన్నెండు పైసలు పైసలు, వెరసి రూపాయి ముఫ్ఫయ్యేడు పైసలు యెందుకన్నా మంచిది రూపాయిన్నర తీసుకెళ్ళమని కూడా చెప్పాం . నవ్వకండి సినిమా కెళ్తే మాఖర్చు ఆ రోజుల్లో అంతే-- మేటనీ కైతే! అదే మొదటాట కైతే తిరుగు బస్సుండదు కాబట్టి ఇంకా తక్కువ.టిఫిను కూడా తింటే మరో ఇరవై ఎనిమిది పైసలు. ఆ మాట పక్కన పెడదాం. వాడు వెళ్ళిన తరవాత ఆ మధ్యాహ్నమంతా వాడు యెలా గడుపుతాడో తలుచుకుని తలుచుకుని ఒకటే ఆనందించాం-- బారిష్టరు పార్వతీశం గారిని కూడా తలుచుకున్నాం.మొత్తానికి మంచి మధ్యాహ్నం.ఇంతకీ యేమయింది?

No comments: